MohanPublications Print Books Online store clik Here Devullu.com

నాన్న కూచి_Nanna Koochi Trailer | Niharika Konidela, Nagababu | Pranith Bramandapally | Telugu Web Series


Nanna Koochi Trailer | Niharika Konidela, Nagababu | Pranith Bramandapally | 

Telugu Web Series


2.0 (Telugu) | Rajinikanth, Akshay Kumar | Shankar | A.R. Rahman

2.0 (Telugu) | Rajinikanth, Akshay Kumar 

| Shankar | A.R. Rahman


క్షీరాబ్ది వ్రతం _ KsheerabdhiVratam GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


1-11-2017



కార్త్తికంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని , చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు . ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్సనం ఇచ్చే  శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశిరోజు శ్రీమహాలక్ష్మీ తో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట కావునా ఈ ద్వాదశి ని బృందావన ద్వాదశి అని కూడా అంటారు . బృందావనం అంటే మన ఇంట్లో వుండే  తులసి దగ్గర కు వస్తారు  . ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు.  మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా విలిగించక పూయిన ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వేలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు.

దూర్వాస మహర్షి వారి చేత శపించ బడి  వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచన తో  రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మధనం  ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని  మధించినరోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక  పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు  చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.

క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనేఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీరూపంతో అలంకరిస్తారు. సుగంధద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.



మన పురాణ ఇతిహాసాలలో తులసికున్న ప్రాముఖ్యత, ప్రాధాన్యం వెలకట్టలేనిది. ‘తులసి’ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా, లక్ష్మీసమేతంగా మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే తులసిని పూజించినవారి ఇంట ధనధాన్యాదులకు ఎలాంటి లోటు ఉండదని, వారి ఇంట సిరులు పండుతాయని నమ్ముతారు.  తులసి పూజవల్ల అపారమైన పుణ్యఫలాలు సంప్రాప్తిసాయి సత్యాదేవి తులాభారమున . రుక్మిణీదేవి తులసీదళమునుంచి తూచి తకృష్ణుణ్ణి తన వాడుగా చేసుకొంది. దీనితో కృష్ణుడికి తులసి అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. గోదాదేవి తులసి దండలను శ్రీరంగనాధుని కర్పించి అతనికిష్టురాలై శ్రీరంగనాధుని సాన్నిధ్యం పొందింది. వనవాసంలో కూడా సీతాదేవి తులసిని పూజించింది. తులసి వృత్తాంతం, తులసి ప్రశంస, మన పురాణాలలో అనేకచోట్ల ప్రస్తావించి ఉంది. తులసి జన్మవృత్తాంతం తెలిపే పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది.

పురాణగాథ:

తులసి మధురానగరంలో గొప్ప కన్య. శ్రీకృష్ణుని అనురాగాన్ని అపారంగా పొందింది. తులసి, శ్రీకృష్ణుల అనురాగాన్ని ఓర్వలేని రాధ శాపానికి గురై భూలోకాన మాధవీ, ధర్మధ్వజులను రాజదంపతులకు జన్మించింది. ఆ రాజ దంపతులు ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటుండగా, ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. ఆమె రంభ, ఊర్వశి, మేనకల అందానే్నతలదన్నిన అందకత్తెగా ఆమె పేరుగాంచింది. అలాగే ఆమె గుణ రూపాదులలో తుల  లేక పోవడంవల్ల ఆమెకు ‘తులసి’ అని పేరొచ్చింది. బ్రహ్మకోసం తపస్సు చేసి, విష్ణు సాంగత్యాన్ని వరంగా పొందింది. ఇది ఇలా వుండగా శ్రీకృష్ణుని అంశగల సుధాముడు శంఖచూడుడను రాక్షసుడిగా జన్మించాడు. బ్రహ్మనుంచి మరణం లేకుండా వరం పొందాడు. అయితే అతని భార్య పతివ్రతగా ఉన్నంతవరకూ శంక చూడుడికి మరణం సంభవించదని వరమిచ్చాడు. ఒకసారి శంఖచూడుడు తులసి అందానికి పరవశుడై, ఆమెను మోహించి వివాహమాడాడు. తులసిని వివాహం చేసుకున్న శంఖచూడుడు ఆమె ప్రాతివ్రత్య ప్రభావంతో, దేవతలను, మునులను మట్టుబెట్టినా, ఎవరూ ఏమీచేయలేకపోయేవారు. దాంతో శ్రీహరి దేవతలు, మునుల అభీష్టంమేరకు ఓసారి శంఖచూడుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది తన భర్తేననుకుని తులసి శంఖచూడుడి రూపంలో ఉన్న విష్ణువుతో క్రీడించింది. అనంతరం అతను తన భర్తకాదని తెలుసుకుని రాయిని కమ్మనమని శపించింది. శ్రీహరి జరిగిన విషయాన్ని చెప్పగా పశ్చాత్తాప పడింది. శ్రీహరి ఆమెని అనుగ్రహించాడు. ఆమె అప్పటినుంచి లక్ష్మీదేవితో సమానంగా పూజింపబడుతుందని, ఆమె శరీరం గండకీ నదియై ప్రవహించి పుణ్యప్రదమవుతుందని వరమిచ్చాడు. అలాగే ఆమె కేశము తులసిగా జన్మిస్తుందని, తులసి దళాలు, తులసి విష్ణుప్రీతికరాలవుతాయని వరమిచ్చాడు. అలాగే ఆమె శాపాన్ననుసరించి శిలనై సాలగ్రామ రూపాన ఉన్న తాను లక్ష్మీనారాయణాది రూపాలలో ఉంటానని, తులసిని శంఖము, సాలగ్రామమును కూర్చి పూజిస్తే సర్వశ్రేయాలు కలుగుతాయని వరమిచ్చాడు. ఆనాటినుంచి తులసి లక్ష్మీస్వరూపంగా పూజింపబడుతోంది.

తులసి పూజ ఇలా చేయాలి:

తులసి కోట (బృందావనం) ముందు అయిదు పద్మాలు వేసి వాటిమీద దీపాలుంచి తులసి దేవిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. అయిదు రకాల భక్ష్యాలను, ఫలాలను నివేదించి అయిదు తాంబూలాలను సమర్పించాలి. ప్రదక్షిణ నమస్కారాలతో కార్తీక శద్ధ ఏకాదశి వరకూ పూజించాలి. కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం పూజ మొదలైనవి చేసి, తులసీదేవిని, లక్ష్మీనారాయణులను అర్చించాలి. నాటి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశినాడు మానెడు బియ్యపు పిండితో మూడు ముద్దలు చేయాలి. వాటిని నివేదించి తులసివద్ద ఒక దానినుంచాలి. రెండవ దానిని బ్రాహ్మణునికీయాలి. మూడవ దానిని రోటిలోనుంచి పాలు పోసి చెరకు గడలతో దంచాలి. అలాచేయడంవల్ల విశేషమైన పుణ్యఫలాలు లభించి, మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మాంగళ్య వృద్ధి, పుత్ర పౌత్రులు, సర్వసౌఖ్యాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు కూడా నివారింపబడతాయని అవి చెబుతున్నాయి. తులసి మహత్యం గురించి నారదుడు చెప్పగా, శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించాడట. అందువల్ల ఇంతటి మహిమాన్విత తులసి పూజ సర్వజనులకు శ్రేయోదాయకమైన పూజగా కొనియాడబడుతోంది.

తులసి ని Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్ (Ocimum tenuiflorum). 

తులసీధాత్రీ సమేత దామోదర పూజ చేస్తారు. ఈరోజునే  క్షీరాబ్ది ద్వాదశి  అని కూడా అంటారు.
శ్రీ తులసీ స్త్రోత్ర మ్
జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే
యతో బ్రహ్మాదయో దేవాః సృష్టి స్థిత్యంత కారిణీ
నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ప్రదాయికే

తులసీ శ్రీ మహాలక్ష్మీర్విద్యా యశస్వినీ
ధర్మా ధర్మా నవా దేవీ దేవ దేవః మనఃప్రియా
లక్ష్మీప్రియసఖీ దేవీద్యౌర్భమిరచలాచలా
షోడశైతాని నామాని తులస్యాః కీర్తెయేన్నరః

లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం భవేత్
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా
తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే
 














మీ దుకాణంలో G S T గుర్తింపు బోర్డు ఎక్కడ! | GST BOARD

మీ దుకాణంలో

G S T గుర్తింపు బోర్డు ఎక్కడ!


వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టంలో అనేక చర్యలను ప్రభుత్వం పొందుపరిచింది. విక్రయ కేంద్రాల్లో జీఎస్‌టీ గుర్తింపు ధృవపత్రాన్ని వ్యాపారులు తప్పనిసరిగా కనిపించేలా ఉంచడం ఇందులో ఒకటి. విక్రయ కేంద్రం ఎదుట జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యతో కూడిన పేరు బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని కూడా చట్టం చెబుతోంది. ఈ చర్యల వల్ల ఎవరి దగ్గర నుంచి వస్తువులు కొంటున్నాం లేదంటే సేవలు పొందుతున్నామనే విషయాన్ని వినియోగదారులు తెలుసుకునే వీలుంటుంది. అంటే ఆ వ్యాపారి జీఎస్‌టీ కింద నమోదయ్యాడా? లేదా? అనే విషయం తెలుసుకోవచ్చన్నమాట. తద్వారా జీఎస్‌టీ ముసుగులో కొందరు వ్యాపారులు చేస్తోన్న మోసాలకు అడ్డుకట్ట వేసే వీలుంటుంది.
విక్రయ కేంద్రం ప్రాంగణంలో జీఎస్‌టీ గుర్తింపు బోర్డులను తప్పనిసరిగా కనపించేలా ఉంచాలనే నిబంధన అటు సామన్య ప్రజలకే కాదు వ్యాపారుల్లో చాలా మందికి అవగాహన లేదు. అందుకే ముందుగా ఈ నిబంధనలు ఎవరెవరికి, వేటివేటికి వర్తిసాయో, వాటిని పాటించకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

జీఎస్‌టీ గుర్తింపు ధృవపత్రం
జీఎస్‌టీ కింద నమోదైన ప్రతి వ్యాపారి జీఎస్‌టీ గుర్తింపు ధృవపత్రాన్ని విక్రయకేంద్రంలో తప్పక ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వ్యాపారికి ఒకటికి మించి విక్రయ కేంద్రాలుంటే కూడా అన్నింటిలోనూ ఈ ధృవపత్రాన్ని కనిపించేలా ఉంచాలి.

జీఎస్‌టీ గుర్తింపు సంఖ్య బోర్డు
జీఎస్‌టీ కింద నమోదైన ప్రతి వ్యాపారి తమ విక్రయ కేంద్రం ముందు ఉంచే పేరు బోర్డులో జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యను తప్పక పొందు పరిచాలి. ఆ వ్యాపారికి ఎన్ని విక్రయకేంద్రాలుంటే అన్నింటి ముందు ఇదే తరహాలో పేరు బోర్డును ఉంచాల్సి ఉంటుంది.

జరిమానా రూ.25,000
జీఎస్‌టీ ధృవపత్రం లేదా జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యతో కూడిన బోర్డును ప్రదర్శించకుంటే నిబంధనల ఉల్లంఘన కింద రూ.25,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని జీఎస్‌టీ చట్టం చెబుతోంది.

ఎవరెవరికి వర్తింపు
జీఎస్‌టీ కింద నమోదైన ప్రతి ఒక్కరు జీఎస్‌టీ ధృవీకకరణ పత్రం, జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యతో కూడిన బోర్డును ప్రదర్శించాల్సి ఉంటుంది. వర్తకులు, తయారీదార్లు, సేవలు అందించేవారు, ఎగుమతిదార్లు, రవాణాదార్లు, బ్రోకర్లు, ఏజెంట్లు, కాంట్రాక్టర్లతో పాటు హోటళ్లు, లాడ్జింగ్‌, సినిమా హాళ్లు, వినోద పార్కులు, రేసు కోర్సులు, క్లబ్బులు, శాఖలు, గిడ్డంగులు, విక్రయ డిపోలు, ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు, సంఘాలు, బీమా కంపెనీలు, బ్యాంకులు, రైల్వే స్టేషన్లు, ప్రకటనల ఏజెన్సీలు, కార్పొరేషన్లు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా జీఎస్‌టీ కింద నమోదైన ప్రతి ఒక్కరు పై నిబంధనకు తగ్గట్లుగా నడుచుకోవడం తప్పనిసరి.

పారదర్శకతే లక్ష్యం 
జీఎస్‌టీ ధ్రవీకరణ పత్రం, జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యను ప్రదర్శించని వ్యాపారులపై ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రూ.25,000 జరిమానా విధించడాన్ని ప్రారంభించాయి. అందువల్ల ఈ వ్యాసం చదివిన తర్వాతైనా నిబంధనలకు అనుగుణంగా వ్యాపారులు నడుచుకుంటారని ఆశిద్దాం. అలాగే వ్యాపారుల విక్రయ కేంద్రాల్లో పేరు బోర్డులు, ధృవీకరణ పత్రం ప్రదర్శన ఆవశ్యకతపై వినియోగదారులకూ ఎంతో కొంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నాం. పన్నుల వ్యవస్థలో పారదర్శకతను తీసుకొని రావడమే పై నిబంధనలను పొందుపరచడం వెనక ప్రభుత్వ ఉద్దేశం. గతంలోని పరోక్ష పన్నుల విధానంలో ఈ తరహా చర్యలు లేనందువల్లే అప్పుడు పారదర్శకత లోపించింది.

ఏంటి ప్రయోజనం
* విక్రయ కేంద్రంలో జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యతో కూడిన పేరు బోర్డు లేదా ధృవీకరణ పత్రం లేకుంటే ఆ వ్యాపారి జీఎస్‌టీ కింద నమోదుకాలేదని భావించవచ్చు. అలాగే మన దగ్గర నుంచి పన్నులు వసూలు చేసే అధికారం ఆ వ్యాపారికి ఉండదు. 

* కాంపోజిషన్‌ విక్రయదార్లు కూడా తాము కాంపొజిషన్‌ విధానంలో ఉన్నామని బోర్డు పెట్టాలి. దీనివల్ల ఆ వ్యక్తి విక్రయించే వస్తువుల ధరలో పన్ను కలిపే ఉందనే విషయాన్ని వినియోగదారు గ్రహించే వీలుంటుంది. ఎందుకంటే ఈ తరహా వ్యాపారులు వినియోగదార్ల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయకూడదు. 

* జీఎస్‌టీ ధృవీకరణ పత్రం లేదా జీఎస్‌టీ గుర్తింపు సంఖ్యతో బోర్డును ప్రదర్శిస్తున్నాడంటే.. మనం క్రమం తప్పకుండా పన్నులు చెల్లించే, పన్నులు వసూలు చేసే వ్యాపారి వద్ద నుంచే సరుకులు కొంటున్నామనే విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. 

* జీఎస్‌టీ కింద నమోదైన వ్యక్తి దగ్గర నుంచి జీఎస్‌టీ గుర్తింపు ఉన్న వ్యక్తి కొనుగోలు చేశాడంటే.. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ఆ వ్యక్తికి వస్తుందని గ్రహించవచ్చు. 

* జీఎస్‌టీ కింద నమోదుకాని వ్యాపారులు, కాంపోజిషన్‌ డీలర్లు పన్నులు వసూలు చేసే వీలు లేనందున, జీఎస్‌టీ ముసుగులో వాళ్లు వినియోగదారులను మోసం చేయకుండా పై నిబంధనలు తోడ్పడుతాయి.

మూడు నుంచి ఆరు దాకా!... గర్భిణుల ఆరోగ్యం_Three to six! ... Pregnant Health


pragnant,pregnancy

మూడు నుంచి ఆరు దాకా!...
గర్భిణుల ఆరోగ్యం


గర్భిణిగా అతి కీలక దశ... అత్యంత అనుకూలమైన దశ... మూడో నెల నుంచి ఆరోగ నెల దాకా! కడుపులో బిడ... పెరుగుతూ, కదిలే... ఆ మూడు నెలల్లో...ఏం చేయాలి?
ఎలా ఉండాలి?

పిగ్మెంటేషన్‌
గర్భిణుల చర్మం సున్నితంగా మారుతుంది. దాంతో సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉండి చెక్కిళ్ల మీద సీతాకోకచిలుక ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఇవి ప్రసవం తర్వాత పోవచ్చు లేదా అలాగే కొన్నేళ్లపాటు ఉండిపోవచ్చు. కాబట్టి ఈ మచ్చలు రాకుండా చూసుకుంటే మేలు. ఇందుకోసం తప్పనిసరిగా గర్భిణులు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ వాడాల్సి ఉంటుంది. ఈ లోషన్‌ వాడటం వల్ల గర్భంలో ఉన్న బిడ్డకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు.

మూడేసి నెలలతో కూడిన మూడు దశలుగా (ట్రైమెస్టర్‌) విభజిస్తే గర్భం రెండవ దశ, అంటే..సెకండ్‌ ట్రైమెస్టర్‌ గర్భిణులకు ఎంతో అనుకూలమైనది. 3వ నెల నుంచి 6వ నెల...గర్భిణిగా సంపూర్ణ సంతృప్తి పొందే దశ ఇది. మూడవ నెల వరకూ వేవిళ్లు వేధిస్తే, ఎనిమిదో నెల నుంచీ పెరిగిన పొట్టతో కదలికలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి ఇబ్బందులేవీ ఉండనిది రెండవ ట్రైమెస్టర్‌. కాబట్టి ఈ దశను గర్భిణులు మనసారా ఆస్వాదించాలంటే ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవీ లేకుండా చూసుకుంటూ, అర్థం లేని అపోహలకు దూరంగా ఉండాలి.

గర్భిణిలో వచ్చే మార్పులివే!
రెండవ ట్రైమెస్టర్‌లో గర్భిణుల్లో కొన్ని స్పష్టమైన మార్పులు మొదలవుతాయి. అవన్నీ సాధారణమైనవే! అవేంటంటే...
పొట్టలో కదలికలు మొదలవుతాయి.
రొమ్ములు పెద్దవి అవుతాయి.
చర్మం సాగటంతో చారికలుగా మొదలవుతాయి.
పొట్ట, రొమ్ముల పైన చర్మం దురద పెడుతూ ఉంటుంది.
చెక్కిళ్ల మీద నల్ల మచ్చలు (పిగ్మెంటేషన్‌) ఏర్పడతాయి.
రాత్రి వేళ కాళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. గర్భాశయం ఒత్తిడి రక్తనాళాలు, నాడుల మీద పడటం వల్ల ఈ ఇబ్బంది తలెత్తుతుంది.
కాలి గిలకలు, చేతులు, ముఖంలో కొంత వాపు కనిపిస్తుంది.
నడుము, పిరుదుల్లో నొప్పి, పొట్టలో ఏదో గుచ్చుకుంటున్నట్టు అనిపించటం కూడా ఈ దశలో సహజమే! గర్భాశయంలో ఉన్న బిడ్డ పరిమాణం పెరగటం వల్ల కలిగే మార్పులివి. గర్భాశయంతో సంబంధం ఉన్న లిగమెంట్స్‌ సాగటం వల్ల తలెత్తే నొప్పులివి. వీటికి భయపడాల్సిన పని లేదు.
కొంతమందికి దంతాలు వదులవుతాయి. బ్రష్‌ చేసుకునేటప్పుడు రక్తస్రావం కనిపిస్తుంది. ముక్కు నుంచి కూడా కొద్దిగా బ్లీడింగ్‌ కావొచ్చు. ఇదంతా ముఖంలో వచ్చే వాపు వల్ల కణజాలం లావై ఈ మార్పులు కనిపిస్తాయి.
గర్భాశయం వల్ల జీర్ణాశయంపై ఒత్తిడి పడి గుండెల్లో మంట (అసిడిటీ) రావొచ్చు.
కొందరికి ఐదు లేదా ఆరవ నెల చివర్లో లాగి వదిలినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. నొప్పి, బ్లీడింగ్‌ లేకుండా ఇలాంటి కదలికలు కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ముందు జరగబోయే ప్రసవానికి సన్నద్ధమయ్యే క్రమంలో గర్భాశయంలో చోటు చేసుకునే మార్పులివి.
ఈ సమస్యలను అలక్ష్యం చేయొద్దు!
గర్భస్రావం
మూడు నుంచి ఆరు నెలల గర్భం. ఈ దశలో గర్భస్రావం జరగటం చాలా అరుదు. అయినా ఒక్కోసారి అయ్యే అవకాశాలు ఉంటాయి.
అకారణంగా రక్తస్రావం అవుతున్నా, స్పాటింగ్‌తో మొదలై బ్లీడింగ్‌లా మారినా వెంటనే వైద్యుల్ని కలవాలి.
గర్భాశయం ఆకారం సరిగా లేకపోయినా, ప్లాసెంటా (మాయ) కిందకు జారినా బ్లీడింగ్‌ జరగొచ్చు.
విపరీతంగా యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి చికిత్స తీసుకోకపోయినా, మధుమేహాన్ని అదుపులో పెట్టుకోకపోయినా, మూత్ర పిండాల సమస్యలుండి చికిత్స తీసుకోకపోయినా గర్భస్రావం కావొచ్చు.
కవల పిల్లలతో గర్భం దాల్చిన గర్భిణులకు రెండవ ట్రైమెస్టర్‌ చాలా కీలకం. ఈ దశలో వీళ్ల గర్భాశయం తొమ్మిది నెలల గర్భం పరిమాణానికి చేరుకుంటుంది. దాంతో శరీరం ప్రసవానికి సమయం వచ్చిందనుకుని, అందుకు తగ్గట్టు స్పందించటం మూలంగా గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గర్భాశయ ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా గర్భస్రావం కావొచ్చు.
కొంతమందికి గర్భాశయ ముఖ ద్వారం వదులుగా ఉండి లేదా అంతకముందు ప్రసవ సమయంలో వేసిన కుట్ల వల్ల ఆ ప్రదేశం సాగినా గర్భస్రావం జరిగే అవకాశాలుంటాయి.
నెగిటివ్‌ బ్లడ్‌గ్రూప్‌: రక్త గ్రూపు పాజిటివ్‌ ఉండటమనేది సహజం. సాధారణంగా 90 శాతం మంది పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ కలిగి ఉంటారు. ఒకవేళ గర్భిణి నెగిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ కలిగి, గర్భంలో ఉన్న బిడ్డ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ అయి ఉంటే బిడ్డకు రియాక్షన్‌ రావొచ్చు. గర్భంలో ఉన్న బిడ్డ రక్త గ్రూపు తెలుసుకునే వీలుండదు కాబట్టి గర్భిణి నెగిటివ్‌ గ్రూపుకు చెందితే, శరీరంలో యాంటీబాడీలు తలెత్తకుండా ‘యాంటీ- డి’ ఇంజెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో ఎప్పుడైనా రక్తమార్పిడి జరిగితే తల్లికీ, బిడ్డకూ ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి నెగిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌కు చెందిన గర్భిణులు ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. లోపలి బిడ్డ కూడా నెగిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ అయితే ఫర్వాలేదు. అయినా గర్భిణికి ఇంజెక్షన్‌ ఇవ్వటం వల్ల గర్భంలోకి బిడ్డకు ఏ ప్రమాదమూ ఉండదు. కాబట్టి నిక్షేపంగా ఇంజెక్షన్‌ చేయించుకోవచ్చు.
ఉమ్మనీరు పోవటం: కొందరికి గర్భాశయ ఇన్‌ఫెక్షన్ల మూలంగా లేదా ప్రమాదవశాత్తూ పొట్ట ఒత్తుకుపోవటం వల్ల ఉమ్మనీరు కారిపోవచ్చు. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
ప్రిక్లాంప్సియా: గర్భం మూలంగా రక్తపోటు పెరిగే స్థితి ఇది. ఈ పరిస్థితి మొదటిసారి గర్భం దాల్చిన వారికి, ఆరవ నెలలో తలెత్తుతుంది. ఒళ్లు వాచిపోయి, తలనొప్పితో పాటు కళ్ల ముందు మెరుపులు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
జెస్టేషనల్‌ డయాబెటిస్‌
అప్పటిదాకా మధుమేహం లేకపోయినా తల్లితండ్రులు, తోబుట్టువులు మధుమేహులైతే గర్భిణులకు ఈ దశలో మధుమేహం వచ్చే వీలుంటుంది. కాబట్టి తప్పనిసరిగా పరీక్ష చేయుంచుకుని షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంచుకోవాలి.
వంశంలో ఎవరికీ మధుమేహం లేకపోయినా గర్భం దాల్చే సమయంలో అధిక బరువుతో బాధపడే మహిళలు, మొదటి ప్రసవంలో బిడ్డ నాలుగున్నర కిలోల కంటే ఎక్కువ బరువుతో పుట్టినా, ఆ గర్భిణులకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ.
విపరీతమైన దాహం ఉన్నా, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయవలసి వస్తున్నా, నోరు ఎండిపోవటం, అలసట, నీరసం ఉన్నా మధుమేహం లక్షణాలుగా భావించి చికిత్స మొదలుపెట్టాలి.
హైపో థైరాయిడిజం: ఇప్పుడు మన దేశంలో హైపోథైరాయిడిజం సర్వసాధారమైపోయింది. ఈ సమస్య ఉన్న గర్భిణులు ఈ హార్మోన్‌ మాత్రలు వేసుకోకపోతే, పుట్టిన బిడ్డ మానసిక, శరీరక ఎదుగుదల కుంటుపడే అవకాశాలు ఉంటాయి. ఈ పిల్లల ఐక్యులు కూడా తక్కువగా ఉంటాయి.
గర్భం దాల్చక ముందు నుంచే థైరాయిడ్‌ సమస్య ఉన్నవాళ్లు బిడ్డకు ప్రమాదమనుకుని ఆ మందులు ఆపేస్తూ ఉంటారు. ఇది మరింత ప్రమాదకరం.
నిజానికి గర్భం దాల్చిన తర్వాత శరీర బరువు పెరుగుతుంది కాబట్టి అంతకు ముందు వేసుకునే మందుల మోతాదు సరిపోదు. కాబట్టి వైద్యుల సలహా మేరకు మోతాదు పెంచి తీసుకోవలసి ఉంటుంది.
హైపోథైరాయిడిజం ఉన్న గర్భిణులు ప్రతి రెండు నెలలకొకసారి టిఎ్‌సహెచ్‌ పరీక్ష చేయించుకుని మందులు వాడుతూ ఉండాలి.
స్ట్రెచ్‌ మార్క్స్‌ను ఆపే వైద్యం లేదు
మూడవ నెల నుంచి పొట్ట పెద్దదవుతూ ఉంటుంది కాబట్టి చర్మం అడుగున ఉన్న ఎలాస్టిక్‌ లేయర్‌లో చిన్న చిన్న చిరుగులు ఏర్పడతాయి. అవే స్ట్రెచ్‌ మార్క్స్‌గా చర్మంపై కనిపిస్తాయి. ఇవి అందరికీ రావాలని లేదు. కొందరికి రావొచ్చు. ఇంకొందరికి రాకపోవచ్చు. ఇదంతా చర్మ తత్వం మీద ఆధారపడి ఉంటుంది. క్రీమ్స్‌ వాడినా, వాడకపోయినా చర్మ తత్వం ఆధారంగా ఈ చారికలు ఏర్పడతాయి. క్రీమ్స్‌ వాడటం వల్ల సాగిన చర్మం వల్ల మొదలయ్యే దురద తగ్గుతుందేమోగానీ గుర్తులు పడకుండా ఆగిపోవు. గర్భిణి బరువు ఎక్కువ పెరిగినా స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడతాయి.

వ్యాయామంతో సుఖ ప్రసవం
గర్భిణులు ఎటువంటి సంకోచం లేకుండా వ్యాయామం చేయొచ్చు. వ్యాయామం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ప్రసవ సమయంలో శరీరం ఎన్నో ఒడుదొడుకులకు లోనవుతుంది కాబట్టి అందుకు శరీరాన్ని సిద్ధం చేయటం కోసం ముందు నుంచే శరీరానికి వ్యాయామాన్ని అలవాటు చేయాలి. ఇక వ్యాయామం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి.
ఎలాంటి వ్యాయామం చేసినా, బ్లీడింగ్‌, పొట్టలో నొప్పి, కళ్లు తిరగటం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని కలవాలి.
కింద పడిపోయే అవకాశం ఉన్న యోగాసనాలు వేయకూడదు, వ్యాయామాలు చేయకూడదు.
గర్భిణులకు అత్యుత్తమ వ్యాయామం నడకే! ప్రసవానికి ముందు రోజు వరకూ కూడా వాకింగ్‌ చేయొచ్చు. అలాగే నడిచేటప్పుడు చేతులు కూడా కదిలిస్తూ నడిస్తే మంచిది.
మరీ నెమ్మదిగా కాకుండా కొద్దిగా గుండె వేగం పెరిగి, చమటలు పట్టేంత వేగంగా వాకింగ్‌ చేయాలి.
వారానికి 3 నుంచి 5 సార్లు అరగంటపాటు నడక మంచిది.
అప్పటివరకూ నడక అలవాటు లేనివాళ్లు మొదట 10 నిమిషాలతో మొదలుపెట్టి క్రమంగా పెంచుతూ పోవాలి.
యోగాలో ఊపిరి పీల్చుకుని, వదిలే వ్యాయామాలు ఉంటాయి. ఇవి ఊపిరి పీల్చి వదిలే ఈ పద్ధతే పురిటి నొప్పులు వచ్చినప్పుడు తేలిక ప్రసవమయ్యేందుకు ఉపయోగపడుతుంది.
యోగా వల్ల రక్తపోటు, నడుము నొప్పి తగ్గుతుంది.
యోగా కూడా ప్రసవం ముందు రోజు వరకూ చేయవచ్చు.
కాళ్లు పైన, తల కింద ఉంచి చేసే ఆసనాలు వేయకూడదు.
నీటిలో యోగా, ఈత కూడా మంచి వ్యాయామాలే!
ఏవి తినాలి? ఏవి తినకూడదు?
కారం, ఉప్పు, మసాలాలు బాగా తగ్గించాలి.
రోజుకి మూడు సార్లు కాకుండా ఆరు సార్లు తక్కువ పరిమాణాల్లో తినాలి.
నిద్రకు మూడు గంటల ముందే భోజనం ముగించాలి.
ఇద్దరి కోసం తినొద్దు!
పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు సమంగా ఉండే పౌష్టికాహారం తినాలి.
మలబద్ధకం లేకుండా ఉండటం కోసం పీచుపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం తొక్కు తీయని కూరగాయలు తినాలి. పొట్టుతో కూడిన గోధుమ బియ్యం, గోధుమలు వాడాలి. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు, తాజా పళ్ల రసాలు తాగాలి. శరీర తత్వం వల్ల కొందరికి ఎన్ని ఆహార నియమాలు పాటించినా మలబద్ధకం వదలదు. అలాంటివాళ్లు వైద్యులు సూచించే మందులు వాడాలి. వీటి వల్ల బిడ్డ మీద ఏ ప్రభావం ఉండదు. అనవసరమైన అనుమానాలతో మలబద్ధకాన్ని అలాగే వదిలేస్తే, పెద్ద పేగుల కదలికల ప్రభావం గర్భాశయం మీద పడి గర్భస్రావం జరగొచ్చు.
శాకాహారులు తాజా కూరగాయలు, పళ్లు, మాంసాహారులు...గుడ్లు, మాంసం తినొచ్చు.
రోజుకి 100 గ్రాముల బొప్పాయి తినొచ్చు.
పెరగాల్సిన బరువుకూ పరిమితులున్నాయి!
‘నువ్విప్పుడు వట్టి మనిషివి కాదమ్మా! ఒకరికి సరిపడా తింటే సరిపోదు, ఇద్దరు మనుషులకు సరిపడా తినాలి’...సర్వసాధారణంగా గర్భిణులందరికీ ఈ రకమైన మాటలు సుపరిచితమే! కానీ ఇలా చెప్పేవాళ్లు గర్భంలో ఉన్నది మనిషి కాదు, కొన్ని సెంటీమీటర్ల మేర పొడవుండే చిన్న పిండమేననే వాస్తవాన్ని గ్రహించరు.
మూడు నుంచి ఆరు నెలల గర్భంలో బిడ్డ గరిష్ఠంగా అర కిలో నుంచి 2 కిలోల బరువు మాత్రమే పెరుగుతుంది. కాబట్టి ఆ పెరుగుదలకు సరిపడా తింటే సరిపోతుంది.
అంతకు మించి అదనంగా తినేదంతా గర్భిణుల్లో కొవ్వులా పేరుకుని ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
గర్భం దాల్చిన మహిళ తొమ్మిది నెలల కాలంలో పెరగాల్సిన శరీర బరువు ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదు. గర్భం దాల్చినప్పుడు ఆ మహిళ ఎంత బరువుందనే లెక్కను బట్టి పెరగాల్సిన శరీర బరువులో తేడాలుంటాయి.
‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడిసిన్‌ 2009’ గర్భిణులు పెరగాల్సిన బరువు గురించి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ఇప్పటికీ ప్రపంచదేశాలన్నీ వీటినే అనుసరిస్తున్నాయి. ఆ ప్రమాణాలు ఏంటంటే....
అవసరాని కంటే తక్కువ బరువు ఉన్నవాళ్లు (అండర్‌ వెయిట్‌) వాళ్లు 12 నుంచి 18 కిలోల బరువు పెరగాలి.
బిఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) నార్మల్‌గా ఉన్నవాళ్లు 11 నుంచి 16 కిలోల బరువు పెరగాలి.
బిఎమ్‌ఐ 20 నుంచి 30 ఉండి, అధిక బరువు ఉన్నవాళ్లు 7 నుంచి 11 కిలోల బరువు పెరిగితే చాలు.
బిఎమ్‌ఐ 30 దాటి, ఒబేసిటీ ఉన్నవాళ్లు 5 నుంచి 9 కిలోల బరువే పెరగాలి.
కవలలతో గర్భం దాల్చినవాళ్లు పైన చెప్పిన కోవను బట్టి సూచించిన బరువు కంటే అదనంగా మరో 3 నుంచి 5 కిలోలు పెరగొచ్చు.
పరిమిత ఆహారం చాలు!
బరువు పెరగకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం తగ్గించాలి కదా! అలా తగ్గిస్తే బిడ్డ ఎదుగుదల మందగించదా? అని గర్భిణులు భయపడాల్సిన అవసరం లేదు.
పరిమిత ఆహారం తీసుకున్నా బిడ్డ... తల్లి శరీరం నుంచి కొవ్వు, పోషకాలను గ్రహిస్తుంది. 
గర్భిణిగా నిర్ధారణ జరిగిన తర్వాత, తగినంత శరీర బరువు ఉండేవాళ్లు వారానికి అర కిలో చొప్పున బరువు పెరిగితే సరిపోతుంది. దీన్నిబట్టి మొదటి నెల నుంచి రెండు నెలలు దాటేవరకూ 0.5 నుంచి 2 కిలోల బరువు పెరగొచ్చు. కాబట్టి బిడ్డ ఎదుగుదల కోసం ప్రత్యేకంగా, అదనంగా తినాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నుంచి వారానికి అర కిలో చొప్పున పెరగాలి.
3 నుంచి 9 నెలల కాలంలో రోజుకి అదనంగా 340 క్యాలరీలుండే ఆహారం తింటే సరిపోతుంది. కవల పిల్లలతో గర్భం దాల్చిన వారు మరో 100 క్యాలరీలు ఎక్కువ తీసుకోవచ్చు.
గర్భిణులు శరీర బరువును అవసరానికి మించి పెరగకుండా చూసుకోవాలి. పరిధి మించితే రక్తపోటు పెరిగి, సిజేరియన్‌ సర్జరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.
తల్లి బరువు పెరిగితే ఆమెతోపాటు బిడ్డా బరువు పెరుగుతుంది. దాంతో పెద్ద బిడ్డ ప్రసవం కష్టమై సర్జరీ చేయాల్సి రావొచ్చు. ఇలా అధిక బరువుండే తల్లి ప్రసవం తర్వాత బరువు తగ్గకుండా రెండోసారి గర్భం దాల్చితే, మధుమేహం, రక్తపోటు సమస్యలు పెరుగుతాయి.

డాక్టర్‌ శ్రీ లక్ష్మి దాయన,
కన్సల్టెంట్‌ ఇన్‌ గైనికాలజికల్‌ ఆంకాలజీ,
అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌,
జూబ్లీ హిల్స్‌,హైదరాబాద్‌






బ్రహ్మకు గుడి లేదు,పూజా లేదు!_Brahma does not have a temple, No Pooja!


guru.gods,brahma

బ్రహ్మకు గుడి లేదు,పూజా లేదు!
Brahma does not have a temple, No Pooja

    గురుర్బ్రహ్మ్ర... అంటాం. గురువు బ్రహ్మ ఎలా అయ్యాడు? బ్రహ్మగారికి పూజలు లేవు కదా. అలా లేకపోవడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. వాటిలో ఒకటి– బ్రహ్మగారు కొత్తగా అనుగ్రహించడానికి ఏమీ లేదు కనుక. అంటే... మనం చేసిన కర్మఫలితానికి ఈ శరీరాన్ని ఇచ్చేసాడు. మళ్ళీ ఇవ్వాలంటే ఈ శరీరం పడిపోవాలి. ఈ శరీరంతో ఉండగా ఇక బ్రహ్మగారు కొత్తగా అనుగ్రహించడానికి ఏముంది.. అందుకని ఆయనకు గుడిలేదు, పూజలేదు. స్థితికారుడైన విష్ణువు, జ్ఞానదాత అయిన మహేశ్వరుడు మాత్రం అనుగ్రహిస్తారు.


బ్రహ్మ సృష్టి చేస్తాడు. సృష్టికంతటికీ పెద్దవాడు. అందువల్ల ఆయనను గౌరవించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం చేసిన కర్మలను బట్టి శరీరాన్ని ఇస్తుంటాడు. మనుష్యుడు పొందిన ఈ శరీరాన్ని బట్టి కర్మాధికారం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. ’జంతూనాం నరజన్మ దుర్లభం’అంటారు శంకరభగవత్పాదులు. అంటే అందరూ పశువులే. పశువుకానివాడు ఉండడు. పశువు అంటే పాశం చేత కట్టబడినది. జన్మ అది ఒక రాట(పశువులను కట్టే గుంజ).

కర్మపాశాలు పలుపుతాళ్ళు. అవి మెడకు తగిలి ఉండడంవల్ల ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి మనుష్యుడు ఒక శరీరంలోకి వస్తాడు. ఆ కర్మపాశాలను తెగకోయకలిగినవాడు–పశుపతి. ’ఈశ్వరా! నేను పశువుని. మీరు పశుపతి. నన్ను ఉద్ధరించడానికి మనిద్దరి మధ్య ఈ సంబంధం చాలదా’ అన్నారు శంకరులు.

కాబట్టి బ్రహ్మగారిచ్చిన ఈ శరీరం ఒక అద్భుతం. దేవతలు, మనుష్యులు, రాక్షసులు, మిగిలిన తిర్యక్కులు (భూమికి వెన్నుపాము అడ్డంగా కలిగిన ప్రాణులు).. అలా అన్నిటిలోకి మనుష్యుల శరీరమే గొప్పది. మనుష్యుడు ఎక్కడుంటాడు... మర్త్యలోకంలో ఉంటాడు. మర్త్యలోకమంటే.. మృత్యువుచేత గ్రసింపబడేది. అంటే ఈ లోకంలోకి ఏ ప్రాణివచ్చినా అది వెళ్లిపోతుంది ఒకనాడు.‘జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ’’. వచ్చిన ప్రతి శరీరం వెళ్ళిపోవలసిందే. అయినా మనుష్య శరీరం చాలా గొప్పది. కారణం ?

దేవతలు మనకన్నా గొప్పవాళ్ళంటారేమో! కానీ వారి శరీరాలకు కర్మాధికారం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వాళ్లకా అధికారం లేదు. వాళ్ళ పుణ్యం క్షీణించిపోయే వరకు దేవలోకాల్లోఉండి తరువాత మర్త్య లోకంలో పడిపోయి మళ్ళీ సున్నతో మొదలు పెడతారు. కానీ మనుష్యుడు అలా కాదు. ఇక్కడుండి పుణ్యం చేసుకుని దేవలోకానికి వెళ్ళగలడు. లేదా చిత్తశుద్ధి కలిగి, దాని వలన జ్ఞానం కలిగి, మోక్షం కావాలని కోరుకుని తద్వారా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలడు.

మనుష్యశరీరంతో వచ్చినా, దానివిలువ తెలియనప్పుడు పాపకర్మలే చేసి కేవలం తాను బతికితే చాలని, ఇతరులగురించి ఆలోచించకుండా, శాస్త్రాధ్యయనం చేయకుండా, గురువుగారి పాదాలు పట్టుకోకుండా స్వార్థంతో బతికి చివరకు మళ్ళీ కొన్ని కోట్లజన్మల వెనక్కి తిర్యక్కుగా వెళ్ళిపోగలడు. మోక్షం పొందాలన్నా, దేవతా పదవులలోకి వెళ్ళాలన్నా, పాతాళంలోకి వెళ్ళాలన్నా, తిర్యక్కుగా వెళ్ళిపోవాలన్నా... మనుష్య శరీరానికే. అంటే పైకెక్కాలన్నా, కిందకుపోవాలన్నా ఇక్కడికి రాకుండా ఉండాలన్నా అటువంటి కర్మచేయగల అధికారం ఉన్న ఏకైక ప్రాణి సృష్టిలో మనుష్యుడు ఒక్కడే.

ఈ శరీరాన్ని బ్రహ్మగారిచ్చారు. ఇస్తే... ఏమిటి దానివల్ల ఉపయోగం? సనాతనధర్మంలో ఆశ్రమ వ్యవస్థ వచ్చింది ఎందుకు... మెలమెల్లగా వ్యామోహాన్ని తీసేసి భగవంతునివైపు నడిపించడానికి. అందుకే ఎప్పుడు ఆశ్రమం మారినా, ఆ మార్పుచేత కట్టు మీద కట్టు వేసినా, ఆ కట్టువేయవలసినవాడు ఎవడు... అంటే... గురువొక్కడే. గురువుకు తప్ప ఆ కట్టువేసే అధికారం మరెవ్వరికీ లేదు.








కరుణాసముద్రుడు కడలి కపోతేశ్వరుడు _kapotheswarudu


East godavari, siva temple,kapotheswarudu, kadali,

కరుణాసముద్రుడు కడలి కపోతేశ్వరుడు
kapotheswarudu

    జగతిలోని ప్రతి అణువులోనూ శివతత్వం ఇమిడి ఉన్నదన్న పరమతత్వాన్ని ప్రబోధించే దివ్యక్షేత్రం కడలి కపోతేశ్వర క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధికెక్కిన శైవ క్షేత్రాల్లో ఒకటిగా, కుజ, రాహుకేతు దోషాలను రూపుమాపే మహిమాన్విత క్షేత్రంగా గుర్తింపు పొందింది ఈ క్షేత్రం. భక్తుల పాలిట కరుణాసముద్రుడిగా పూజలందుకుంటున్న కపోతేశ్వర స్వామివారికి ఎంతో గొప్ప పౌరాణిక నేపథ్యం ఉంది.

    పూర్వం అటవీ ప్రాంతంగా ఉన్న కడలి అనే ప్రాంతంలో ఒక పావురాల జంట నివాసం ఉండేది. తన వృద్ధ తల్లిదండ్రుల ఆకలి బాధను తీర్చేందుకు ఒక వేటగాడు అడవికి వేట కోసం బయలుదేరుతాడు. ఆ సమయంలో అధికంగా వర్షం కురవడంతో వేటగాడికి ఎటువంటి ఆహారం లభ్యం కాదు. వర్షానికి తడిసి ముద్దయిన వేటగాడు పావురాలు కాపురం ఉంటున్న చెట్టుకింద తలదాచుకుంటాడు. చలికి వణుకుతూ తన తల్లిదండ్రులకు ఆహారం సంపాదించి పెట్టలేని జీవితం ఎందుకని బాధతో తల్లడిల్లిపోతాడు. చెట్టుపైన ఉన్న పావురాలు వేటగాడి బాధను గ్రహించి తమ గూటిలోని ఎండుపుల్లలను చెట్టు కింద ఉంచి పక్కనే ఉన్న శ్మశానంలోని రగులుతున్న నిప్పుపుల్లను తెచ్చి మంట రాజేసి వేటగాడిని చలిబాధ నుంచి విముక్తి చేస్తాయి. చలి నుంచి తేరుకున్న వేటగాడిని తమ అతిథిగా భావించి పావురాల జంట ఆ మంటలో దూకి ప్రాణత్యాగం చేసి వేటగాడికి ఆహారమవుతాయి. పావురాల త్యాగానికి చలించిపోయిన వేటగాడు, వాటి ఔదార్యం ముందు తానెంత అనే భావనతో విరక్తి చెంది అదే మంటలో దూకి ఆత్మత్యాగం చేసుకుంటాడు.

   పావురాల అతిథి ధర్మానికి, కారుణ్యానికి పరమశివుడు సంతోషించి ప్రత్యక్షమై పావురాల జంటను తనలో ఐక్యం చేసుకుంటాడు. పావురాలు మహాశివుడిని ప్రార్థించి వేటగాడిని బతికించాలని వేడుకుంటాయి. అలాగే తాము ప్రాణత్యాగం చేసుకున్న ప్రాంతంలో భక్తులను అనుగ్రహించేందుకు ఆ ప్రాంతంలో ఆవిర్భవించవలసిందిగా కోరడంతో పరమశివుడు శ్రీ కపోతేశ్వర స్వామిగా కొలువుదీరారు. కపోత జంటను తనలో లీనం చేసుకున్న గుర్తుగా శివలింగంపై రెండు వైపులా పావురాల తల, రెక్కలు, తోక గుర్తులు ఉంటాయి. వీటిని స్వామి వారికి అభిషేకాలు చేసే సమయంలో నిజరూప దర్శనంలో భక్తులు వీక్షించవచ్చు. గర్భాలయంలో ఉత్తరాభిముఖంగా ఆవిర్భవించిన స్వామికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తన పడగలతో నీడపట్టాడు. అందుకే ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రుని రూపంలో ఇలవేల్పుగా వెలియడంతో శివలింగంతో పాటు నాగేంద్రుడు కూడా ఒకే పీఠంపై నిత్య పూజలు అందుకుంటున్నారు. నిత్యం శ్రీ కపోతేశ్వరస్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రతి మాస శివరాత్రికి లక్షబిల్వార్చన పూజలు జరుగుతాయి. మార్గశిర మాసంలో జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు సుబ్రహ్మణ్యేశ్వరునికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవాలు జరిపిస్తారు.

గంగాజలం అంతర్వాహినిగా...
ఆలయానికి అనుకుని ఉన్న కొలను కపోతగుండం (చెరువు)గా ప్రసిద్ధి చెందింది. కాశీలోని గంగాజలం ఈ గుండంలోకి అంతర్వాహినిగా ప్రవహిస్తోందని భక్తుల విశ్వాసం. ప్రతి మాఘమాసం ఆదివారం నాడు కాశీ నుంచి గంగాజలం అంతర్వాహినిగా వచ్చి కపోతగండంలో కలవటంతో ఆ రోజు మారేడు పత్రాలు ఆ గుండంలో వేస్తే మునిగిపోతాయని, ఆ రోజున కపోత గుండంలో స్నానమాచరించి కపోతేశ్వరుని దర్శిస్తే మోక్షం కలుగుతుందని అర్చకులు వివరిస్తున్నారు.

శ్రీ చక్ర సహిత త్రిపుర సుందరీ దేవి
జగద్గురువులు ఆది శంకరాచార్యులు భారత దేశ పాదయాత్ర చేస్తూ అష్టోత్తర శ్రీ చక్ర సహిత అమ్మవార్ల ఆలయాలను 108 చోట్ల ప్రతిష్ట చేశారు. దీనిలో భాగంగా ఈ క్షేత్రంలో శ్రీ కపోతేశ్వరస్వామి వారి ఆలయానికి ఎడమవైపు శ్రీ చక్ర సహిత బాలా త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అమ్మవారికి నిత్య కుంకుమపూజలు నిర్వహిస్తారు.

క్షేత్ర పాలకుడు జనార్దనుడు
కపోతేశ్వరస్వామి ఆలయానికి క్షేత్ర పాలకుడుగా జనార్దన స్వామి ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, భద్రకాళీసమేత వీరభద్రస్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, కుమార స్వామి, కనకదుర్గాదేవి, నవగ్రహాలు, కాలభైరవస్వామి, శ్రీ చక్ర సహిత బాలాత్రిపుర సుందరీదేవి, చండీశ్వరుడు, లింగాకారంలో సూర్యనారాయణమూర్తి, పార్వతీదేవి, శ్రీదేవి భూదేవి సమేత సత్యనారాయణస్వామి, సువర్చల సహిత ఆంజనేయస్వామి వారి ఉపాలయాల్లో కొలువుతీరారు. సంతాన ం లేని దంపతులు స్వామిని దర్శించుకుని పూజ చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.

చారిత్రక నేపథ్యం
క్రీ.శ. 15, 16 శకాలలో పల్లవ రాజులు కపోతేశ్వరస్వామికి ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆలయ ఆవరణలో దేవనాగర లిపిలో శాసనం ఉంది. రెండు కపోతాలు, ఒక వేటగాడు చేసిన ప్రాణత్యాగానికి ప్రతీకగా శివుడు ఈ ప్రాంతంలో వెలసినట్టు పురాణగాథతోపాటు బోయవాడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా శిలారూపం ఉంది.

ఈ క్షేత్రాన్ని ఇలా చేరుకోవచ్చు...
కడలి శ్రీ కపోతేశ్వరస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు క్షేత్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిపాక సెంటరు చేరుకోవాలి. అక్కడ నుంచి ఆటోలు లేదా ట్యాక్సీల ద్వారా క్షేత్రానికి వెళ్లవచ్చు. రాజమండ్రి నుంచి 71 కి.మీ., రాజోలు నుంచి 8 కి.మీ., అమలాపురం నుంచి 22 కి.మీ., దూరం.

సమీపంలోని దర్శనీయ క్షేత్రాలు
శ్రీ కడలి కపోతేశ్వరస్వామి వారి ఆలయానికి సమీపంలో పలు దర్శనీయ క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి 10 కి.మీ., దూరంలో ఆదుర్రు గ్రామంలో బౌద్ధస్తూపం, 15 కి.మీ., దూరంలో అప్పనపల్లి గ్రామంలో శ్రీ బాలబాలాజీ ఆలయం, 30 కి.మీ., దూరంలో రాజోలు మీదుగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, 35 కి.మీ. దూరంలో అమలాపురం మీదుగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ఆలయాలు ఉన్నాయి.

కుజదోష నివారణ క్షేత్రం
స్వయంభువుగా కొలువుతీరిన స్వామి వారి ఆలయంలో శైవాగమ సంప్రదాయం ప్రకారం నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతాయి. భక్తులు 11 మంగళవారాలు క్రమం తప్పకుండా స్వామి వారిని దర్శించుకుంటారు. వివాహం కాని వారు, సంతానం లేని దంపతులు, కుజ దోష నివారణ కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి విచ్చేస్తారు.
కాకాని వెంకట సత్య కృష్ణకుమార్, ప్రధాన అర్చకులు
- వి. వీర నాగేశ్వరరావు సాక్షి, రాజోలు










ధనస్సులోకి శని ప్రవేశించాడు భాగం_Saturn (Sani) Transit 2017 - Influences on twelve rasis introduction



ధనస్సులోకి 
శని ప్రవేశించాడు భాగం - 1
శ్రీ హేమలంబ నామ సంవత్సర కార్తిక మాసం శుక్ల సప్తమి గురువారం తేదీ 26 అక్టోబర్ 2017 మధ్యాహ్నం 3 గంటల 28 నిముషాలకు మూల నక్షత్ర 1వ పాదమైన ధనుస్సు రాశిలోకి శని గ్రహం ప్రవేశించాడు. తిరిగి ధనుస్సు నుంచి 2020 జనవరి 24 వ తేదీ తదుపరి రాశియైన మకరంలోకి ప్రవేశించనున్నాడు. 821 రోజుల పాటు ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాడన్నమాట. అయితే ఆయుష్కారకుడైన శని ధనుస్సు రాశి ప్రవేశం చేయగానే, మేష రాశివారికి అష్టమ శని, సింహరాశి వారికి అర్ధాష్టమ శని, తులా రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయిందన్నమాట.

వృషభ రాశివారికి అష్టమ శని, కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని, మకర రాశి వారికి ఏలినాటి శని, ప్రారంభం కాగా వృశ్చిక రాశి వారికి చివరిభాగ (మూడవ భాగం ) ఏలినాటి శని, ధనుస్సు రాశి వారికి మధ్య భాగం (రెండవ భాగం) ఇదే సమయం నుంచే ప్రారంభమయ్యాయి. ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ శని అనగానే నూటికి 99 మందికి వెన్నులో చలి పుడుతుంది. ఇంకేముంది శని గ్రహం వచ్చి పడింది. ఇక ఏమి చేసినా పీడ ఏర్పడుతుంది అని భావించే వారి సంఖ్య చాలా ఎక్కువ. కనుక అలాంటిదేమి ఉండదని ధైర్యంగా ఉంటూ శని ఆయుష్కారకుడని తెలుసుకుని, అంతర్గత శత్రుత్వ పోకడలు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి వాటిని అడ్డుకొనగలిగితే సర్వకాల సర్వావస్థలలో విజయకేతనం ఎగరవేయగలరు.

జ్యోతిష శాస్త్ర నిర్ణయం ప్రకారంగా ఆయుష్కారకుడైన శని మకర, కుంభ రాశులకు అధిపతిగా ఉంటూ, ద్వాదశ రాశులు కలిగిన ఈ ఖగోళ మండలాన్ని చుట్టి రావటానికి 30 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఈ ఖగోళ మండలాన్ని చంద్రుడు చుట్టి రావటానికి 29 రోజుల 12 గంటల 44 నిముషాల 3 సెకన్ల కాలం పట్టును. అంటే ఎంత వేగంగా 12 రాశులను తిరిగి వస్తున్నాడో.. ఈ వేగాన్ని చూస్తే అర్ధమవుతుంది.

జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి, మనః కారకుడు, శనికి అంతర్గత శత్రువు. ఇట్టి చంద్రుడు, జన్మించిన సమయానికి ఏ నక్షత్రంలో సంచారం ఉండునో ఆ నక్షత్రమే మనకు జన్మ నక్షత్రం అవుతుంది. ఈ జన్మ నక్షత్రం ఏ రాశిలో ఉంటుందో ఆ రాశిని మనం జన్మ రాశిగా పిలుచుకుంటుంటాం. ఇది అసలు కథ.

ప్రణతి టెలివిజన్ ఛానల్ లో ధనుస్సు రాశి శని ప్రవేశం గురించి ఉపోద్ఘాతము మరియు 12 రాశుల వారికి ఫలితాలు, సలహాలు, పరిహారాలు అనేవి చిన్న వీడియోలలో ఇవ్వటం జరిగింది. కానీ ఒక్కో రాశి వారు తెలుసుకోవాల్సిన సమాచారం ఎంతెంతో ఉంది. కారణమేమంటే శనికి అంతర్గత శత్రువైన చంద్రుడు సంచారం చేసే నక్షత్రంలోనే మనం జన్మించాం. మన జన్మ నక్షత్ర జన్మ రాశికి తగినట్లుగా పక్షం పక్షం, మాసం మాసం ఫలితం ఇవ్వాలంటే ఒక్కోసారి సమయాన్ని అత్యధికంగా కేటాయించాలి. అందుకోసంగా ఈ 821 రోజుల సంచారంలో ఏ ఏ రాశికి శని ఎంత దూరంలో ఉంటున్నాడు, ఏమి చేయబోతున్నాడు, చేస్తే ఏమి ఇస్తాడు, ఇస్తే ఉంచుతాడా తిరిగి తీసుకుంటాడా అనే ఆసక్తికరమైన అంశాలు ఎన్నెన్నో ఉన్నాయి. కళ్ళకు కట్టినట్లుగా రాశుల వారీగా నక్షత్రాల వారీగా సమయానుకూలంగా తెలియచేస్తుంటే తగిన నిర్ణయాలతో పాఠకులు ముందుకు విజయ పంథాలో వెళ్లగలరనే ఆలోచన నా మదిలో మెదిలింది.

ఈ పరంపరలో ఈ 821 రోజుల ధనూరాశి సమాచారంలో భాగంగా ఆయన ఒక్కొక్క రాశికి ఒక్కో మూర్తిత్వంతో (వేష ధారణతో), ,అనుకూలంగాను ప్రతికూలంగాను ఉంటుంటాడు. జ్యోతిష పరంగా జన్మ రాశి నుంచి 3వ లేక 6వ లేక 11వ స్థానాలలో ఉంటే విశేషతలను ఇస్తాడనేది మొదటి మాట. అంటే జన్మ రాశి నుంచి 1,2,4,5,7,8,9,10,12 వ రాశులలో ఉంటే ఫలితాలు ఏమి ఇవ్వడని నిర్ణయం.

ఈయన సంచారం చేసినంత కాలం 4 రకాల మూర్తిత్వాలతో ఉంటుంటాడు. అవి సువర్ణ మూర్తి, రజత మూర్తి, తామ్ర మూర్తి, లోహ మూర్తి అని పేర్లు. అనుకూలంగా ఉన్న స్థానాలలో సువర్ణ, రజత మూర్తులుగా ఉంటే విశేష ఫలితాలను మరింతగా ఇస్తాడని భావము. అలా కాక అనుకూల ఫలితాలు ఇచ్చే 3, 6 , 11 స్థానాలలో లోహ మూర్తిగా లేక తామ్ర మూర్తిగా ఉంటే ఫలితాలు అనుకూలంగా ఇవ్వడని భావము. అలా కాక వ్యతిరేక స్థానాలలో సువర్ణ, రజత వేష ధారణలు కల్గి ఉంటే అనుకూలంగా ఫలితాలను ఇస్తాడు. ఈ వ్యతిరేక స్థానాలలోనే లోహ తామ్ర మూర్తిత్వాలు ఉన్నాయనుకుంటే ఇంకా వ్యతిరేకతలని అర్థం. ఇప్పుడు చెప్పినదంతా రెండవ మాటగా భావించాలి.

ఇక 3వ మాట ఏమిటంటే స్థానమేదైనా కానీ, రూపం ఏదైనా కానీ ఫలితం అనుకూలంగా వస్తున్నా సమయంలో ఇతర గ్రహాలు ఏవైనా అడ్డు తగిలితే ఫలితం ఆగిపోతుంది. ఒకవేళ చెడు ఫలితాలు వచ్చే సమయంలో అడ్డు తగిలితే... చెడు ఫలితాలు ఉండవు. అలా కాక మంచి ఫలితాలు వచ్చే సమయంలో అడ్డు తగిలితే మనం కొంచెం బాధపడాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ తెలియచేస్తాను. సినిమాలలో ఒక వ్యక్తిని తరుముకుంటూ మరో వ్యక్తి కార్ లో వెంబడిస్తుంటాడు. ఇంతలో రైల్వే గేట్ వచ్చింది. మొదటి వ్యక్తి దాటగానే గేట్ పడిపోయింది. తరుముకుంటూ వచ్చే వ్యక్తి గేట్ దగ్గర ఆగిపోయాడు. ఇదే చక్కని ఉదాహరణ. అంటే ప్రతికూలత వెంటాడుతున్న సమయంలో ఆ రైలు గేట్ రక్షణగా కాపాడింది అనుకోవాలి. దీనినే జ్యోతిష పరిభాషలో వేధ అంటారు.

కనుక శని గ్రహం నుంచి అనుకూలతలు మనకు వస్తున్న సందర్భాలలో వేధలు (రైల్వే గేట్ ) లేకుండా ఉంటే బావుండు అనుకుంటారు. అలాగే వ్యతిరేకతలు వచ్చే సందర్భాలలో వేధ ఉంటే బావుండు అనుకుంటారు (ఎందుకనంటే సమస్యల నుంచి బయటపడవచ్చు అనే ఆలోచన అన్నమాట ). కనుక శని గ్రహ అనుగ్రహం గురించి 821 రోజులలో ద్వాదశ రాశులకు ఏయే విధంగా పరిస్థితులు ఉంటాయో అనుకూలతలు ఎలా ఉంటాయో, ప్రతికూలతలు ఎలా ఉంటాయో, ఎలాంటి పరిహారాలు చేయాలో, ధారావాహిక పోస్టింగ్ లలో ఉంచగలను. కనుక ఈ ధారావాహికలు వరుసగా చదవటానికి ప్రయత్నం చేయండి. ప్రపంచవ్యాప్త జ్యోతిష చరిత్రలో ప్రప్రధమంగా మరింత లోతైన విశ్లేషణతో ప్రతి నెలలో ఉన్న తేదీలతో పాటుగా మరిన్ని అంశాలన్నింటినీ మీకందించబోతున్నాను. ఈ రోజే శని ప్రవేశించాడు, పరిహారం రేపే చేయాలి అని తొందర పడవద్దు. నవంబర్ 17 నుంచి ద్వాదశ రాశుల వారు పరిహారాలు చేయవలసి ఉంటుంది. కనుక నిదానంగా చదవండి, ఆకళింపు చేసుకొని పాటించండి. భయపెట్టే వారిని దూరంగా ఉంచండి.

ఈ విశ్లేషణను నా బ్లాగ్ నుంచి తస్కరించి ముందు మాటలు వెనుక, వెనుక మాటలు ముందు పెట్టి తమ తమ పాండిత్యాన్నంతా ప్రదర్శించే ఘనా పాటీలు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. కనుక గమనించవలసినదిగా కోరుతున్నాను. - దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ


























99/-


ఇలా హ్యాక్‌ చేస్తారు... జాగ్రత్త!_Hacked like this ... Beware!

coputer.Hacked, Beware,

లా హ్యాక్‌ చేస్తారు...
జాగ్రత్త!

కింగ్‌ అనే పదం వింటే చాలామందికి వెన్నులో వణుకు వస్తుంటుంది. ముఖ్యంగా ఇ మెయిల్‌, ఫేస్‌బుక్‌ వంటి పలు సర్వీసుల పాస్‌వర్డ్‌లు హ్యాకింగ్‌కి గురవడం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. ఈ నేపథ్యంలో పాస్‌వర్డ్‌లను హ్యాక్‌ చెయ్యడానికి హ్యాకర్లు ఏయే పద్ధతులు అనుసరిస్తుంటారో తెలుసుకుంటే మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు.

డిక్షనరీ ఎటాక్‌
ఓ వ్యక్తిది గానీ, సంస్థది గానీ పాస్‌వర్డ్‌ తెలుసుకోవాలంటే హ్యాకర్లు మొదట ప్రయత్నించేది ఈ డిక్షనరీ ఎటాక్‌. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది పాస్‌వర్డ్‌లు రామ్‌ అనో, కుమార్‌ అనో, జాన్‌ అనో, పల్లవి అనో, కంప్యూటర్‌ అనో అందరికీ తెలిసిన పేర్లతోనే పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ప్రపంచంలో అందరూ వాడే పదాలన్నీ ఒకచోట చేసి దాన్ని ఓ డిక్షనరీగా చేస్తే? ఇకపై ఎవరిదైనా పాసవర్డ్‌ హ్యాక్‌ చేయాలనుకున్నప్పుడు వారి యూజర్‌నేమ్‌ని ఈ డిక్షనరీలోని ప్రతీ పాస్‌వర్డ్‌తో కలిపి వాడుతూ పోతే కచ్చితంగా ఎక్కడో ఒకచోట పాస్‌వర్డ్‌ మ్యాచ్‌ అవుతుంది. అందుకే, తెలిసిన పేర్లతో పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు.

బ్రూట్‌ఫోర్స్‌ ఎటాక్‌
మీ పాస్‌వర్డ్‌ 7845 అని అనుకుందాం. బ్రూట్‌ఫోర్స్‌ ఎటాక్‌లో ఒక వ్యక్తి పాస్‌వర్డ్‌ తెలుసుకోవలసి వచ్చినప్పుడు మొదట అది ఎన్ని అక్షరాలు ఉండి ఉంటుందో ఊహిస్తారు. మీ పాస్‌వర్డ్‌ నాలుగు అక్షరాలు కాబట్టి ఓ చిన్న కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా నాలుగు అక్షరాల్లో సాధ్యపడే ప్రతీ సంఖ్యా, ప్రతీ అక్షరం, ప్రతీ ప్రత్యేక చిహ్నాన్నీ ప్రయత్నిస్తూ వెళతారు హ్యాకర్లు. అదంతా ఆ కంప్యూటర్‌ ప్రోగ్రామే చూసుకుంటుంది.

ఉదాహరణకు... 1234, 1235, 1236, 1210... ఇలా రకరకాల కాంబినేషన్లు ప్రయత్నించి, చివరకు మీరు ఏ పాస్‌వర్డ్‌ వాడారన్నది హ్యాకర్లు తెలుసుకుంటారు. అలా మీ అకౌంట్‌లోకి లాగిన్‌ అవుతారు. తక్కువ క్యారెక్టర్లు ఉన్న పాస్‌వర్డ్‌లను సులభంగా బ్రూట్‌ ఫోర్స్‌ ఎటాక్‌ ద్వారా గుర్తించవచ్చు. కాబట్టి కనీసం 6 అక్షరాల కన్నా ఎక్కువ నిడివి ఉన్న పాస్‌వర్డ్‌లను వాడాల్సిందిగా గూగుల్‌ వంటి సంస్థలు సూచిస్తుంటాయి.

ఫిషింగ్‌ దాడులు
మీ జీమెయిల్‌లో కొత్త ఫీచర్లు ఇవ్వబోతున్నామనీ, లేదా మీ బ్యాంక్‌ అకౌంట్‌ అప్‌గ్రేడ్‌ చెయ్యబోతున్నామనీ మీకో మెయిల్‌ వస్తుంది. ఈ లింక్‌ క్లిక్‌ చేసి వెంటనే మీ అకౌంట్‌లోకి లాగిన్‌ అవండి అని చెబుతుంది. చూడడానికి అచ్ఛం గూగుల్‌దో, లేదా మీరు వాడుతున్న బ్యాంక్‌ మాదిరిగానే ఆ వెబ్‌సైట్‌ ఉంటుంది. ఇంకేముంది ఏ మాత్రం అనుమానపడకుండానే మీరు మీ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లు పేజీలో ఎంటర్‌ చేస్తారు. ఆ తర్వాత ఓ ఎర్రర్‌ వచ్చి ఆగిపోతుంది.

నెట్‌ బాలేదనో, సైట్‌ పనిచెయ్యట్లేదనుకునో మీరు అంతటితో ఆగిపోతారు. కానీ మీకు తెలియకుండా మీరు ఎంటర్‌ చేసిన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లు హ్యాకర్‌కి పంపించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లు ఈ ఫిషింగ్‌ దాడుల ద్వారా హ్యాకర్లకు చేరుతున్నాయి. అందుకే మీకు వచ్చే ప్రతీ మెయిల్‌లోని లింకులనూ క్లిక్‌ చేయకండి. ఎక్కడబడితే అక్కడ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లు ఎంటర్‌ చేయకండి.

రెయిన్‌బో టేబుల్‌
యాహూ, ఫేస్‌బుక్‌, లింక్డిన్‌ వంటి అనేక ఆన్‌లైన్‌ సర్వీసులకు చెందిన డేటాబేస్‌లు వివిధ సెక్యూరిటీ లోపాల వల్ల గతంలో హ్యాకర్ల బారిన పడ్డాయి. డేటాబేస్‌ అంటే చాలా సింపుల్‌.. మీ పేరు, మీ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ వంటి అన్ని వివరాలు ఉండే ఓ టేబుల్‌ లాంటిది అని అర్థం చేసుకోండి. ఆ డేటాబేస్‌ హ్యాకర్ల బారిన పడితే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది అకౌంట్లు ప్రమాదంలో పడతాయి.

అయితే అదృష్టవశాత్తూ ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సర్వీసులు పాస్‌వర్డ్‌లకు హ్యాషింగ్‌ అనే అదనపు రక్షణ కల్పించాయి. అందువల్ల కొంత వరకూ మనం సురక్షితం అనే చెప్పాలి. హ్యాషింగ్‌ అంటే.. మీ పాస్‌వర్డ్‌ 12345 అనుకుందాం. ఫేస్‌బుక్‌కో, ఇంకేదైనా సర్వీసుకో ఆ పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకున్న వెంటనే ఆయా సంస్థలు తమ డేటాబేస్‌లో ఆ పాస్‌వర్డ్‌లను సేవ్‌ చేసుకునేటప్పుడు 12345 అని కాకుండా 12345ఎజెడ్‌ అనో, 12345బిఆర్‌ అనో అదనంగా కొన్ని రాండమ్‌ అక్షరాలు చేర్చి సేవ్‌ చేస్తుంటాయి.

ఇలా హ్యాషింగ్‌ చెయ్యడం వల్ల వివిధ సంస్థల డేటాబేస్‌లు హ్యాకర్ల బారిన పడినా వాటిలోని పాస్‌వర్డ్‌లు నిరుపయోగంగా మారతాయి. సరిగ్గా ఇదే సందర్భంలో హ్యాకర్లు ఈ ‘రెయిన్‌బో టేబుల్‌’ అనే టెక్నిక్‌ను వాడతారు. వాళ్లు కూడా కొన్ని లక్షల పాస్‌వర్డ్‌లతో ఓ టేబుల్‌ క్రియేట్‌ చేసుకుంటారు. వాటికి ఎజెడ్‌ అనో, బిఆర్‌ అనో అదనంగా హ్యాషింగ్‌ చేస్తారు. అలా హ్యాషింగ్‌ చేశాక వాళ్ల దగ్గరున్న టేబుల్‌ను, వాళ్లు హ్యాక్‌ చేసి సంపాదించిన డేటాబేస్‌లోని టేబుల్‌తో పోల్చి చూస్తారు. ఏది మ్యాచ్‌ అవుతుందో గుర్తించి ఆ పాస్‌వర్డ్‌లు తెలుసుకుంటారు. ఇది కాస్త క్లిష్టతరమైన పద్ధతే అయినా చాలామంది హ్యాకర్లు దీన్ని వాడుతూ ఉంటారు.

కీలాగర్‌ ద్వారా
అశ్లీల, పైరేటెడ్‌ సమాచారం కలిగి ఉన్న వెబ్‌సైట్లను చాలామంది తెలిసీ తెలియక ఓపెన్‌ చేస్తుంటారు. హ్యాకర్లు ఆ సైట్లలో ఓ నకిలీ ఫ్లాష్‌ ప్లేయర్‌ లాంటిది పెట్టి దాన్ని యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రేరేపిస్తారు. వెనుకా ముందూ ఆలోచించకుండా మన లాంటి వాళ్లు దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోగానే మన కంప్యూటర్లోకి ఓ కీలాగర్‌ వస్తుంది. అది ఇకపై కీబోర్డ్‌ ద్వారా మనం టైప్‌ చేసే యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లు, ఛాటింగ్‌ వంటివన్నీ సేకరించి హ్యాకర్‌కి ఎప్పటికప్పుడు ఓ రిపోర్ట్‌ రూపంలో పంపిస్తూ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లలో కూడా కొన్ని ప్రమాదకరమైన యాప్‌లు స్ర్కీన్‌ మీద ‘ఓవర్లే’ని సృష్టించి, మనం ఎంటర్‌ చేసే పాస్‌వర్డ్‌లు హ్యాకర్‌కి వెళ్లిపోయేలా కారణం అవుతుంటాయి. యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్లు వేసుకున్నాం కదా అనుకుంటే పొరపాటు. ఆ సాఫ్ట్‌వేర్లు కేవలం యాభై, అరవై శాతం వరకూ కీలాగర్లను మాత్రమే పసిగట్టగలుగుతాయి. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పనిసరి.

కుకీలను దొంగిలించి...
గూగుల్‌ వంటి వెబ్‌సైట్లలోకి మనం కంప్యూటర్‌ ద్వారా లాగిన్‌ అయినప్పుడు మన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లు అన్నీ కుకీల్లో సేవ్‌ అవుతాయి. ఆ కుకీలు మన కంప్యూటర్లోనే ఉంటాయి. ఈ నేపధ్యంలో కొంతమంది హ్యాకర్లు ‘కుకీ స్టీలర్‌’ వంటి ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగించి మన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ను తస్కరిస్తుంటారు. అలాగే సెషన్‌ హైజాకింగ్‌ అనే మరో పద్ధతి కూడా వినియోగంలో ఉంది. మనం క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌ వంటి బ్రౌజర్లలోని సెషన్లని పూర్తిగా సేకరించి వాటిని హ్యాకర్లు తమ వద్ద ఓపెన్‌ చేసుకునే పద్ధతి అన్నమాట ఇది.

జాగ్రత్తలెలా?
‘లాస్ట్‌పాస్‌’ వంటి ప్రత్యేకమైన సర్వీసులను వాడడం ద్వారా మీరు కష్టపడి పాస్‌వర్డ్‌ గుర్తుంచుకోవలసిన శ్రమ తప్పుతుంది. అలాగే కొత్తగా ఎప్పుడైనా పాస్‌వర్డ్‌ స్పష్టించుకోవలసి వచ్చినా బలమైన పాస్‌వర్డ్‌ను ఇది మనకు అందిస్తుంది.
మెయిల్‌కి వచ్చే ప్రతీ లింకునీ క్లిక్‌ చెయ్యకపోవడం మంచిది.
అన్ని సైట్లకీ ఒకటే పాస్‌వర్డ్‌ వాడకుండా జాగ్రత్త పడాలి.
ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్విట్టర్‌ వంటి ప్రతీ సంస్థా ఇప్పుడు 2ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ అనే పద్ధతిని అందిస్తున్నాయి. అంటే కేవలం యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ తెలిసినంత మాత్రాన ఎవరూ మీ అకౌంట్‌లోకి చొరపడే అవకాశం ఉండదు. మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చే ఓటిపిని ఎంటర్‌ చేస్తేనే లాగిన్‌ అయ్యేలా ఏర్పాటు చేసుకోవడమన్నమాట. మీ అకౌంట్‌ సెట్టింగుల్లో ఈ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని అర్జెంటుగా ఎనేబుల్‌ చేసుకోండి. ఇలా పలు జాగ్రత్తలు తీసుకుంటే హ్యాకర్ల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.               -నల్లమోతు శ్రీధర్‌

కార్తికంలో ఉసిరి విశిష్టత!_Kartikanlo Excellent feature

grandhanidhi, bhathi, bhakthimandaram
కార్తికంలో

ఉసిరి విశిష్టత!


కార్తిక మాసంలో ఉసిరిచెట్టుకు పూజ చేయటం, ఉసిరికాయ పచ్చడి తినటం ప్రధానమైన నియమంగా చెబుతారు. ఈ విషయాన్ని స్కాంద పురాణంలో కూడా ప్రస్తావించారు. వాస్తవానికి మన సంప్రదాయంలో ఉసిరికి చాలా విశిష్టత ఉంది. ఉపవాసాన్ని విరమణ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉసిరికాయ తినాలి. ఉసిరికాయ తినటం వల్ల కలిగే ఆరోగ్యపరమైన లాభాలను మన పూర్వీకులు అనేక సందర్భాలలో ప్రస్తావించారు. ఇక శాస్త్రపరంగా చూస్తే- చైత్రమాసంలో వేపచెట్టు మీద.. కార్తిక మాసంలో ఉసిరి చెట్ల మీద అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అందుకే కార్తిక మాసంలో ఉసిరికాయపై వత్తి వెలిగించి దీపం పెడతారు. కార్తిక పౌర్ణమినాడు ఉసిరికొమ్మను తీసుకువచ్చి తులసిచెట్టు పక్కనే పాతి.. రెండింటికీ కలిపి పూజ చేసి దీపం పెడతారు. దీని వెనక ఒక పరమార్థం ఉంది. తులసి విష్ణుసంబంధమైనది. ఉసిరి లక్ష్మీ సంబంధమైనది.


ఈ రెండింటికీ పూజచేస్తే- విష్ణువుకు, అమ్మవారికి పూజ చేసిన పుణ్యం లభిస్తుందని మన పూర్వీకుల నమ్మకం. ఇదే విధంగా కార్తికమాసంలో తప్పనిసరిగా చేయాల్సిన ది వన భోజనం. అరణ్యంలో ఉన్న వృక్షాల దగ్గరకు వెళ్లి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. దీని వెనక ఒక పరమార్థం ఉంది. ప్రకృతి మనకు ఆరోగ్యము ఇస్తుంది. అదే విధంగా ఉపద్రవాలు కూడా కలగజేస్తుంది. మనకు ఎల్లప్పుడు ఆరోగ్యాన్ని కలగజేస్తూ.. ఉపద్రవాల నుంచి తప్పించమని మనం కనీసం ఏడాదికి ఒక సారైనా ప్రకృతిని కోరుకోవాలి. దీనికి అరణ్యం కన్నా మంచి ప్రదేశం ఏముంటుంది? అందుకే కార్తికమాసంలో వనభోజనాలు పెడతారు. దీనికి వేదాంతంలో మరో అర్థం కూడా చెబుతారు. వనం అంటే పరబ్రహ్మం.

అన్నం కూడా పరబ్రహ్మమే. ఈ రెండింటినీ ఒకే తాటి మీదకు తీసుకువచ్చి ఒక అలౌకికానుభూతిని పొందటానికి చేసే ప్రయోగమే వన భోజనాలు. దీనికి మరొక కోణం కూడా ఉంది. సాధారణంగా వానప్రస్థాశ్రమం అంటే- అరణ్యంలో ఎవరికీ సంబంధం లేకుండా రాగద్వేషాలను విడిచిపెట్టి.. భగవంతుడి నామస్మరణ చేస్తూ గడపడమని లెక్క. ఆశ్రమం మారటం అంటే- ఒక స్థితి నుంచి మరొక స్థితికి చేరుకున్నట్లు. ఉదాహరణకు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి వచ్చారనుకుందాం. అంటే బ్రహ్మచర్యం జారిపోయిందని లెక్క. వానప్రస్థానికి వెళ్లటం అంటే గృహప్రస్థం జారిపోయిందని లెక్క. వీటన్నింటికీ సాధన కావాలి. ఈ సాధనలో ఒక క్రమమే ఈ వనభోజనం. ఈ మొత్తం తత్వాన్నంతా భాగవతంలో మనం చూడవచ్చు. శ్రీకృష్ణుడు వనభోజనాల సమయంలో చేసిన లీలలు అసామాన్యం.
- శ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ
















జై అంటే జయాలనిచ్చే.. సారంగాపూరు హనుమాన్!_SarangapurHanuman



జై అంటే జయాలనిచ్చే.. 
సారంగాపూరు హనుమాన్!

ఉత్తర దక్షిణాది రాష్ర్టాల మేలు కలయికగా ఉన్న ఇందూర్‌లో ప్రసిద్ధ ఆలయాలకు కొదువలేదు. అలాంటి వాటిలో సారంగాపూరు హనుమాన్ మందిరం ఒకటి. హైందవ రాజ్య సంస్థాపనకు నడుంకట్టిన ఛత్రపతి శివాజీ గురువు సంత్ సమర్ధ్ రామదాసు చేతులమీదుగా ఇక్కడ హనుమాన్ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగినట్లు చరిత్ర సాక్ష్యాలు చెప్తున్నాయి. నిజామాబాద్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న సారంగాపూరు హనుమాన్ ఆలయం భక్తులకు కొంగుబంగారంగా మారింది. ఇంతటి విశిష్టమైన సారంగాపూర్ హనుమాన్ ఆలయ వైభోగమే ఈ వారం దర్శనం. -అంతడ్పుల రామకృష్ణ ,


ఎక్కడ ఉన్నది?:
నిజామాబాదు జిల్లా సారంగాపూరు గ్రామంలో.


ఎలా వెళ్లాలి?:
హైదరాబాదు నుంచి నిజామాబాదు 175 కిలోమీటర్ల ఉన్నది. బస్సు లో వెళ్లి మండల కేంద్రం నుంచి మరో 6 కిలోమీటర్లు వెళితే ఈ ఆలయం వస్తుంది


విశిష్టత ఏంటి?:
ఎలాంటి సమస్యలు ఉన్నా సారంగాపూర్ హనుమానును దర్శించుకుంటే వెంటనే పరిష్కారమవుతాయి. ఛత్రపతి శివాజీ గురువైన సంత్ సమర్ధ్ రామదాసు ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. 

మహారాష్ట్ర సాధువులు:
జిల్లా కేంద్రంలోని రఘునాధ ఆలయం.. పెద్దరామ మందిరంతో పాటు సారంగపూరు ఆలయం ఓకేసారి నిర్మాణం జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు. చారిత్రకాంశాలతో పాటు సందర్శనకు అనుకూలంగా ఉండటంతో తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్.. మహారాష్ట్ర.. కర్నాటక నుంచి వేలాది భక్తులు ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకుంటారు. 500 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఇందూరులోనే ఉన్నప్పటికీ పూజా కార్యక్రమాలు నిర్వహించేది ఉతర్త భారతీయులైన మహారాష్ర్టులు కావడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

జయమ్ము నిశ్చయమ్ము:
జైజై హనుమా అంటూ స్వామికి జై కొడితే జయాలు వరిస్తాయని భక్తుల నమ్మకం. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సాగరంపూరు మనుమాన్ మందిరానికి వందలాది ఎకరాల భూములు కూడా ఉండేవట. సాంగపూరు హనుమాన్ ఆలయం నుంచి బ్రహ్మపురిలోని పెద్ద రామ మందిరానికి.. ఖిల్లా రామాలయానికి ఇక్కడ్నుంచి సొరంగ మార్గం ఉందట.

చారిత్రక వైభవం:
ఇది జిల్లాలోనే అత్యంత పురాతనమైనది. ఇక్కడి ప్రాచీన గర్భగుడిలో ప్రతిష్టించిన అఖండ ఏకశిలా విగ్రహం చాలా అరుదుగా ఉంటుంది. స్వామివారి నిండైన శిలా విగ్రహం జిల్లాలో మరెక్కడా లేకపోవడం విశేషం. వీటి తాలుకూ చారిత్రక వైభవ ఆనవాళ్లు.. ఆలయ పురాతన నిర్మాణ శైలి ఇప్పటికీ కనిపిస్తుంది. ప్రధాన ముఖద్వారం మొదలుకుని నిర్మాణం మొత్తం ధృఢమైన రాళ్లతో డంగు సున్నంతో నిర్మించబడింది. ఆలయ ఆవరణలో సాదు సంతులు.. బాటసారులు బస చేసే విధంగా సత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని వంటశాలలుగా ఉపయోగిస్తున్నారు. 

ఆలయ రక్షణకు సహకరించాలి:
ఉమ్మడి జిల్లాలో సారంగపూరు హనుమాన్ మందిరం.. సలబత్‌పూరు హనుమాన్ మందిరంలో చాలా ప్రసిద్ధి చెందినవి. సతబత్‌పూర్ ఆలయం అభివృద్ధికి కర్నాటక.. మహరాష్ట్ర.. తెలంగాణ భక్తులు సహకరించిన విధంగా ఈ ప్రసిద్ధ ఆలయం రక్షణకు అందరు ముందుకు రావాలి. ఆలయం అభివృద్ధికి ఎంపీ కవిత ప్రత్యేక చొరవ తీసుకోవడం శుభపరిణామం. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి అందదూ ముందుకు రావాలి. చారిత్రక నేపథ్యమున్న ఇలాంటి ఆలయాలను పరిరక్షిస్తే మంచి జరుగుతుంది. 
-పెద్ద రామమందిరం పీఠాధిపతి దినకర్ మహరాజ్




















mohan publications price list