MohanPublications Print Books Online store clik Here Devullu.com

గౌతమిపుత్ర శాతకర్ణి _GautamiputraSatakarni_

సాహో... శాతకర్ణి
నాయకుడు...
గౌతమిపుత్ర శాతకర్ణి క్రీ.పూ. ఒకటి, రెండు శతాబ్దాలు. శాతవాహన సామ్రాజ్యం.
రాజధాని నగరమైన అమరావతి.
ఇరవైమూడో పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి - ఏకవ్యక్తి అక్షౌహిణి, కదిలే శతఘ్ని. అంతటి వీరుడు, అపార సాహసి! గౌతమిపుత్రుడు పట్టంకట్టుకున్న సమయానికి దేశం నిండా...జానాబెత్తెడు రాజ్యాలే, వామనవృక్షాల్లాంటి పాలకులే. ఆ అనైక్యతతో జాతి సార్వభౌమత్వానికి చేటుతప్పదని గ్రహించాడు. దేశాన్నంతా ఓ ఛత్రం కిందికి తీసుకురావాలని సంకల్పించాడు. అది రణన్నినాదమే అయినా, శాంతిమంత్రం అంతర్లీనం. పైపైకి రాజ్యకాంక్షలా అనిపించినా...సంక్షేమ ఆకాంక్ష నిబిడీకృతం. అస్థిరత్వాన్నీ అరాచకత్వాన్నీ రూపుమాపి...ఓ జాతినీ నీతినీ రీతినీ నిర్మించడానికి రాజసూయమే రాచమార్గమని తలచాడు.
భరతవర్షంలో ఇప్పటిదాకా మూడు రాజసూయ యాగాలు జరిగాయంటారు. ఒకటోది - మహాభారతంలో, ధర్మరాజు నేతృత్వంలో. రెండోది - ఉత్తరాదిలో, విక్రమాదిత్యుడి హయాంలో. మూడోది - అమరావతిలో, గౌతమిపుత్ర శాతకర్ణి కర్తృత్వంలో. అప్పుడే, రాజసూయంలో అగ్రపూజ ఎవరికన్న ప్రశ్న ఎదురైంది. హరిహరబ్రహ్మాదులకైనా అమ్మే ఆధారం కాబట్టి, బ్రహ్మాండనాయకుడైనా అమ్మ కడుపున పిండమే కాబట్టి...మాతృశ్రీ గౌతమీదేవికే ఆ గౌరవం దక్కుతుందని ప్రకటించాడా రాచబిడ్డడు. గౌతమి...మహిళ, వితంతువు! అపచారమనీ అనాచారమనీ హెచ్చరించారు. అయినా శాతకర్ణి నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆ మహాయాగంతో శాలివాహనశకం ప్రారంభమైంది. అదే యుగాది...ఉగాది.
తెలంగాణ గడ్డమీదున్న కోటిలింగాల శాతకర్ణి జన్మభూమి! ఇక్కడే, మాతామహుల ఇంట్లో పుట్టి పెరిగాడు. ఆంధ్రుల ప్రజారాజధానిగా పునర్వైభవానికి నోచుకున్న అమరావతి శాతకర్ణి కర్మభూమి! పట్టాభిషేకం చేసుకున్నదీ, పట్టుదలతో యావత్‌ దేశం మీదా పట్టుసాధించినదీ అమరేంద్రుడికి సైతం అసూయపుట్టేలా పాలన సాగించినదీ అమరావతి నుంచే!
గౌతమిపుత్ర శాతకర్ణి నడిచే పటాలం. జీవితమంతా రణమండలంలోనే గడిచిపోయింది. దేశీ శత్రువులూ, విదేశీ శత్రువులూ, మిత్రుల చాటు శత్రువులూ...ఏ ఒక్కర్నీ వదల్లేదు. ఆంధ్రప్రశస్తిలో విశ్వనాథవారు ‘ఇతడు విద్యానిధి. ప్రజ్ఞావంతుడు. ధనుర్విద్యావిశారదుడు. ఇతని పరాక్రమము నాభాగ నహూషజనమేజయ సగర యయాతి రామాంబరీశులను మించి ఉండెను..’ అని కొనియాడారు. శాతకర్ణి తర్వాత, పరపాలకులు ఇటువైపు కన్నెత్తి చూడటానికి కూడా పదిహేనువందల సంవత్సరాలు పట్టింది. అవీ పునాదులంటే, అదీ నాయకత్వమంటే! ఆ సంగ్రామయోధుడి సమగ్ర వ్యక్తిత్వాన్ని తెరకెక్కించడం అంటే - రాజసూయాన్ని తలపించే సృజనాత్మక యాగమే.
బృందనాయకుడు
జాగర్లమూడి క్రిష్‌
గౌతమిపుత్ర శాతకర్ణి...ఆ పేరు వింటేనే క్రిష్‌ ఒళ్లు పులకిస్తుంది, కళ్లు మెరుస్తాయి. బాల్యం నుంచీ ఆ యోధుడే దర్శకుడి కలల కథా నాయకుడు. కార్తిక స్నానానికో, వనభోజనానికో వెళ్లినప్పుడు...తాతయ్య జాగర్లమూడి రమణయ్యగారి చిటికెనవేలు పట్టుకుని అమరావతి వీధుల్లో నడుస్తున్నప్పుడు - తొలిసారిగా ఆ సమ్రాట్టు పేరు విన్నాడట. అప్పుడే మొదలైంది క్రిష్‌ చారిత్రక కృషి...
‘ఏ పుస్తకం కనిపించినా శాతకర్ణి కదనకుతూహలాన్ని చాటే వీరోచిత గాథల కోసం కళ్లు ఆత్రుతగా వెదికేవి. అమరావతిలో ఏ బండరాయి కనిపించినా శాతవాహనుల శాసనమేమో అని ఆశగా తడిమిచూసిన రోజులున్నాయి. కోటిలింగాలలో అలనాటి నాణాలు దొరికినట్టు ఎవరో చెప్పారు. రెక్కలు కట్టుకుని ఆ గడ్డ మీద వాలిపోయాను. అయినా, తనివితీరక పరబ్రహ్మశాస్త్రి లాంటి పురావస్తు నిపుణుల్ని సంప్రదించాను. గౌతమీమాత నాసిక్‌లో వేయించిన శాసనాల్నీ చూసొచ్చాను. దక్షిణ భారతదేశ చరిత్రకు సంబంధించి నీలకంఠశాస్త్రిలాంటి వారు లోతైన పరిశోధనలు చేశారు. ఆ పుస్తకాలన్నీ కంఠతా వచ్చేశాయి. లండన్‌ మ్యూజియంలోని అమరావతి గ్యాలరీ నుంచి కూడా సమాచారం తెప్పించుకున్నాను. మహారాష్ట్ర రాజు నహపాణుడూ, యవనపాలకుడు డెమిత్రియస్‌...తదితరుల చరిత్ర నుంచీ కొంత ఆధారం లభించింది. చరిత్రను చరిత్రగా చదివితే యుద్ధాలూ సైనిక దాడులూ మినహా మరో ప్రస్తావన ఉండదు. వర్తమానంలోంచి గతాన్నిచూస్తే... నిస్సారంగానే ఉంటుంది. అది కాదు పద్ధతి. మనమూ, కాలయంత్రమెక్కి గతంలోకి వెళ్లాలి. ఆ భేరీనాదాలు వినాలి. కత్తులూ బల్లాలూ పట్టుకుని ఆ
సైనికులతో పాటూ పరిగెత్తాలి. పాలకుడి ప్రతి బిరుదం వెనకున్న అంతరార్థాన్ని విశ్లేషించుకోవాలి. శాతకర్ణిని ‘త్రిసముద్రతోయ పీతవాహన’ అని అభివర్ణించిందో శాసనం. అంటే, ఆయన గుర్రాలు మూడు సముద్రాల నీళ్లు తాగాయట! ఆ సామ్రాజ్యం అంత విస్తారమైంది అన్నమాట! అలా...ఒక్కో ఘట్టాన్నీ పేర్చుకుంటూ వెళ్లినప్పుడే...గౌతమిపుత్ర శాతకర్ణి విరాట్‌రూపం మనకు దర్శనమిస్తుంది. గౌతమిపుత్రుడి కథను జిజియాబాయి శివాజీకి చెప్పేదట. మామూలు తల్లుల్లా... నిద్రపుచ్చడానికి కాదు. ఆత్మాభిమానాన్ని మేల్కొలపడానికి, కర్తవ్యాన్ని గుర్తుచేయడానికి. అంతటి మహావీరుడి రూపురేఖలు ఇంకెంత పదునుగా ఉండాలి! ఆ రాజసం, తేజసం నందమూరి బాలకృష్ణగారిలో కనిపించాయి. ఆయన కూడా అంతే ఉత్సాహంగా ఈ పాత్రకు అంగీకరించారు.
వీరుడి తొలిబడి అమ్మ ఒడే! ఆమెలో కారుణ్యమూ కాఠిన్యమూ కలగలసి ఉండాలి. గౌతమీమాత పాత్రకు ఎవర్ని ఎంచుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు...హేమమాలినే గుర్తుకొచ్చారు. శాతకర్ణి అర్ధాంగి వాసిష్ఠి. భర్త మీద అపారమైన మమకారం ఒకవైపూ, పోరే సర్వస్వమైన పెనిమిటి, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న తీవ్ర అసంతృప్తి మరోవైపూ...ఆ ద్వైదీభావాన్ని సమర్థంగా పలికించే నటి ఎవరన్న ప్రశ్నకు - శ్రియ హావభావాల్లో సమాధానం దొరికింది. క్రూరత్వానికి పరాకాష్ట అయిన నహపాణుడి పాత్రకు కబీర్‌బేడీ అతికినట్టు సరిపోయారు. వస్త్రధారణ విషయంలోనూ ఎంతో తర్జనభర్జన. పల్లెవాటుగా చిన్న వస్త్రాన్ని కప్పుకోవడమే తప్పించి...భారీ అలంకరణలు తెలియని రోజులవి. ఆడవారికి కూడా నడుము పైభాగంలో ఎలాంటి ఆచ్ఛాదనా ఉండేది కాదు. ఆ వస్త్రధారణను యథాతథంగా తీసుకోలేం. ఫ్యాషన్‌ డిజైనర్‌ నీతాలుల్లా అలనాటి సంప్రదాయశైలికి దగ్గరగా వస్త్రాల్ని రూపొందించారు. చిరంతన్‌భట్‌ సంగీతం యుద్ధ దృశ్యాల్లో కొత్త వేడిని రగిలించింది. ఒకరని ఏమిటి, బృందంలోని ప్రతి ఒక్కరూ పనిని తపస్సుగా భావించారు. కాబట్టే, ఏడెనిమిది నెలల సమయంలో ఇంత గొప్ప చిత్రాన్ని తీయగలిగాం.
జాతీయ అవార్డు అందుకోడానికి వెళ్లినప్పుడు రాజమౌళిగారికి ఈ కథ చెప్పాను. ‘ఎక్కువగా గ్రాఫిక్స్‌ పెట్టుకోవద్దు. దీనివల్ల చాలా సమయం పడుతుంది. సాధ్యమైనంత వరకూ లైవ్‌ షూటింగ్‌ పెట్టుకో. చిన్నచిన్న సెట్స్‌ వరకూ అయితే ఫర్వాలేదు’ అని సలహా ఇచ్చారు. ఆ సూచన బాగా ఉపయోగపడింది. సహజమైన దృశ్యాలకోసం మొరాకో, జార్జియాలకు వెళ్లాం. మధ్యప్రదేశ్‌ లాంటి చోట్లా షూటింగ్‌ చేశాం. వందలకొద్దీ గుర్రాలతో, వేలమంది సైనికులతో భారీ యుద్ధ దృశ్యాలు చిత్రించాం. కాబట్టే, చిత్రంలో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కంటే, సహజ దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తాయి. దర్శకుడు అనేవాడు అంతర్నేత్రాలతో దర్శించినదాన్ని....ప్రేక్షకుల బాహ్య నేత్రాల ముందుకు తీసుకెళ్లగలగాలి. ఆ ప్రయత్నంలో నేను విజయం సాధించానని సగర్వంగా చెప్పగలను’
కథా నాయకుడు...
నందమూరి బాలకృష్ణ
ఎవరైనా నటిస్తారు. మహా అయితే జీవిస్తారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఆ పాత్రను ఆవాహన చేసుకుంటారు. అందులోనూ అది శకపురుషుడి పాత్రŒ. నడకలో నడతలో, చూపులో పలుకులో రాజసం తొణికిసలాడాలి. ఆ పాత్రధారి క్షాత్రవిద్యల్లోనూ ఆరితేరి ఉండాలి. బాలయ్యకు రాజసం వారసత్వంగా వచ్చేసింది. ఇక, కత్తిసాములు కొట్టినపిండి. గుర్రపుస్వారీ బొమ్మలాటే...కాబట్టే, క్రిష్‌ ఆయన్నే దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేసుకున్నాడు. కాదంటే, సినిమాయే లేదనేంత కఠిన నిర్ణయానికొచ్చాడు. కాస్త ఆలస్యమై ఉంటే, బాలయ్య ఇంకేదో ప్రాజెక్టును వందో సినిమాగా ఒప్పుకునేవారే! అనేక అవాంతరాల తర్వాత, సృష్టికర్త మహాదర్శకుడి పాత్ర పోషించి...చక్కని స్క్రీన్‌ప్లేతో ఇద్దరినీ ఒక చోటికి చేర్చాడు. ఒక చారిత్రక సందర్భానికి తగినట్టు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని తెరమీదికి తెచ్చాడు. బాలయ్యకైతే ఈ అవకాశం నాన్న పంపిన ఆశీర్వచనపూర్వక కానుక. ఆ ఆనందమంతా ఆయన మాటల్లోనే...
‘ఈరోజు కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో నేనూ అంతే ఎదురుచూస్తున్నా. ఇంత సమయం తీసుకోడానికి కారణమేమిటో కూడా ముందు చెప్పాలి. వందో సినిమా అంటే...తొంభై తొమ్మిది సినిమాల కష్టం నుంచి పుట్టుకొచ్చిన ఫలితం. తొంభై తొమ్మిది మైలురాళ్లను దాటిన నా నలభై ఏళ్ల ప్రయాణం. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తూ వచ్చిన నా ప్రేక్షక దేవుళ్లకు నేను చేయాల్సిన చిత్రోత్సవం. నా చరిత్రలోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనూ నిలిచిపోవాలి. అందుకే, ఎన్నో కథలు విన్నాను. కొన్ని నచ్చలేదు. కొన్ని నచ్చినా, వందో సినిమా స్థాయి ఉందనిపించలేదు. ఎక్కడో ఏదో అసంతృప్తి. ఇంకా ఏదో కావాలి. ఆ క్రమంలోనే క్రిష్‌ కథ విన్నాను. అదే, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇంతకాలం నేను ఆగింది ఇలాంటి కథ కోసమే అనిపించింది. ఇది ఓ తెలుగు వీరుడి కథ. మన చరిత్ర. ఈ సమయంలో నాన్నగారే ఉంటే, నన్ను ప్రేమగా గుండెలకు హత్తుకునేవారు. నా వందో చిత్రం ఇదే కావాలన్నది ఆయన సంకల్పమేమో! అందుకే, క్రిష్‌ను నా దగ్గరికి పంపారేమో! నాగరికత తలకట్టు నా తెలుగుభాష. జాతి మెలితిప్పిన మీసకట్టు నా మాతృభాష. ప్రపంచం కట్టిన పంచెకట్టు నా తెలుగు భాష. జాతి ఘనతనూ భాషా వైభవాన్నీ చాటే ఓ మంచి చిత్రం ద్వారా ఈ సంక్రాంతికి మీ ముందుకు వస్తున్నా’.
అక్షర తపస్వి
సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఆయన గదిలోకి అడుగుపెట్టగానే నా ఉచ్ఛ్వాసం కవనం...నా నిశ్వాసం గానం - అన్న ‘సిరివెన్నెల’ వచనాలు కనిపిస్తాయి. దాదాపు మూడు దశాబ్దాల నుంచీ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే సినిమా సాహిత్యాన్ని బతికిస్తున్నాయి. లేకపోతే, ‘ఆదిభిక్షువు వాడినేది కోరేదీ, బూడిదిచ్చేవాడినేది అడిగేదీ...’ అనగలిగేంత తాత్విక భూమిక ఆధునిక తెలుగు సినిమాకు ఎక్కడిది? అల్లాటప్పా పదవిన్యాసాలతో సరిపెట్టుకోకుండా, భావపుష్టి ఉన్న పాటల్ని కోరుకునే దర్శకులకు సీతారామశాస్త్రి పదబంధ పరమేశ్వరుడు! కాబట్టే, కథ సిద్ధం కాగానే క్రిష్‌ నేరుగా వెళ్లి, పట్టినిలిచే పాట కావాలంటూ పెద్దాయన పాదాల మీద పడ్డాడు. ఇంకేముంది...అక్షరమథనం మొదలైంది, గేయామృతం వరదైంది...‘పదకొండో శతాబ్దం నుంచీ తెలుగు భాష సంకరమైంది. ఆ పదాలేమిటో తెలియకపోయినా, ఈ పదాల్ని మాత్రం ఉపయోగించకూడదు. రెండువేల సంవత్సరాల నాటి భాషే అనిపించేలా రాయగలగాలి. అందుకే, ఓ యుగళగీతాన్ని ‘ఎకిమీడా..’ అని మొదలుపెట్టాను. ఇది సంస్కృత సంపర్కం లేని తెలుగుమాట. ‘రాజా..’ అని అర్థం. ఓ సందర్భంలో గౌతమి పుత్రుడూ, వాసిష్ఠీదేవీ మారువేషాల్లో విహారానికి వెళ్తారు. అంతఃపురంలో అయితే ‘ప్రభూ!’ అనో ‘స్వామీ!’ అనో సంబోధించేదేమో. ఏకాంతంలో రాచరిక బంధనాలుండవు కాబట్టి, అచ్చమైన అనురాగానికి గుర్తుగా స్వచ్ఛమైన తెలుగు మాట ప్రయోగించాను. ‘ఎకిమీడా నా జతవిడనని వరమిడవా..తగుజోడా నా కడకొంగున ముడిపడవా’ అన్నాను. ఆ ప్రయోగం విషయంలో పెద్ద చర్చే జరిగింది. ‘ఎవరికి అర్థం అవుతుందీ?’ అన్నవారూ ఉన్నారు. అర్థం కాకపోవడం అన్న మాటకు అర్థం లేదు. ఆత్మతో రాస్తే, ఆత్మ ఆత్మతో సంభాషిస్తుంది. తెలియకపోతే తెలుసుకుంటారు. ఇప్పటికే చాలా పదాల్ని పోగొట్టుకున్నాం. మిగిలిన కొద్దిపాటి పద సంపదనైనా కాపాడుకోకపోతే ఎలా? ఆ తపనతోనే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలోని నాలుగు గీతాలకూ ప్రాణం పోశాను. కథకు అనుగుణంగా, అవసరంగా ఉంటూనే, శ్రవణపేయంగా ఉండే పదాల్ని ఎంచుకున్నాను. యుద్ధ నేపథ్యంలో ‘గణగణగణ గుండెలలో జేగంటలు మోగెను రక్కసి మూకలు ముక్కలుముక్కలయేలా...గణగణగణ కన్నులలో కార్చిచ్చులు రేగెను చిక్కటి చీకటి నెర్రగ రగిలించేలా...’ ఇలా, చిన్నచిన్న పదాలతోనే రౌద్రాన్ని పలికించిందో గీతం. ‘సాహో సార్వభౌమా...బహుపరాక్‌’ కూడా అంతే ఉత్సాహభరితమైన పాట. ‘నిన్నే కన్న పుణ్యం కన్న ఏదీ మిన్న కాదనుకున్న జననికి, జన్మభూమికి తగిన తనయుడివన్న మన్నన పొందరా...’ అంటూ ప్రతి ఒక్కరిలోనూ నైతిక బాధ్యత గుర్తుచేసే ప్రయత్నమూ చేశాను. రచయితగా అది నా కర్తవ్యం కూడా.
మాటల మాంత్రికుడు..
బుర్రా సాయిమాధవ్‌
పాత్ర..నడిచేయుద్ధం లాంటి మహావీరుడిది. పాత్రధారి...శతచిత్ర యోధుడైన బాలకృష్ణ. రౌద్రరస ప్రధానమైన ఇతివృత్తం. ప్రతి మాటా మందుగుండులా పేలాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో రచయిత తనకంటూ ఓ అక్షర ఆయుధాగారాన్ని నిర్మించుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి...ప్రేక్షకుడికి వూపిరిపీల్చుకునేంత సమయం కూడా ఇవ్వకుండా, సంభాషణ భాస్వరమై మండాల్సిందే. బుర్రా సాయిమాధవ్‌కు ఆ జిగిబిగి తెలుసు. కాబట్టే...‘దేశం మీసం మెలేసింది!’, ‘దొరికినవాళ్లని తురుముదాం, దొరకనివాళ్లని తరుముదాం’ తరహా వీర వచనాలు పేరిణీ శివతాండవంలా కథలో సైనికుల్నీ, థియేటర్లో ప్రేక్షకుల్నీ ఉర్రూతలూగిస్తాయి. ఈ అవకాశం మహద్భాగ్యమని పొంగిపోతాడా యువ రచయిత...‘ క్రిష్‌ స్పష్టత ఉన్న దర్శకుడు. తనకేం కావాలో తెలుసు. రచయిత నుంచి ఎలా రాబట్టుకోవాలో కూడా తెలుసు. గతంలో కలసి పనిచేయడంతో...ఆయన ఏం చెప్పారన్నదే కాదు, ఎందుకు చెప్పారన్నదీ అర్థం చేసుకోగలిగినంత అవగాహన నాకు ఏర్పడింది. దీంతో, ఎక్కడా ఇబ్బంది కలగలేదు. పతాక సన్నివేశ దృశ్యాల విషయంలో మాత్రం....ఓపట్టాన ఆయన సంతృప్తి చెందలేదు. నేనూ దాన్నో సవాలుగా తీసుకున్నా. దాదాపు పది సార్లు తిరగరాసుకున్నా. అయినా దర్శకుడికి నచ్చలేదు. రెండ్రోజుల విరామం తర్వాత...మళ్లీ మొదలుపెట్టాను. వాటిని చూశాక ‘ఇదే నాకు కావలసింది...’ అన్నారు క్రిష్‌. ఆడియో ఫంక్షన్‌లో బాలకృష్ణగారు వినిపించిన డైలాగ్‌ కూడా అదే ...‘వెళ్లు. వెళ్లి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు. ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గదికీ గదికీ మధ్య గోడలుంటాయి. గొడవలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం. కానీ ఎవడో వచ్చి నా ఇల్లంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లోనే మీకో శ్మశానం నిర్మిస్తాం. మీ మొండేల మీద మా జెండా ఎగరేస్తాం’. క్రిష్‌ సంభాషణలు రాసే అవకాశం ఇస్తూ...‘తెలుగు భాష సౌందర్యం ఏమిటో తెలుగు రానివాళ్లకూ తెలియాలి’ అని చెప్పారు. ఆ మాట నిలుపుకున్నా!
* * *
సినిమా అంటే గ్రాఫిక్స్‌ మాయాజాలమో, గగుర్పాటు కలిగించే విన్యాసాల సమాహారమో కాదు. బలమైన మాధ్యమం. విశ్వశ్రేయః కావ్యం...సినిమా కూడా ఓ కావ్యమే, మహా అయితే దృశ్య కావ్యం. సాహిత్యానికి వర్తించే విలువలే చలనచిత్రానికీ వర్తిస్తాయి. వినోదంతో పాటూ వికాసాన్నీ మోసుకురాని సినిమా...దొమ్మరాటలా ఓ కాలక్షేపమంతే! పేకాటలా ఓ వ్యసనమంతే! మంచి సినిమా అనేది... ‘ఇది నీ జాతి. ఇదే నీ ఘన చరిత్ర. ఈ మహానుభావులకే నువ్వు వారసుడివి. ఆ పేరు నిలబెట్టుకో, ఆ విలువల్ని కాపాడుకో..’ అంటూ వర్తమానమనే తెరమీద, గతాన్ని గుర్తుచేసి, భవిష్యత్తు దిశగా ప్రేక్షకులతో అడుగులేయిస్తుంది. నిద్రలో ఉన్నవారిని తట్టిలేపినట్టు, నిద్రాణమైన శక్తిసామర్థ్యాల్ని గుర్తుచేస్తుంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పరమలక్ష్యం కూడా ఆ సామాజిక పరివర్తనేనంటాడు దర్శకుడు క్రిష్‌.
శాతవాహనుల కథ..
విశ్వనాథవారి ‘ఆంధ్రప్రశస్తి’ ప్రకారం ...పూర్వం దీపకర్ణి అనే తెలుగు పాలకుడు ఉండేవాడు. అతడి అర్ధాంగి పాముకాటుకు బలైపోయింది. భార్య తలపులతో జీవితాన్ని గడుపుతున్న మహారాజుకు కులదేవత కలలో కనిపించి మరుసటి రోజు వేటకు వెళ్లమని ఆదేశించింది. దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకోగానే...అక్కడో అద్భుత దృశ్యం గోచరించింది. ఓ పసివాడు సింహం మీద సవారీ చేస్తూ కనిపించాడు. ఓ సరస్సు దగ్గరికి చేరుకోగానే సింహం ఆ బిడ్డను దింపి, దాహం తీర్చుకోడానికి వెళ్లింది. రాజు అదే అదనుగా భావించి సింహం మీద బాణం వేయబోయాడు. అప్పుడా మృగం గంధర్వరూపం ధరించి తన కథంతా వివరించింది. శాతం అంటే సింహం. మృగరాజును వాహనం చేసుకున్నవాడు కాబట్టి, ఆ బాలుడు శాతవాహనుడు అయ్యాడు.
స్వప్నసుందరీ...
లనాటి అందాలతార హేమమాలిని ఈ చిత్రంలో రాజమాత గౌతమి పాత్రను పోషించారు. హేమమాలినికి కోపం ఎక్కువనీ, ఏ కాస్త తేడా వచ్చినా షూటింగ్‌ మధ్యలోంచి వెళ్లిపోతారనీ ఓ ప్రచారం ఉండేది. ‘గౌతమిపుత్ర...’ బృందానికి అదంతా అపోహే అని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ‘నాకు తెలుగు సినిమాలు కొత్తేం కాదు. నా మొదటి చిత్రం...పాండవ వనవాసం. నర్తకి పాత్రలో కనిపించాను. శ్రీకృష్ణ విజయంలోనూ నటించాను. రెండు సినిమాలకూ ఎన్టీఆర్‌గారే హీరో’ అంటూ అందరితో కలుపుగోలుగా మాట్లాడారు. నటులకు భాష పెద్ద అవరోధం కాబట్టి, తొలుత ఈ చిత్రంలో నటించడానికి హేమమాలిని అంగీకరించలేదు. క్రిష్‌ ఓ గంట సమయం తీసుకుని, పాత్ర ఔన్నత్యాన్ని వివరించాక, ఆమె సంతోషంగా సరేనన్నారు.
కబీర్‌బేడీ
‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో కబీర్‌బేడి నహపాణుడిగా దర్శనమిస్తాడు. క్రూరత్వానికి పరాకాష్ట ఆ పాత్ర. పసిపిల్లల్ని ఎత్తుకెళ్లి పాలకుల్ని బెదిరించే కుటిల స్వభావం. ప్రతినాయకుడిలోని రక్కసి గుణాన్ని సంభాషణలు రెట్టిస్తాయి. కబీర్‌బేడీకి తెలుగు రాదు. అర్థం చేసుకోనూలేరు. మరో నటుడైతే, సంభాషణల్ని ఏ ఆంగ్లంలోనో రాయించుకుని గడగడా అప్పజెప్పేసి, తన పని అయిపోయిందని అనుకునేవాడు. దీంతో డబ్బింగ్‌ సమయంలో, ఇబ్బంది ఏర్పడేది. పెదాలకదలికలకు తగినట్టు మాటల్ని మార్చాల్సి వచ్చేది. ఫలితంగా బలమైన పదాలు పడాల్సిన చోట, మొక్కుబడి మాటలతో ముగించాల్సి వచ్చేది. కబీర్‌బేడీకి ఆ వ్యవహారం నచ్చదు. డైలాగ్‌ చెబుతున్నప్పుడే...అర్థంలోనూ ఉచ్చారణలోనూ తెలుగు పదానికి దగ్గరగా ఉండే హిందీమాటనే ఎంచుకునేవారు. దీంతో డబ్బింగ్‌ కష్టాలు తప్పాయి.
భేష్‌...బాలయ్య!
ఓ ఘట్టంలో గౌతమిపుత్ర శాతకర్ణి తన బిడ్డ పులోమావిని తీసుకుని యుద్ధానికి బయల్దేరతాడు. ఆ దృశ్యాన్ని చిత్రిస్తున్నప్పుడు...చుట్టూ అగ్నిగోళాలు మండుతూ ఉంటాయి. గుర్రం కాస్త ముందుకెళ్లాక....అగ్ని గోళాలు ఒకవైపున మాత్రమే పేలడం మొదలుపెట్టాయి. రెండోవైపు ఆగిపోవడంతో...ముందుకెళ్లాల్సిన గుర్రం పక్కకి తిరిగింది. దీంతో బాలకృష్ణ గుర్రం మీది నుంచి పసివాడితో సహా కిందపడిపోయారు. అయినా, బిడ్డకు ప్రమాదం జరగకుండా భద్రంగా ఒడిసిపట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా తన గురించి పట్టించుకోకుండా, ‘బిడ్డకేం కాలేదు కదా..’ అని ఆందోళన చెందారు. అరగంట విశ్రాంతి తీసుకుని మళ్లీ సెట్స్‌ మీదికి వచ్చారు. ఇనుమడించిన ఉత్సాహంతో యుద్ధ సన్నివేశంలో నటించారు. ఇది మొరాకోలో జరిగిన సంఘటన. ఆ దృశ్యాన్ని చూసిన విదేశీయులు ‘మీ హీరో...నిజ జీవితంలోనూ హీరోయే’ అని మెచ్చుకున్నారు.
ఎన్టీఆర్‌ హయాంలోనే...
కలకళా వల్లభుడైన గౌతమిపుత్ర శాతకర్ణిగా నటించాలన్నది ఎన్టీఆర్‌ చిరకాల వాంఛ. స్క్రిప్టు కూడా రాయించుకున్నారు. అయితే ఆ కథా, ఈ కథా ఒకటి కాదు. మహాసామ్రాజ్య నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ కథ మొదలవుతుంది. గౌతమిపుత్రుడు బౌద్ధాన్ని తీసుకోవడంతో పూర్తి అవుతుంది. ఈ సినిమాలో మాత్రం...భరతజాతిని ఒక ఛత్రం కిందికి తీసుకురావడమే ప్రధాన ఇతివృత్తం. శాతకర్ణి పుత్రుడైన పులోమావి పాత్రకు వెంకటేశ్‌ను అనుకున్నారు. పూర్వ శాతవాహనరాజు హాలుడిగా ఫ్లాష్‌బ్యాక్‌ సీనులో బాలకృష్ణ అయితే బావుంటుందన్న నిర్ణయానికొచ్చారు. ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశంతో ఆ ఆలోచన ఆలోచనగానే మిగిలిపోయింది. అయితేనేం, మరో రూపంలో శాతవాహనుల మీద అభిమానాన్ని చాటుకున్నారాయన. ట్యాంక్‌బండ్‌ మీద ఏర్పాటు చేసిన తెలుగు ప్రముఖుల విగ్రహాల్లో మొదటిది శాతవాహనుడిదే! విజయవాడ ఆర్టీసీ బస్సు ప్రాంగణానికి కూడా శాతవాహనుడి పేరే పెట్టారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో 90 శాతం!
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి సంబంధించి దేశీయంగా జరగాల్సిన షూటింగ్‌లో తొంభైశాతం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే జరిగింది. ఆతర్వాత చెప్పుకోవాల్సింది...మొరాకోలోని అట్లాస్‌ స్టూడియో. ‘ట్రాయ్‌’ లాంటి ప్రసిద్ధ చిత్రాలన్నీ అక్కడే ప్రాణంపోసుకున్నాయి. చారిత్రక సినిమాల కోసం హాలీవుడ్‌ దర్శకులు ఆ స్టూడియోకే ప్రయాణం అవుతారు. ఆ నగరం సినిమా కోసమే నిర్మితమైనట్టు ఉంటుంది. అంతా ఎడారి ప్రాంతం. దూరంగా మంచుకొండలూ కనిపిస్తూ ఉంటాయి. ప్రతి పది నిమిషాలకోసారి హోరుగాలికి ఇసుక...రేగిపోతుంది. ఆ ప్రతికూల వాతావరణంలోనూ నటులూ, సాంకేతిక నిపుణులూ...శాతకర్ణి సైన్యంలో తామూ భాగమే అన్నంత అంకిత భావంతో పనిచేశారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list