MohanPublications Print Books Online store clik Here Devullu.com

భాద్రపద మాసం_Badrapada masam

        


భాద్రపద మాసం


దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ’భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవమాసం. ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ’భాద్రపద మాసం ’ అనే పేరు ఏర్పడింది. భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం.

భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.అందుకే ఈ మాసంలో ’దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్ర వచనం. భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ’రాధాష్టమి’ అని పేరు. ఈ దినం రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.

మహాలయ పక్షం ;
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే ’మహాలయ పక్షం’ అని పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షంలో పదిహేనురోజులపాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులను నిర్వహించడం, పిండప్రదానం చేయడం ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రకమైన విధులను నిర్వహించడంవల్ల గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుంది.
భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు

హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం 
భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణ గౌరీ వ్రతం ’ ’పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.

ఉండ్రాళ్ళ తద్ది
భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం . తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.
భాద్రపద మాసంలో పండుగలు

శుక్ల చవితి : వినాయక చవితి
ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ’వినాయక చవితి’ లేదా ’ గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.

శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి
తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దిన ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ’పరివర్తన ఏకాదశి’ అని, ’విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ’పద్మ పరివర్తన ఏకాదశి’ అని పేరు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.

శుక్ల ద్వాదశి : వామన జయంతి
దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం.

శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి
అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.

కృష్ణ పక్ష ఏకాదశి : అజ ఏకాదశి
అజ ఏకాదశికే ’ధర్మప్రభ ఏకాదశి’ అని కూడా పేరు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం.ఈ ఏకాదశినాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనెగింజలు దానం చేయాలని శాస్త వచనం.

కన్యా సంక్రమణం
ఈ చరాచర జగత్తుకు వెలుగును , చైతన్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడు సింహరాశి నుండి రాశులలో ఆరవదైన కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాదు. ఈ రోజు పూజలు, దానాలు చేయడంతోపాటు సూర్యభగవానుడిని, శ్రీమహావిష్ణువును పూజించవలెను.

+++++++++++++++++++++++++++++++



నాటి సినిమా

శివసుతుని
దివ్య చమత్కారం.



శివుడు భక్త సులభుడు. రావణుడు భక్త ధురంధరుడు. శివుడికి భక్తుడు కావాలి. రావణుడికి శివుడు కావాలి. ఈ రెండూ విచక్షణ కోల్పోతే మానవులకూ దేవతలకూ ఉపద్రవం వచ్చి పడుతుంది. దానిని నిలువరించే శక్తి కావాలి. ఆ శక్తే విఘ్నేశ్వరుడు. చివరి నిమిషంలో ఆయన చూపిన చమత్కారమే ‘భూ కైలాస్‌’ కథ.

రావణుడు విశిష్ట శివభక్తుడు. రావణుడి తల్లి కైకసి నిత్య హరనామస్మరణలో తరియించే భక్తాగ్రేసరురాలు. ఆమె ప్రతినిత్యం సముద్రపు ఒడ్డున సైకత లింగం ప్రతిష్ఠించి దానికి పూజలు చేసి ఆ ప్రసాదాన్ని తన పుత్రుడు రావణుడికి ఇస్తుంటుంది. ఆ ప్రసాద బలమే రావణుడి మహాబలం. ముల్లోకాలను గడగడలాడించగల ప్రచండబలం. అప్పటికే రావణుడు భూలోకాన్ని జయించాడు. అంతటితో తృప్తి తీరక అమరపురిపై దండెత్త దలిచాడు. అదే గనక జరిగితే దేవేంద్రుని పీఠం కదిలిపోతుంది. నారాయణుని ఉనికికి సవాలు ఎదురవుతుంది. నారదుడు ఇది గ్రహించి దేవేంద్రుణ్ణి రావణుడిపై ఉసిగొలుపుతాడు. కైకసి ఆరాధించే సైకత లింగపూజను భగ్నం చేసి ఆ ప్రసాద బలం రావణుడికి అందకుండా చేయమంటాడు.

దేవేంద్రుడు అలలలో దూరి సైకత లింగాన్ని కబళిస్తాడు. పూజను నీటిపాలు చేస్తాడు. కైకసి దీనిని దుశ్శకునంగా భావిస్తుంది. శివుడికి అపచారం జరిగిందని తల్లడిల్లుతుంది. తల్లి వేదనను గ్రహించిన రావణుడు నిత్యం తయారు చేసుకునే సైకత లింగమేలా... ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని ఏకంగా అతని ఆత్మలింగమే తీసుకొని వస్తానని శపథం చేస్తాడు. ఏదో చేయబోతే ఏదో అయినట్టు అదే గనక జరిగితే భూలోకమే కైలాసం అవుతుంది. దేవగణాలన్నీ ఆత్మలింగం ఉన్న చోటుకే తరలివచ్చి దేవపురి దివాలా తీస్తుంది. అందుకే దేవేంద్రుడు రావణుని ఘోర తపస్సును భగ్నం చేయబూనుకుంటాడు. త్రాచులను వదులుతాడు. కొండ చిలువలను చుట్టబెడతాడు. అప్పటికీ చలించకపోతే ఆఖరు అస్త్రంగా దేవ వేశ్యలను దించుతాడు. అయినప్పటికీ రావణుడు బెసకడు. లొంగడు. సంకల్పం నుంచి చెదరడు.

ఆ తపస్సుకు మెచ్చి శంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. మరు నిమిషంలో ఆ ఆదిదేవుడు భక్తుని కోరిక మేరకు ఆత్మలింగం సమర్పించేవాడే. కాని అంతలోనే విష్ణువు విష్ణుమాయను చూపుతాడు. రావణుడిలో మాయను ప్రవేశపెట్టి ఆత్మలింగానికి బదులు ఏకంగా పార్వతినే తన పత్నిగా చేయమని అడిగేలా చేస్తాడు.జగన్మాతను ఆశించిన ఆ కోరిక నాశన హేతువు. అయినప్పటికీ వచనబద్ధుడైన శివుడు ఇచ్చిన మాట కాదనలేక పార్వతిని రావణుడికి అప్పజెప్పుతాడు. శివ వియోగంతో తల్లడిల్లిన పార్వతి దీనికంతటికీ కారణం విష్ణుమాయ అని గ్రహించి ‘ఓ నారాయణుడా... నా వియోగబాధ నీకు అర్థమవ్వాలంటే భూలోకాన మానవ జన్మ ఎత్తి సతీ వియోగంతో ఇంతకింత బాధ అనుభవించు’ అని శపిస్తుంది.

అది విని నారదుడు ఆనందబాష్పాలు రాలుస్తాడు.ఎందుకంటే రావణుడి అంతం రాముడి చేతిలో ఉంది. రాముడి జన్మకు ఈ శాపమే కారణమవుతోంది.ఈ శాపం ఇచ్చాక పార్వతి రావణుణ్ణి మాయ చేసి తిరిగి శివుని సన్నిధికి చేరుకుంటుంది. మరోవైపు రావణుడు పాతాళ లోకాధిపతి అయిన మయాసుర కుమార్తె మండోదరిని చూసి ఆమే మాయారూపంలో ఉన్న పార్వతి అనుకుని ఆమెను కాంక్షిస్తాడు. వివాహం చేసుకుని లంకకు తీసుకుని వస్తాడు.సాక్షాత్తూ పార్వతీదేవిని వివాహం చేసుకుని వచ్చిన రావణుణ్ణి చూసి రావణుని తల్లి కైకసి హతాశురావుతుంది. శివద్రోహి, మాతృద్రోహి అంటూ రావణుణ్ణి దూషిస్తుంది. అప్పటికిగాని రావణుడిలోని విష్ణుమాయ వదిలిపోదు. ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని వాంఛించడం, మండోదరిని పార్వతి దేవే అనుకొని వివాహం చేసుకోవడం ఇవన్నీ గుర్తుకు వచ్చిన రావణుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. మండోదరిని భార్యగా స్వీకరించి ఈసారి నిజంగా ఆత్మలింగం సాధించుకొని రావడానికి బయలుదేరుతాడు.

ఘోర తపస్సు జరుగుతుంది. రావణుడు తన తలను ఖండించుకుని శివుడికి అర్పణం చేస్తాడు.శివుడు మరి నిలువలేక ప్రత్యక్షమై వక్షస్థలం నుంచి దివ్య తేజస్సుతో ప్రజ్వరిల్లుతున్న ఆత్మలింగాన్ని పెకలించి రావణుని చేతిలో పెడతాడు. ‘లంకకు చేరుకునే వరకు ఈ లింగాన్ని నేలకు దించకు. ఎక్కడ దించితే అక్కడే అది స్థిరపడిపోతుంది. దానిని కదల్చడం స్వయంగా నా వల్ల కూడా కాదు’ అని చెప్తాడు.
రావణుడు ఆత్మలింగం తీసుకుని బయలుదేరుతాడు.అదే జరిగి ఆత్మలింగం లంకకు చేరితే రావణుడు మరింత శక్తిమంతుడవుతాడు. మరింత పెట్రేగుతాడు. అందుకనే నారదుడు విఘ్నేశ్వరుణ్ణి శరణుజొచ్చుతాడు.‘విఘ్నేశ్వరా. నీకు ప్రథమ పూజ చేయకుండా అవిఘ్నంగా రావణుడు ఆత్మలింగాన్ని పట్టుకు పోతున్నాడు’ అని నివేదిస్తాడు. విఘ్నేశ్వరునికి కోపం వస్తుంది. ‘రావణుడు అంత పని చేస్తాడా’ అని బ్రాహ్మణ బాలుని రూపంలో రావణుడి దారిలో కాపు కాస్తాడు.

ఇదే అదనుగా విష్ణుమూర్తి తన చక్రాన్ని సూర్యుడికి అడ్డం పెట్టి సంధ్యా సమయాన్ని సృష్టిస్తాడు. అది గమనించిన రావణుడు సంధ్య వార్చడానికి వెళ్లి వస్తానని దారిలో కనిపించిన విఘ్నేశ్వరుని చేతిలో ఆత్మలింగాన్ని పెడతాడు. తాను వచ్చే వరకు దానిని నేలకు దించవద్దని సూచిస్తాడు.కాని మాయా రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు ‘నేను ముమ్మార్లు నిన్ను పేరు పెట్టి పిలుస్తాను. వచ్చావా సరేసరి. లేదంటే లింగాన్ని కింద పెట్టేస్తాను’ అంటాడు. రావణుడు సంధ్య వారుస్తుండగా గబగబా ముమ్మార్లు రావణుని పేరు పిలిచి లింగాన్ని నేలకు దించేస్తాడు. ఇంకేముంది. ఆత్మలింగం తక్షణమే అదే స్థలిలో ప్రతిష్టితమైపోతుంది.

రావణుడు ఎంతో విలపిస్తాడు. విఘ్నేశ్వరుణ్ణి దుర్బాషలాడతాడు. తల మీద మొట్టుతాడు. లింగాన్ని ఊడ పెరకడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. తుదకు ఆత్మలింగాన్ని అక్కడే వదిలిపెట్టి లంకకు పయనమవుతాడు. అలా అసురుని బారిన పడాల్సిన ఆత్మలింగం విఘ్నేశ్వరుని పుణ్యమా అని భూలోకాన ప్రతిష్టితమై మానవుల పూజలను అందుకునే దివ్యలింగంగా నేటికీ అలరారుతోంది.అలా ఆత్మలింగం ప్రతిష్టితమైన పుణ్యక్షేత్రమే కర్నాటకలో ఉన్న గోకర్ణం. అక్కడ పూజలందుకుంటున్న మహాబలేశ్వర లింగమే నాటి ఆత్మలింగం.

‘గోకర్ణం’ క్షేత్ర కథ ఆధారంగా ఏ.వి.ఎం ప్రొడక్షన్స్‌వారు 1958లో తీసిన చిత్రమే ‘భూకైలాస్‌’. ఎన్టీఆర్‌ రావణాసురుడిగా, జమున మండోదరిగా, అక్కినేని నారదుడిగా నటించిన ఈ సినిమా ఆబాలగోపాలాన్ని అలరించి హిట్‌గా నిలిచింది. తమిళనాడులో రావణుడికి ఉన్న ఆదరణ దృష్ట్యా ఇదే సినిమా అక్కడ ‘భక్త రావణ’గా అనువాదమై విడుదలైంది. నిజానికి ఈ సినిమా రావణుని అమాయక, అచంచల భక్తికి ఒక మచ్చుతునక. శివుని మీద అతడికున్న భక్తి, అతడి వీరత్వం, నిజాయితీ దేవతల పథక రచన, పన్నాగం ఈ సినిమాలో కనిపిస్తాయి. అందరూ కలిసి రావణుని దారి మళ్లించి అతడికి దక్కవలసిన ఆత్మలింగాన్ని దక్కకుండా చేస్తారు.అయినప్పటికీ రావణుడు అఖండ శివభక్తునిగా పురాణాల్లో నమోదయ్యాడు.

అతని వంటి శివభక్తుడు మరొకడు లేదు. ఎన్టీఆర్‌ రావణుని పాత్రను పాలధార వంటి స్వచ్ఛతతో పోషించి ఆకట్టుకుంటే అక్కినేని నారద పాత్రకు ఉండాల్సిన వంచనా శిల్పాన్ని ప్రదర్శించి మెప్పిస్తారు. సముద్రాల మాటలూ పాటలూ అందించిన ఈ సినిమాకు ఆర్‌. సుదర్శనం సంగీతం అందించారు. ‘దేవ దేవ ధవళాచల మందిర’... , ‘నీలకంధరా దేవా’..., ‘రాముని అవతారం రవికుల సోముని అవతారం’... పాటలు రంజింప చేస్తాయి. రావణుని తపస్సును భగ్నం చేయడానికి వచ్చిన దేవ కన్యగా సుప్రసిద్ధ డాన్సింగ్‌ స్టార్‌ హెలన్‌ కనిపించి ‘సుందరాంగ అందుకోరా’ పాటలో అలరిస్తుంది. ఆ పాట కూడా హిట్టే. పురాణాల్లో అసురులే గొప్ప దైవభక్తులు. వారి వరాల్లో దోషం వుండొచ్చుగాని వారి భక్తిలో లేదు. ‘భూకైలాస్‌’ కూడా అటువంటి ఉదంతానికి ఒక ఉదాహరణ.

తొలి పూజ గణపతికే
ఉత్తర కర్నాటక జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున ‘గోకర్ణం’ క్షేత్రం ఉంది. ఇక్కడే ఆత్మలింగ క్షేత్రంగా చెప్పుకునే మహాబలేశ్వర ఆలయం ఉంది. పూర్తిగా భూమిలోకి ఉన్నట్టుగా ఉండే ఈ లింగం నిత్యం నిజ రూపంలో దర్శనం ఇవ్వకపోయినా పన్నెండేళ్లకొకసారి ఇచ్చే నిజ దర్శనంలో దీని పైకొస చేతులతో లాగినట్టుగా ఉండటం చూడవచ్చు. రావణుడి చేతి గుర్తులు ఈ లింగంపై ఉంటాయంటారు. అలాగే ఈ క్షేత్రంలో మహాగణపతి ఆలయం ఉంది. ఆ మూల విరాట్టు శిరస్సు మీద చిన్న సొట్ట ఉంటుంది. ఇది ఆనాడు రావణుడు చేతితో మొట్టడం వల్ల పడిన సొట్టగా అభివర్ణిస్తారు. ఈ క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించుకోవాలంటే ముందుగా మహా గణపతిని పూజించాలి. ఆనాడు తనకు తొలి పూజ జరగకపోవడం వల్ల కోప్పడిన వినాయకుడు అందుకు ప్రతిఫలంగా ఈనాడు ఇక్కడ తొలిపూజలు అందుకుంటున్నాడన్న మాట.
– కె


టాగ్లు: #shivudu, #bhukailash, #శివుడు, #భూకైలాస్‌



1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list