MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఉండ్రాళ్ల తద్ది_UndrallaTaddi


చాంద్రమానం ప్రకారం వచ్చే ఆరో మాసమే- భాద్రపదం. దీన్ని పెద్దలు భద్రపదంగా పరిగణిస్తారు. అంటే, ఇది శుభాలు కలిగించే మాసం అని అర్థం. ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం వద్ద కాని, ఉత్తరాభాద్ర నక్షత్ర సమీపంలో కాని ఉండటం వల్ల దీనికి భాద్రపద మాసం అనే పేరు వచ్చింది. వర్ష రుతువులో రెండో మాసం ఇది.

ఈ మాసం స్త్రీల వ్రతాలకు నెలవు. భాద్రపద శుక్ల తృతీయ నాడు హరితాళికా వ్రతం. శుక్ల చతుర్థి ‘వినాయక చవితి’గా ప్రసిద్ధి చెందింది. ఆ మరునాడు రుషి పంచమి. అది సప్తర్షులను ఉద్దేశించి ఆచరించే వ్రతం. శుద్ధ షష్ఠి అంటే సూర్య షష్ఠి, సప్తమితో కలిగిన షష్ఠి- సూర్యుడికి అత్యంత ప్రీతికరం. శుద్ధాష్టమిని ‘దూర్వాష్టమి’ అంటారు. ఆరోజు గరిక పూజ చేస్తారు. శుక్ల చతుర్దశినాడు అనంత పద్మనాభ వ్రతం ఆచరిస్తారు. ఆ కోవలోనిదే బహుళ తదియనాటి స్త్రీల నోము- ‘ఉండ్రాళ్ల తద్ది’.
పుణ్యసాధన కోసం ఉపవాసాది నియమాలు పాటించే భక్తిపూర్వకమైన విధివిధానాలే- నోములు, వ్రతాలు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని సంస్కృతి ఇది. భర్త అనురాగంతో పాటు సౌభాగ్య సంపదలు, ఉత్తమ సంతానం కోరుతూ స్త్రీలు వ్రతాలు ఆచరించడం మనదేశంలోనే గోచరించే ఓ విలక్షణ సంప్రదాయం. వ్రతాల్లో కొన్ని నిత్య వ్రతాలైతే, ఇంకొన్ని నైమిత్తికాలు. మరికొన్ని కామ్య వ్రతాలు.

ఏకాదశి వ్రతాల వంటివి నిత్య వ్రతాలు. చాంద్రాయణాది వ్రతాల్ని నైమిత్తికాలుగా భావిస్తారు. ఆయా తిథుల్లో ఉపవాసం ఉండి చేసే వ్రతాలే కామ్య వ్రతాలు. ఏటా మనసులో ఒక కోరిక పెట్టుకొని, దాని సిద్ధి కోసం వ్రతాలు ఆచరిస్తుంటారు.

ఉండ్రాళ్ల తద్ది నోమును కన్యలతో పాటు వివాహితలూ నిర్వర్తిస్తారు. కన్య ఉత్తముడైన భర్తను కోరుకుని నోచుకుంటుంది. వివాహితులైన స్త్రీలు పెళ్లయిన ఏడాది ప్రారంభించి, పదేళ్లపాటు నోచుకుంటారు. భర్త, పిల్లలు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటారు. మరికొందరు సంతాన ప్రాప్తి కోసం ఈ నోమును ఆచరిస్తారు.

కొన్ని ప్రాంతాల్లో- ముందురోజు విదియనాడు తలస్నానం చేసి, మధ్యాహ్నం గోరింటాకు రుబ్బి పెట్టుకోవడం ఓ ఆచారం. తదియనాడు చంద్రోదయం వరకు ఉపవాసం చేస్తారు. గౌరీదేవిని పూజించి, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అయిదు ఉండ్రాళ్లను నివేదించడం సర్వసాధారణంగా ఆచరించే విధివిధానం. వాటిని సౌభాగ్యవతులకు వాయనంగా ఇస్తారు.

రాత్రి చంద్రుణ్ని చూశాక- ఉండ్రాళ్లతో పాటు నువ్వుల పొడి, గోంగూర పచ్చడి, ఉల్లిపాయల పులుసు, పెరుగుతో భోజనం చేస్తారు. అంతకుముందు సాయంత్రం ఆడపిల్లలు ఉయ్యాలలూగుతూ పాటలు పాడటం ఒక సంప్రదాయం.
వివాహమైన సంవత్సరమే నోము ఆచరించేవారు, పదేళ్ల అనంతరం ఉద్యాపన చేస్తారు. తెల్లవారుజామున ముత్తైదువకు తలంటి, తానూ స్నానం చేసి, కొత్త వస్త్రాలు పెట్టి, భోజనంతో తృప్తిపరచడం ఆనవాయితీగా వస్తోంది.

ఇటువంటి నోములు పుణ్యలోకాల్ని ప్రసాదిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇవన్నీ కుటుంబ జీవన పటిష్ఠతకు దోహదపడేవే. సమాజంలో సద్భావనతో పాటు సమైక్యత, సుహృద్భావ వాతావరణం వెల్లివిరిసేందుకు ఇటువంటి వ్రతాలు, నోములు దోహదపడతాయని పలువురి నమ్మకం!
- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

+++++++++++++++++++++++++++

భాద్రపద బహుళ తదియను ఉండ్రాళ్ల తద్ది అని వ్యవహరిస్తారు. ఉండ్రాళ్లతద్ది స్త్రీల పండుగ. స్త్రీలలోనూ కన్నెల, పడుచుల పండుగ. మగ పిల్లలు చిన్నవారు కూడా ఇందులో పాల్గొంటారు. తలంటు స్నానం అయిన తర్వాత చేతివేళ్లకు కాలివేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారు జామున గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసును, గట్టి పెరుగుతో భోజనం చేసి తాంబూలం వేసుకుని, ఉయ్యాల ఊగడం, ఆడుకోవడం వాటితో కాలక్షేపం చేస్తారు. గోరింట ఈ పర్వ కలాపంలో ప్రవేశం పొందింది. ఆషాఢమాసంలో ఏదో ఒక రోజున, ఉండ్రాళ్ల తద్దికి, అట్టతద్దికి గోరింటాకు పెట్టుకోవడం మనలో ఒక ఆచారంగా ఉంటూ ఉంది. గోరింట ఆకును బాగా నూరి ఆడపిల్లలు, స్త్రీలు చేతి గోళ్లకు, పారాణిగా పాదాలకు పెట్టుకుంటారు. గోరింటాకు సంస్కృతంలో నఖరంజని అని పేరు. రంగును కలిగించేది అని అర్థం. ఈ గోరింటాకు గురించి స్త్రీలకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. స్త్రీలు అరికాళ్లలో గోరింటాకు నూరిన ముద్దతో చుక్కపెట్టుకుంటారు. అది బాగా పట్టినట్లయితే ఆ స్త్రీకి తరగని అయిదవతనం. గోరింటాకు బాగా పండితే ఆ పడుచును భర్త బాగా ప్రేమిస్తాడు. 'ప్రేమ కలవారి కంటు గోరింట' అనే నానుడి.
గోరింట మంచి మూలిక. దాని ఆకులు, పట్ట, పూవులు, గింజలు ఓషధీగుణం కలవి. గోరింటలో ఒకవిధమైన చిరువిషం కలదు. హన్నొటాన్నిక్ ఆసిడ్ కలదు. పూవులతో అత్తరు, వాసన నూనె తయారు చేస్తారు. గింజలో చమురు ఉంది.
ఉండ్రాళ్ల తద్ది
ఉండ్రాళ్లు తైల పక్వము కాక కేవలం ఆవిరి మీద ఉడికే పిండివంట. భాద్రపద మాసంలో వచ్చే మూడు పండుగలకు ప్రత్యేకం ఉండ్రాళ్లే నివేదన వస్తువులుగా ఉండడం మనం గమనించాలి. శివుణ్ణి పతిగా కోరి పార్వతి సాగించిన తపస్సుకు మోదితుడై శివుడు ప్రత్యక్షమైన రోజు అని ధర్మసింధువు. తెలుగు వారికి ఇది పదహారు కుడుముల తద్దిగా ప్రఖ్యాతి చెందింది. పదహారు బిళ్ల కుడుములు వండి పూజ చేసి నైవేద్యం పెట్టడం అప్పటి ఆచారం. ఇప్పటికీ అనుకరణలో వ్రత నిష్ఠ విధానాలు చెప్పే షోడశోమా వ్రతం తెలుగులో ఈ పేరు కూర్చుకున్నది. రాజస్తాన్, మహారాష్ట్ర, మాళవ, ఉత్కళ దేశాల్లో ఆ రోజు నైవేద్యం ఆవిరి కుడుములే.
ఉండ్రాళ్లు ఆవిరి కుడుములు సేవించడం ఆరోగ్య దృష్ట్యా వరణీయమన్నమాట. ఉండ్రాళ్లను సంస్కృతంలో మోదకాలు అంటారు. వరి బియ్యపు పిండిని ముందు నీళ్లలో ఉడికిస్తారు. ఈ ఉడికే పిండిలో కొద్దిగా బొబ్బర్లు కాని, శనగ పప్పుకాని వేయం కూడా కద్దు. ఉడికిన ఈ పిండిని ముద్దలుగా చేసి నీటి ఆవిరి మీద గుడ్డ కట్టి కాని ఎండు గడ్డిగాని చుట్టి కాని ఇడ్లీల మాదిరిగా వండుతారు.
మేహశాంతిని చేయడంలో ఈ పిండి వంట పెట్టింది పేరు. బలకరమైనదే అయినా దీని వద్ద గురుత్వం చేసే గుణం కూడా ఉంది. కాబట్టి విస్తరించి వాడకూడదు. వరి పిండితో మినపపిండి కూడా మిళాపు చేసి ఇడ్లీలు, పొట్టింకులు మొదలైనవి చేస్తారు. అవి ఉండ్రాళ్ల భిన్న స్వరూపాలు అనుకోవచ్చు. ఉండ్రాళ్లను పాలలో నానవేస్తే పాల ఉండ్రాళ్లు, అవుతాయి. పాల ఉండ్రాళ్లు వీర్యపుష్టిని ఇస్తాయి. భోగినాడు తలంటు, గోరింటాకు పెట్టుకొనుట, మరునాడు తెల్లవారు జామున ఆడుకోవడం, పగలు పుష్పాచయము, పత్రాపచయము కోసం తోటల వెంట తిరుగుట ఊయల ఊగుట విహార విధులను ఈ పండుగ రోజున చేసే కార్యక్రమాలు. ఉండ్రాళ్ల తద్దినాడు ఉండ్రాళ్లు పగలు పూజ అయ్యాక తినేవి. ఈ రోజు తెల్లవారు జామున తినే పదార్థాలు కొన్ని అనుచానంగా వస్తూ ఉన్నది.
వెల్లుల్లి వేసిన గోంగూర పచ్చడి, నీరుల్లి పాయల పులుసు, నువ్వుల పొడి, పెరుగు అన్నంతో భోజనం చేయాలి. ఆ మీద అవి అరిగేటట్లు ఆడుకోవాలి. ఇక ఈ పండుగ సందర్భంలో తినే గోంగూర, నువ్వులు, ఉల్లిపాయ ఓషధీగుణాలు కూడా తెలుసుకోతగ్గవే. ఇక ఊయల ఊగడం మనోల్లాసకరమైన క్రీడలలో ఊయల ఊగడం ఒకటి. ప్రతివారి పసితనం అయిదారు మాసాల వరకు విశేషకాలం ఊయలలోనే గడుస్తుంది. అది వాతహరంగా ఉండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాగా పెద్దవారు
కూడా అప్పుడప్పుడు ఊయల ఊగడం మంచింది. ఊయల ఊగడం ఉల్లాసంగా ఉత్సాహంగా వుంటుంది.
ఈరోజు గౌరీదేవిని పూజిస్తారు. ఉండ్రాళ్లు వండుతారు. దేవికి అవి నైవేద్యం పెడతారు. భోజనంతో పాటు వానిని తింటారు. పిండివంటల్ని పట్టి ఏర్పడ్డ పండుగలలో ఇది ఒకటి. భాద్రపదశుద్ధ చవితి వినాయక చవితినాటి పిండివంట కూడా ఉండ్రాళ్లు. వినాయక చవితి వెళ్లిన పదిహేను రోజులకే ఉండ్రాళ్ల తద్ది. ఉండ్రాళ్లు ఆవిరి కుడుముల సేవనం ఈ కాలపు ఆరోగ్యానికి మంచిది. అజీర్ణం చేయకుండా బలాన్ని కలిగిస్తాయి. మేహ, పైత్య సంబంధరోగాలను ఉండ్రాళ్లు పొట్టెంకలు, జిల్లేడు కాయలు శమింపజేసాయి. ఉండ్రాళ్ల తదియ వ్రత చర్యలో ఐదుగురు ముత్తయిదులకు తలంటిపోసి గోరింటాకు ఇవ్వటం ముఖ్యంగా చెప్పబడింది. ఇది పొద్దుపోయే సమయాన చేస్తారు.
కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి” అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. 
ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు ‘‘ఉండ్రాళ్లతద్ది” అనే నోమును నిర్వహించుకుంటున్నారని చెలికెత్తెల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి, రాజుతో.. ‘‘నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ల తద్దీ నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అవడంవల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యలమీద వున్న ప్రేమ నా మీద కూడా వుంటే.. ఉండ్రాళ్ల తద్దీ నోమును అవసరమైన సరుకులను నాకోసం ఏర్పాటుచే” మని అడిగింది. 
ఆమె ప్రతిజ్ఞను రాజు అంగీకరించి.. నోముకు కావలసిన పదార్థాలను, సరుకులను ఆమెకోసం ఏర్పాటు చేస్తాడు. అవి అందగానే వేశ్య అయిన చిత్రాంగి.. భాద్రపత తృతీయనాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుడా ఉపవాసం వుంటుంది.
చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో తయారుచేసుకున్న ఉండ్రాళ్లను చేసి, నైవేద్యం పెట్టింది. అయిదు ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చింది. నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందడంత.. ఐదేళ్లు నిర్వఘ్నంగా నోము నోచుకుంటుంది. దాని ఫలితంగా ఆమె పవిత్రంగా, సద్గతిని పొందుతుంది.        వల్లూరి పవన్ కుమార్ 

#ఉండ్రాళ్లతద్ది 
#UndrallaTaddi

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list