MohanPublications Print Books Online store clik Here Devullu.com

మంచి మాటే అలంకారం!-Saraswathi

మంచి మాటే అలంకారం!
జ్ఞానమే అన్ని సంపదలకు మూలమని తెలిసిన మానవజాతి మాఘశుద్ధ పంచమినాడు ‘వాగ్భూషణమ్ భూషణమ్’- మానవునకు ‘మంచి మాటే’ అలంకారము కనుక ఆ వాక్కును ప్రసాదించే దేవతగా సరస్వతీదేవిని ఉపాసించి, వాక్సంపదను పొందడానికి శారదాంబనే ‘వాగ్దేవి’గా సంభావిస్తారు. అఖిల లోకాలకు జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీ మాతను వారు వీరనే తారతమ్యాలు లేకుండా పూజిస్తారు. శుద్ధసత్వగుణరూపిణి అయిన సరస్వతీ మాత శే్వతాలంకారప్రియగా భావిస్తారు. ‘‘చంద్రికా చంద్రవదనా తీవ్రా మహా భద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని జ్ఞాన ప్రదాయినిగా కొలువబడుతున్న శారదాంబను, బ్రహ్మ దేవుని ఇల్లాలిగా హంసవాహినిగా అలంకరించి ‘‘వాగేశ్వరీ, వాగ్వాదినీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, నకులీ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’గా కొని యాడు తారు. ‘సరస్వతీ రహస్యోపనిషత్’ ద్వారా అశ్వలాయ నుడు సరస్వతీ కటాక్షంతో పొందిన అపార జ్ఞానసంపద వివరణతో సరస్వతిని ఉపాసిస్తారు. బుద్ధి, జ్ఞానశక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి ‘సరస్వతి’కనుక ‘శ్రీపంచమి’న విశేషంగా ఈ తల్లిని అర్చించి ఆమె కృపకు పాత్రులై తరించడానికి సులభోపాయంగా చెప్తారు. సరస్వతీ దేవి శాంతమూర్తియై ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి వుంటుంది ఈ తల్లిని దేవీ భాగవతం బ్రహ్మవైవర్తన పురాణాదులు చదువుల తల్లిగా ఆరాధించమంటున్నాయ. ఓసారి వేదవ్యాసుల వారు అదిలాబాద్ జిల్లాలో గోదావరి తీరాన బాసర క్షేత్రంలో జ్ఞానరూపిణి యైన సరస్వతీ దేవికోసం తపమాచరించాడట. ఆ తల్లి ఆ వ్యాసుని తపస్సుకు మెచ్చి ప్రత్యక్ష మయందట. ఆ తల్లి అనుగ్రహంతోనే ఆయన రచనకు పూనుకొన్నాడు. కలియుగంలోని మానవులు కూడా ఈ తల్లి అనుగ్రహాన్ని పొందాలని ఆశించిన ఆ వేదవ్యాసుడే తల్లిని సైకత స్వరూపిణిగా ఈ బాసరలో ప్రతిష్టించాడు. సుప్రతిష్టమైన ఈ బాసర అక్షరాభ్యాసాలకు నెలవైంది. ఈ తల్లి ముందు కూర్చుని అక్షరా భ్యాసం చేయంచిన పిల్లలు అపార జ్ఞానసంపదకు వారసులవుతారని సరస్వతీ భక్తుల నమ్మిక. ఫుణ్యగోదావరి తీరంలోని ఇసుకను తెచ్చి అమ్మనుప్రార్థించి ఇక్కడే కొలువైన సరస్వతీ అమ్మతోపాటుగా మహాలక్ష్మీదేవి కూడా ఈ ఆలయంలోనే కొలువైఉన్నారు. ఈ ఇద్దరు అమ్మలతోటి ఆలయానికి పశ్చిమ భాగంలో మహాకాళి అమ్మవారు, తూర్పున దత్తాత్రేయులు కూడా విచ్చేసి బాసరను దర్శించిన భక్తులకు దర్శనం కలుగ చేస్తుంటారు. వీరందరి దర్శనంతో అటు జ్ఞాన ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు అంటారు. అంతేకాక బాసరను విజ్ఞాన క్షేత్రంగా విలసిల్లడానికి కారణమైన వేద వ్యాసుల విగ్రహాన్నికూడా తయారు చేయంచి ప్రధాన రహదారి వద్దనే ఆలయాన్ని నిర్మించి వేద వ్యాసుల మూర్తిని ప్రతిష్టించి ఉన్నారు.
బాసరక్షేత్రనివాసి యైన అమ్మవారికి ప్రతిరోజు నిత్యాభిషేకాలు జరుపుతారు. దసరా నవరాత్రులలో మూల నక్షత్రం రోజున అమ్మవారి జన్మదినంగా భావిస్తూ ప్రత్యేక పూజలు ఆరాధనలు చేస్తారు. మాఘశుద్ధ పంచమినాడు వసంత పంచమి పేరిట విశేష పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఎక్కడెక్క డుంచో జనులు తరలివస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో ఈరోజున సంతోషింప చేస్తుంటారు. ఈ మాఘమాసం శిశిరఋతువు వసంతా గమనం కనుక సర్వులలో నవ చైతన్య దీప్తిని కలుగచేసే వసంతుణ్ణి రతీ దేవిని కూడా ఈ పంచమినాడే పూజిస్తారు. పుణ్యపాపాలను సంపాందించుకొనే నేర్పున్న బుద్ధిజీవివైన మానవుడు మానసికోల్లాసాలతో పాటు జ్ఞాన విచక్షణలు కలిగుండాలనే ఆకాంక్షను కలిగిం చడమే అటు సరస్వతీ పూజ ఇటు వసంతుని పూజ చేయడంలోని అంతరార్థం గ్రహించాలన్న దే ఈ పర్వవిశేషం. సరస్వతీ దేవికిఅనేక నామాలున్నప్పటికీ ‘‘సామాంపాతు సరస్వతీ.... ’’ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట. పోతనామాత్యుడూ అమ్మను పూజించిన తరువాతే భాగవతరచన ఉపక్రమించినట్లు చరిత్ర చెప్తోంది. కనుక మానవులందరమూ ఈ దేవిని ఉపాసించి జ్ఞానవంతులవుదాం.
మాఘశుద్ధ పంచమి
ప్రత్యేక సరస్వతీ ఆరాధన
- రాంప్రసాద్

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list