MohanPublications Print Books Online store clik Here Devullu.com

అరకు చూసొద్దాం_Araku Valley-MohanPublications


అరకు చూసొద్దాం... అద్దాలపెట్టెలో!
స్సు, రైలు, విమానం... దేన్లో ప్రయాణం చేసినా కిటికీ పక్కనే కూర్చోవాలనుకుంటాం. అలాంటిది ఓ రైలు బోగీ మొత్తం కిటికీలా ఉంటే, అదే ‘విస్టాడోమ్‌’. దీన్లో కూర్చున్నా, నిల్చున్నా బయటి అందాల్ని చూడటానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈ ఏసీ బోగీ పైకప్పు కూడా అద్దాలతోనే ఉంటుంది. అడుగుపెట్టగానే సుతిమెత్తని కార్పెట్‌తో స్వాగతం పలికే విస్టాడోమ్‌లో 40 సీట్లుంటాయి. వాటిలో కూర్చొని 180 డిగ్రీల కోణంలో కుర్చీని తిప్పుతూ, ఏ అందాన్నీ మిస్సవకుండా 360 డిగ్రీల్లోనూ వీక్షించవచ్చు.
* * *
విశాఖ నుంచి అరకు రైలు మార్గం 130 కి.మీ. రోజూ ఉదయం ఏడు గంటలకు బయలుదేరే విశాఖ- కిరండూల్‌ ప్యాసెంజరు రైలుకు ఈ విస్టాడోమ్‌ కోచ్‌ను అనుసంధానిస్తున్నారు. ఈ రైలు పదిన్నరకు బొర్రాగుహలూ, 11 గంటలకు అరకు చేరుకుంటుంది. రైలు ప్రయాణంలో మొదటి గంటన్నర తర్వాతే అసలైన మజా మొదలవుతుంది. బొడ్డవర స్టేషన్‌ నుంచి వచ్చే అనంతగిరి అడవులు, ఎత్తయిన కొండలు, వాటిమధ్య పచ్చదనం, సొరంగ మార్గాలూ, జలపాతాలూ... ఈ అందాలన్నీ కళ్లార్పకుండా చూడాల్సినంత సుందరమైనవే. కదిలే రైల్లో విస్టాడోమ్‌లోనుంచి వీటిని చూస్తుంటే గాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. 1000 మీటర్ల ఎత్తునున్న గమ్యానికి వెళ్తుంది కాబట్టి రైలు వేగం 30కి.మీ.ని మించదు. ఇలా మెల్లగా కదిలేటపుడు పచ్చటి పంట పొలాలు మెట్లలా జరుగుతున్నట్టు కనిపిస్తాయి. సీట్లలోంచిలేచి నిల్చున్నపుడు అందాల్ని మిస్సవ్వాల్సిన పని లేదు. కాసేపు బోగీ వెనక భాగంలో ఉన్న లాంజ్‌లో నిల్చొని ప్రయాణించడం మరో అద్భుతమైన అనుభవం. లాంజ్‌కు వెనక విశాలమైన అద్దంతోపాటు రెండువైపులా రెండు అద్దాలున్నాయి. ఇక్కడ 10 మంది నిల్చొని చూడ్డానికి వీలుంటుంది. ఈ దారిలో మొత్తం 50 సొరంగాలున్నాయి. వీటిలోంచి బయటకు వచ్చినపుడు ఇలా వెనక నుంచి చూస్తే ఆ కిక్కే వేరు. ఈ బోగీని రైలుకి చివర్లో పెడతారు. ముందువైపు ఇంజిన్‌, ఇతర బోగీలు వంపులు తిరుగుతూ వెళ్తొంటే ఆ దృశ్యాల్ని ఆఖరిపెట్టెలోంచి చూస్తూ భలే ఆస్వాదించవచ్చు.
* * *
ఈ విస్టాడోమ్‌ దేశంలోనే మొదటిది. చెన్నైలోని ‘ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ’లో ఇలాంటివి మూడు కోచ్‌లు తయారయ్యాయి. మరొకటి త్వరలోనే అరకు రానుంది. ఇంకోటి కశ్మీర్‌ వెళ్లనుంది. అంటే, ప్రస్తుతానికి దేశంలో ఈ సౌకర్యం తెలుగుగడ్డపైన మాత్రమే ఉంద్నమాట. మరెందుకు ఆలస్యం ఐఆర్‌సీటీసీకి వెళ్లి అరకు టూర్‌ ప్లాన్‌ చేసుకోండి!
- హిదాయతుల్లా బిజాపూర్‌, ఈనాడు విశాఖపట్నం
ఫొటోలు: నాయుడు, గోపి


అద్దాల రైల్లో ప్రయాణిస్తూ...

అరకు అందాలు

చూసేద్దాం!

రైల్లో అరకు లోయ ప్రయాణం ఒక మధురానుభూతిని ఇస్తుంది. గలగల పారే సెలయేళ్లు, ఆకాశం నుంచి పడుతున్నట్లుగా జలపాతాల హోరు, పచ్చటి కొండలు కోనల మీదుగా సాగే ఈ యాత్రలో మజాను అనుభవించాల్సిందే గానీ వర్ణించడానికి మాటలు సరిపోవు. ఈ ప్రయాణాన్ని మరింత మధురంగా మార్చడానికి ఐఆర్‌సిటిసి నిర్ణయించింది. ప్రకృతి అందాలను ప్రయాణికులు వీక్షించేందుకు వీలుగా గ్లాస్‌- టాప్ డ్‌ సీలింగ్‌ కోచ్‌లను ప్రవేశ పెట్టనుంది. దేశంలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్విట్జర్లాండ్‌లో నడుస్తున్న ఈ తరహా రైళ్లకు ఉన్న ప్రజాదరణను పరిశీలించిన తర్వాత వాటిని ఇక్కడా ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపారు. అరకుతో పాటు, కశ్మీర్‌ వ్యాలీలో ఈ కోచ్‌ల టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారు. మామూలు కోచ్‌లతో పోలిస్తే ఈ కోచ్‌లు మరింత సౌకర్యవంతంగా, ఆధునికంగా, సాంకేతిక సదుపాయాలతో ఉంటాయి. ఒక్కో కోచ్‌ తయారీకి 4 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 1.21 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. రీసెర్చ్‌, డిజైన్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డిఎ్‌సఒ), పెరంబూర్‌లోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, ఐఆర్‌సిటిసిలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ఈ డిసెంబర్‌ నుంచి చేపట్టనున్నాయి.









.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list