MohanPublications Print Books Online store clik Here Devullu.com

మహిమ లింగం-Mahima Lingam


మహిమ లింగం
హిమవన్నగములు.. హిమానీ నదాలు.. హిమపాతము.. ఇన్నిటి మధ్య ఆధ్యాత్మిక మహిమను చాటుతూ వెలసిన హిమలింగం.. అమర్‌నాథ్‌! యుగాల కిందట దేవతామూర్తులు దర్శించుకున్న పుణ్యక్షేత్రం. ఏటా లక్షల మంది భక్తులు చూసి తరించే ప్రకృతి శిల్పం.. అమర్‌నాథ్‌! ఒకప్పుడు భక్తి పారవశ్యాల మధ్య సాగిన అమర్‌నాథ్‌ యాత్ర.. ఇప్పుడు ‘భయ’భక్తుల మధ్య సాగుతోంది. ఆ ధవళమూర్తి దర్శనానికి భద్రతా దళాల పహారా అవసరం అవుతోంది. తాజాగా ఉగ్రదాడితో కలకలం మొదలైనా.. శివయ్య దర్శనానికి మాత్రం భక్తులు వెనుకంజ వేయడం లేదు. భారమంతా ఆ లయకారుడి మీద వేసి.. వ్యయప్రయాసలకోర్చి.. యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్‌ విశిష్టత మీ కోసం..

హిమాలయ పర్వత శ్రేణుల్లో వెలిసిన అందమైన గుహ. ఆ గుహాలయంలో గుంభనంగా కనిపించే శుద్ధ స్పటిక రూపం. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రాణాలు పోయాక ఆ కైలాసాన్ని చేరుకుంటామో లేదో! అందుకే.. ప్రాణాలకు తెగించి అపర కైలాసంగా అభివర్ణించే అమర్‌నాథ్‌ క్షేత్రాన్ని దర్శించుకుంటారు భక్తులు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురైనా.. వాటిని లెక్క చేయకుండా అమర్‌నాథ్‌ యాత్రకు పూనుకుంటారు.

అమర రహస్యం
అమర్‌నాథ్‌ ముక్తి క్షేత్రం. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుహలోనే పరమేశ్వరుడు పార్వతీదేవికి సృష్టి రహస్యాన్ని తెలియజేశాడంటారు. అమ్మవారికి సృష్టి రహస్యాన్ని తెలియజేసే క్రమంలో.. ఇతరులు ఎవరూ వినరాదని తన పరివారాన్ని ఒక్కో ప్రదేశంలో విడిచిపెట్టాడట శివుడు. నందీశ్వరుడిని పహల్గాంలో, శిఖలోని నెలవంకను చందన్‌వాడీలో, శేష్‌నాగ్‌ దగ్గర తన ఆభరణమైన వాసుకిని వదిలివేశాడట. మహాగణేశ పర్వతం దగ్గర వినాయకుడిని, పంచరతన్‌ దగ్గర పంచభూతాలను వదిలిపెట్టాడట. ఒక్క పార్వతిని మాత్రమే గుహ దగ్గరికి తీసుకొచ్చాడట. పార్వతితో ఆనంద లాస్యం చేసి ఆ తర్వాత సృష్టి రహస్యాన్ని తెలియజేశాడట. ఈ రహస్యాన్ని గుహపై ఉన్న ఒక పావురాల జంట విన్నదట. అమర రహస్యాన్ని చెప్పిన ప్రదేశం కావడంతో ఈ క్షేత్రానికి అమర్‌నాథ్‌ అని పేరు వచ్చింది. అంతటి దేవ రహస్యాన్ని విన్న ఆ పావురాలు మృత్యురాహిత్యాన్ని పొందాయని అంటారు. నేటికీ అమర్‌నాథ్‌ ఆలయంలో పావురాలు కనిపించడం విశేషం. పరమశివుడి పరివారం కొలువుదీరిన అమరనాథ్‌ పరిసర ప్రాంతాలు కూడా పుణ్యక్షేత్రాలుగా పరిఢవిల్లుతున్నాయి.

మంచు శిఖరం
ఏడాది పొడుగునా.. మంచుతో కప్పి ఉంటుందీ క్షేత్రం. ఏటా జూలై-ఆగస్టు నెలల్లో 45 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. గుహ అంతా మంచు పరుచుకుని ఒక వేదికగా కనిపిస్తుంది. దీనిపై ఆద్యంత రహితుడైన శివ రూపం మహిమాన్వితమై మంచు శిఖరంలా దర్శనమిస్తుంది. చంద్రుని వృద్ధి, క్షయాలను సూచిస్తూ.. ఈ లింగాకృతి పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. గరిష్ఠంగా ఆరు అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఏటా శ్రావణ పౌర్ణమి నాటితో అమర్‌నాథ్‌ యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీతో అమర్‌నాథుడి దర్శనానికి తెరపడనుంది.

శతాబ్దాలుగా..
అమర్‌నాథ్‌ క్షేత్ర వైభవం గురించి 11వ శతాబ్దానికి చెందిన కల్హణుడి ‘రాజతరంగిణి’ గ్రంథంలో ప్రస్తావన ఉంది. కశ్మీర దేశ రాణి సూర్యమతి అమరనాథుడికి బాణలింగం, త్రిశూలం కానుకగా సమర్పించుకుందట. నేటికీ అవి ఆలయంలో కనిపిస్తాయి. కశ్మీర రాజులెందరో స్వామిని తమ ఇలవేల్పుగా భావించేవారు. ఏటా అమర్‌నాథ్‌ యాత్ర నిర్వహించి భక్తిప్రపత్తులు చాటుకున్నారు. అమరనాథుడి సేవలో తరిస్తున్న బుటామాలిక్‌ వంశస్థుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరు యాత్ర సాగే దారిలో మధ్య మధ్యలో గుడారాలు వేసుకుని.. యాత్రికులకు వేడి వేడి తేనీరు, వంటకాలు అందిస్తుంటారు. యాత్రికుల నుంచి విరాళాలు తీసుకుని.. వచ్చిన మొత్తంలో మూడో వంతు తిరిగి భక్తుల అవసరాలకు వెచ్చిస్తారు.

అడుగడుగునా అపాయం..
అమర్‌నాథ్‌ యాత్ర ఎన్నో అనుభూతుల సమ్మేళనం. అకస్మాత్తుగా మారిపోయే వాతావరణం, ఎప్పుడు వచ్చి పడతాయో తెలియని కొండ చరియలు, మరోవైపు పాతాళాన్ని తలపించే లోయలు... ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా ప్రమాదం తప్పదు. ఏ వేళలో ఏం చేస్తారో తెలియని ముష్కర మూక. ఇన్ని ఇబ్బందులు ఉన్నా.. అమరనాథుడి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. అంతా శివయ్య లీల అనుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ.. ఆధ్యాత్మిక చైతన్యాన్ని పురిగొల్పుతూ ‘బోలేనాథ్‌.. అమర్‌నాథ్‌’ అని విశ్వాసంతో యాత్ర పూర్తి చేస్తారు.

ఐదేళ్లు రద్దు
శతాబ్దాలుగా సాగుతున్న అమర్‌నాథ్‌ యాత్ర.. ఉగ్రవాదుల దుశ్చర్యల కారణంగా ఐదేళ్లపాటు రద్దయింది. ఉగ్రవాదుల నుంచి యాత్రికుల ప్రాణాలకు ముంపు పొంచి ఉండటంతో 1991-95 మధ్యకాలంలో యాత్రను నిలిపివేసింది భారత ప్రభుత్వం. 1996లో యాత్రికులపై కాల్పులు జరపబోమని ఉగ్రవాదులు హామీ ఇవ్వడంతో యాత్రను పునరుద్ధరించారు. తీవ్రవాదుల ధోరణి కారణంగా దశాబ్దకాలంగా అమర్‌నాథ్‌ సందర్శించే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2008లో 5.33 లక్షల మంది అమర్‌నాథ్‌ని దర్శించుకోగా... 2016లో అది కేవలం 2.20 లక్షలకే పరిమితమైంది. 2017లో 1.46 లక్షల మంది మాత్రమే అమర్‌నాథ్‌ యాత్రకు ముందుకొచ్చారు.

ఇలా ముందుకు
శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గాం నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం అవుతుంది. ఇక్కడే అమర్‌నాథ్‌ యాత్ర బేస్‌ క్యాంప్‌ ఉంటుంది. పహల్గాం నుంచి అమర్‌నాథ్‌కు 45 కిలోమీటర్లు. బేస్‌క్యాంప్‌ నుంచి బృందాలుగా అమర్‌నాథ్‌ యాత్రకు బయల్దేరుతారు. పహల్గాంకు శ్రీనగర్‌ నుంచి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో రహదారికి ఇరువైపులా ఉండే లిడ్డర్‌ నదీపాయలు మనసును ఉల్లాసపరుస్తాయి.

పహల్గాం నుంచి చందన్‌వాడీ మీదుగా యాత్ర సాగుతుంది.
చందన్‌వాడీ నుంచి యాత్ర సంక్లిష్టంగా మారుతుంది. ఇక్కడి దుకాణాల్లో డ్రైఫ్రూట్స్‌, చాక్లెట్లు, ఇతర తినుబండారాలు కొనుక్కొని మళ్లీ ప్రయాణం మొదలుపెడతారు. పచ్చదనం పరుచుకున్న కొండల నడుమ ప్రయాణించాలి. చందన్‌వాడీ నుంచి గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. మూడున్నర అడుగులు ఉండే దారిలో, కొండ అంచుల వెంట వెళ్లాల్సి ఉంటుంది. కర్ర చేత పట్టుకుని నడుస్తుంటారు.
చందన్‌వాడీ నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణించాక శేష్‌నాగ్‌ ప్రాంతం వస్తుంది. ఇక్కడ ఐదు కొండలు నాగుపాము పడగల్లా కనిపిస్తాయి.
ఈ పర్వతాల చెంతనే ఒక నీలిరంగు తటాకం ఉంటుంది. ఇందులో శంకరుడి ఆభరణం అయిన వాసుకి నిద్రిస్తుందని విశ్వసిస్తారు.
శేష్‌నాగ్‌ దగ్గర భక్తులకు బస చేసే సదుపాయం ఉంటుంది. శేష్‌నాగ్‌ నుంచి 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే అమర్‌నాథ్‌ వస్తుంది.
పహల్గాం, చందన్‌వాడీ నుంచి అమర్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లే సదుపాయం కూడా ఉంది.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list