MohanPublications Print Books Online store clik Here Devullu.com

బ్రహ్మ విష్ణు శివాత్మకం దత్తాత్రేయం_dattatreya

dattatreya


బ్రహ్మ విష్ణు శివాత్మకం దత్తాత్రేయం

గురుస్వరూపమై, లోకోద్ధరణకు అవతరించిన శ్రీ మహావిష్ణువు రూపమే దత్తాత్రేయుడు. త్రిమూర్తుల సమష్టిరూపం, గురుః బ్రహ్మః, గురుః విషుః్ణ, గురుదేవో మహేశ్వరః అనే శ్లోకానికి ప్రతీక దత్తాత్రేయుడు. అత్రి, అనసూయ దంపుతుల పుత్రునిగా ఆవిర్భవించిన స్మర్తగామి. తనను స్మరించినవారికి వెంటనే అనుగ్రహించే సిద్ధుడు దత్తుడు. మార్గశిర పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా అవధూత విశేషాలు...

జగదుత్పత్తికర్త్రేచ, స్థితి సంహారహేతవే
భవనాశ విముక్తాయ దత్తాత్రేయ! నమోస్తుతే॥
ఆదౌ బ్రహా హరిర్మధ్యేహ్యంతే దేవస్సదాశివః
మూర్తిత్రయస్వరూపాయ, దత్తాత్రేయ! నమోస్తుతే॥
జరాజన్మవినాశాయ, దేహశుద్ధికరాయచ
దిగంబర! దయామూర్తే! దత్తాత్రేయ! నమోస్తుతే ॥

దత్తాత్రేయ అవతారం జ్ఞాన అవతారం. గురువుగా లోకోద్ధరణ కోసం అవతరించిన రూపం. త్రేతాయుగంలో దత్తాత్రేయుడు అవతరించినట్లు పురాణాల్లో ఉంది. పుణ్యదంపతులైన అనసూయ, అత్రి మహర్షిలకు త్రిమూర్తులు ఆయా సందర్భాల్లో ఇచ్చిన వరాల ఫలితంగా బ్రహ్మ సోముడుగా, విష్ణు దత్తుడుగా, శివుడు దుర్వాసుడుగా జన్మించారు. దీనిలో విష్ణు స్వరూపంగా అవతరించిన దత్తాత్రేయుడిలో త్రిమూర్తి అంశలు ఉన్నాయి.


అవతార ఆంతరార్థంఅత్రి అంటే త్రిగుణాలకు అతీతుడు అని అర్థం. సత్వ, రజో, తమోగుణాలకు అతీతంగా, జాగ్ర, స్వప్న, సుషుప్తావస్థలకు అతీతమైన స్థితి కలిగి దానికి అనసూయ తోడైనవారికి భగవంతుడు దత్తం అవుతాడు అన్నదే ఈ అవతార రహస్యం. అనసూయ అంటే అసూయకు లేకుండుట అంటే ఇతరులలో దోషాన్ని వెదికే గుణం లేకుండుట అని అమరకోశ అర్థం. మూడు గుణాలు/మూడు స్థితులు దాటి దోషాలు వెదకని తత్వంలోకి వెళ్లినవారికి పరమాత్మ సాకారం అవుతాడు అనేది అంతరార్థం. సాక్షాత్తు విష్ణువే తన జన్మకు ముందు అత్రి, అనసూయలకు తనపేరు దత్తుడని తెలిపాడు. మీ తపస్సుకు మెచ్చి దత్తోమయో అహం అంటే నన్ను నేను ఇచ్చుకొంటున్నాను అని స్థితికారకుడు పేర్కొన్నాడు. దత్తః అంటే ఇవ్వబడినవాడు తనకు తాను అత్రిఅనసూయలకు ఇచ్చుకొన్నాడు కాబట్టి దత్త + అత్రిఅనసూయః కలిసి దత్తాత్రేయగా నామం వచ్చింది. సహ్యాద్రి శిఖరంపై దత్త భగవానుడు ఆవిర్భవించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఆర్ణీ గ్రామానికి దగ్గర్లో రేణుకాపురం అనే గ్రామం. దీన్నే మాలాపుర గ్రామం అని కూడా అంటారు. ఇక్కడే అత్రి ఆశ్రమం ఉంది. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని మహూర్‌గఢ్‌గా పిలుస్తున్నారు. దత్త భగవానుడు ఆవిర్భవించిన స్థానం ఇదే.

దత్తాత్రేయుడు త్రిమూర్తి అంశ. దీనిలో విష్ణువు మధ్యలో అటు ఇటూ బ్రహ్మ, మహేశ్వరులు ఉంటారు. ఆయన శంఖం, చక్రం, గదా, పద్మం, త్రిశూలం, డమరుకం, కమండలం, అక్షమాల (జపమాల) ధరించి వీరాసనంలో ఉంటాడు. వీరాసనం అంటే ఎడమతొడపై కుడికాలుని వేసుకొని తన రెండుపాదాలను, పాదుకలను కన్పించేలా కూర్చోవడం. వీటితోపాటు తనచుట్టు నాలుగు కుక్కలు ఉంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీక. ఇక దూరంగా ఆవు ఉంటుంది. ఇది ఉపనిషత్‌లకు సూచిక. దత్తుడు ధరించిన ఆయుధాలు శత్రు సంహారానికి కాదు. కేవలం జ్ఞానమార్గాన భక్తులను ఉద్ధరించడానికి మాత్రమే. ఈ అవతారం జ్ఞానావతారం. ప్రధానంగా దత్తాత్రేయుడిగా, హరి, కృష్ణ, ఉన్మత్త, ముని, ఆనందదాయక, దిగంబర, బాల, పిశాచ, జ్ఞానసాగర అనే 10 రూపాల్ల్లో దర్శనమిస్తాడు. ఈ రూపాలను స్మరించుకొంటే పాపపుణ్యాలను తీసివేస్తాడు. అద్భుత ఫలితాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. ఆయన కాశీ గంగలో స్నానమాచరించి, కొల్హాపురిలో భిక్ష తీసుకొని, సహ్యాద్రి శిఖరంలోని మాలాపురంలో నిద్రపోతారని పురాణాల్లో ఉంది. ఇటువంటి ఈ గురువును పట్టుకోవాలంటే కేవలం స్మరణ చేస్తే చాలు. అందుకే ఆయనను స్మర్తృగామి అంటారు. అవతార పరిసమాప్తిలేని అవతారం దత్త అవతారం.


మేలు చేసే గురువు..బ్రహ్మాండ పురాణ అంతర్గంలో దత్తపురాణం ఉంది. ఇదే మొదటి గురుచరిత్ర. ఇది వ్యాస ప్రోక్తం. భాగవతంలో, మార్కండేయ పురాణంలో ఇలా పలుచోట్ల దత్తుడి గురించి ఉంది. నారదుడు, ప్రహ్లాదుడికి ఇచ్చిన సూచన మేరకు ప్రహ్లాదుడు దత్తాత్రేయుడి దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఉద్భవుడికి చెప్పిన ఉద్భవగీతలో మొదట అధ్యాయం అంతా దత్తుడు గురించే ఉంది. శ్రీవిద్యోపాసనలో త్రిపుర రహస్యాన్ని దత్తుడు పరుశరాముడికి ఉపదేశించినదే. ఇవేకాకుండా దత్తాత్రేయుడు మంత్ర అధిష్ఠానదేవతగా, దత్తకల్పం, దత్తోపాసన, అనఘ సహిత దత్తోపాసన ఇలా పలుచోట్ల ప్రస్తావన ఉంది.
వేదధర్ముడు అనే గురువు సందీపకుడు (కొందరు దీపకుడు అంటారు) అనే శిష్యుడు తనకు 21 ఏండ్లపాటు అవిశ్రాంతంగా చేసిన సుశ్రూలకు మెచ్చి దత్త వైభవాన్ని చెప్పినట్లు పురాణాల్లో ఉంది.

దత్తుడు త్రిమూర్తి స్వరూపమైన విశ్వగురువు. శిష్యునికి భగవంతుని వెలుగు ఎవరి ద్వారా వస్తుందో వారే గురువు. గురువులో గకార సిద్ధివాచకం, రకార పాపనాశకం, ఉకార విష్ణువాచకాలు ఉన్నాయి. గురువులో రెండు ఉకార వాచకాలు పాపనాశనాన్ని చేసి సిద్ధిని ఇచ్చే వ్యాపకత్వమే గురువు. మరో అర్థం ఎవరి నుంచి మేలు పొందినా వారిని గురువు అనాలి. అంటే మేలుచేసినవారు గురువు. దత్తాత్రేయుడికి 24 మంది గురువులు.. వీరంతా లోకంలో ఉన్నవారే. వారు పంచభూతాలు, సూర్యచంద్రులు, పాము, లకుముకి పిట్ట, కీటకం, పతంగం, హరిణం, పూర్ణనాభి, బాలుడు, వేశ్య, ఆవు, కన్య, కొండచిలువ, పావురం, చేప, ఇరుకాసురుడు (బాణాలు తయారుచేసేవాడు), భ్రమరం, పింగళ, ఏనుగు ఇలా ప్రతి ఒక్కరి నుంచి ఒక్కోవిషయాన్ని గ్రహించి వారిని/వాటిని తన గురువులుగా దత్తాత్రేయుడు స్వీకరించారు. దీనిలో పరమార్థం మనం మన చుట్టు ఉన్న ప్రకృతిలోని జీవులు, వస్తువులోని మంచిని గ్రహించి జీవనాన్ని సన్మార్గంలో నడుపుకోవాలని తెలియజేస్తుంది.

దత్తాత్రేయ అవతారంలో ఎందరినో ఉద్దరించాడు. ఆధ్యాత్మిక సిద్ధి, యోగవిద్యను ఎందరికో ఉపదేశించాడు. వీరిలో ప్రహ్లాదుడు, యదురాజు, పరుశరాముడు, కార్తవీర్యార్జునుడు, మహాసతి మదాలస పుత్రుడైన అలర్క వీరిలో ప్రధానమైనవారు. ఇక అవధూత పరంపరకు ఆద్యుడు. దత్తాత్రేయున్ని అవధూత శిరోమణి, ఆదిగురువు అని కూడా పిలుస్తారు. అవధూత అంటే స్వస్వరూపంగా అవస్థితమైన మహాత్ముడు. దీనిగురించి గోరక్ష సిద్ధాంతంలో విశేషంగా పేర్కొన్నారు. ఈ పరంపరలో భాగంగా కలియుగంలో పరమహంస పరివ్రాజకాచార్య, దత్తావతారం, నృసింహ సరస్వతి, శ్రీపాద శ్రీవల్లభుడు, అక్కల్‌కోట స్వామి మహరాజ్, వాసుదేవానంద సరస్వతి తదితర రూపాలుగా అవతరించారు.


దత్తాత్రేయ వైభవంఈ అవతారంలో మొట్టమొదట అత్రి ఆశ్రమంలో ఉన్న వందలమంది దత్తుడిని జ్ఞానబోధ చేయమని ప్రార్థిస్తారు. పలుమార్లు తర్వాత అనిచెప్పి తప్పించుకుంటాడు. ఒకనాడు దగ్గర్లోని సరస్సులోకి వెళ్లి దానిలో అంతర్థానమవుతాడు. బయట శిష్యులు చాలా కాలం వేచి చూస్తారు. కొందరు వెళ్లిపోతారు. అప్పుడు బయటకు వచ్చిన దత్తుడు మధుపానం చేస్తూ, అనఘ సహితుడై సరస్సులో నుంచి బయటకు వస్తాడు. అదిచూసిన శిష్యులు ఈయన మనకు ఏం బోధ చేస్తారని చాలామంది వెళ్లిపోతారు. కానీ కొందరు శిష్యులు మాత్రం ఒక్కడిగా సరస్సులోకి వెళ్లిన దత్తుడు ఇలా రావడం అంటే మనల్ని పరీక్షించడమే అని భావించి స్వామి వెంట పడుతారు. ఆయన తత్వాన్ని వారికి ఉపదేశిస్తాడు. ఇదేవిధంగా జంభాసురుడనే రాక్షసుడు దేవతలను హింసిస్తున్న సందర్భంలో దేవగురువుతో కలిసి దత్తుడి దగ్గరకు వస్తారు. ఆ సమయంలో ఆయన మధుపానం సేవిస్తూ అనఘ సమేతుడై మదోన్మత్తుడిగా దర్శనమిస్తాడు. వారంతా బ్రహ్మజ్ఞానులు కావడంతో స్వామిని ప్రార్థిస్తారు. ఆ సందర్భంలో దేవతలు ఇలా పేర్కొన్నారు చేతిలోని మధువు బ్రహ్మవిద్యాపానం, అతి సౌందర్యవతిగా ఒడిలో ఉన్నది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా వారు కీర్తిస్తారు. దీంతో ప్రత్యక్షమైన దత్తుడు వారికి జంభాసురుడి బాధ తీర్చడానికి మార్గం చెప్పి దేవతలను రక్షిస్తాడు. ఇలా పలు సందర్భాల్లో యుద్ధం చేయకుండా కేవలం జ్ఞానమార్గంలోనే భక్తులకు కల్పతరువుగా మోక్షాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాడు.


దత్త క్షేత్రాలుదేశంలో అనేక దత్త క్షేత్రాలు ఉన్నాయి. సహ్యాద్రిలోని దత్త జన్మస్థానం, గుజరాత్‌లోని గిరినార్, పిఠాపురం, మైసూర్, గానుగాపురం, మహబూబ్‌నగర్ జిల్లాలోని కురమగడ్డ, శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురం (మక్తల్ మండల్), నాగార్జునసాగర్‌కు దగ్గర్లోని ఎత్తపోతల ఇలా పలు క్షేత్రాలు ఉన్నాయి.


దత్తోపాసనకలియుగంలో శ్రీఘంగా భౌతిక ప్రయోజనాలు పొందడానికి, కార్యసిద్ధికోసం దత్తోపాసన, దత్తాత్రేయ వజ్రకవచ పారాయణం, దత్త క్షేత్ర సందర్శన చాలా ఉపయోగపడుతాయని విద్వత్తులు పేర్కొంటారు. దత్తోపాసనలో మంత్రశాస్త్రంతోపాటు తంత్రవిద్యలు ఉన్నాయి. ముఖ్యంగా కార్తవీర్యార్జునుడికి ఉపదేశించిన దానిలో అనేక తంత్రశాస్ర్తాలు ఉన్నట్లు పలు గ్రంథాల్లో ఉంది. ఇక గురుచరిత్ర పారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాసప్రోక్తమైన దత్తచరిత్ర మొదటి గురుచరిత్ర. దీన్ని పారాయణం చేస్తే చాలు సకలం సిద్ధిస్తుందని ఆధ్యాత్మికవాదులు పేర్కొంటారు. సామాన్యులు మొదలు సన్యాసుల వరకు అందరికి శ్రీఘంగా వారి వారి మనోవాంఛలను తీర్చే ఆది గురువు దత్తాత్రేయుడు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list