MohanPublications Print Books Online store clik Here Devullu.com

Jonnalatho Vantalu, జొన్నలతో వంటలు



జొన్నలతో వంటలు 
Jonnalatho Vantalu




జొన్నలు రఫ్ అండ్ టఫ్‌గా ఉంటాయి.
వండామా... సాఫ్ట్ అండ్ స్మూత్ అయిపోతాయి!
తిన్నామా... ఒంటికి చేవగా చేరిపోతాయి!
ఈ పొలం ఫుడ్... మహా స్ట్రాంగ్ ఫుడ్.
జొన్న ఐటమ్ ఏదైనా జన్నత్‌ని తలపిస్తుంది.
జన్నత్ అంటే స్వర్గం. ఇది మాత్రం జొన్నత్!
జొన్న పోహా
తయారీకి పట్టే సమయం: 20 నిమిషాలు. ఇద్దరికి సరిపోతుంది. కావలసినవి  జొన్న అటుకులు - 1 కప్పు బంగాళదుంప, బఠాణీలు - అర కప్పు (ఉడకపెట్టుకున్నవి) పటిక బెల్లం పొడి - 1 చెంచా నూనె - 2 చెంచాలు  నిమ్మరసం - 1 చెంచా ఉప్పు - తగినంత ఆవాలు - 1 చెంచా జీలకర్ర  1/2 చెంచా శనగపప్పు  2 చెంచాలు  మినప్పప్పు  1 చెంచా పచ్చిమిర్చి తరుగు - 1 చెంచా ఇంగువ - పావు చెంచా ఎండుమిర్చి - 2  అల్లం ముక్కలు (చిన్నవి) - 1 చెంచా  పసుపు - 1 చెంచా కరివేపాకు - 1 రెమ్మ  పల్లీలు - పిడికెడు.

తయారి
జొన్న ఆకులు నీళ్లలో పోసుకుని శుభ్రంగా కడిగి, ఒకటి రెండు నిముషాలు నీళ్లలో ఉంచి, వడకట్టుకుని, వాటికి పప్పు చేర్చి, 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.  ఈ లోపల బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, అల్లం ముక్క, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా పోపు మగ్గనివ్వాలి. దీనికి పల్లీలు కూడా చేర్చి, అన్నీ దోరగా వేగిన తర్వాత ఇంగువ చేర్చి, ఉడక పెట్టుకున్న  బంగాళదుంప, బఠాణీ చేర్చుకుని ఒక నిమిషం మగ్గనిచ్చి, పైన తయారుగా పెట్టుకున్న అటుకులు చేర్చి, తగినంత ఉప్పు చేర్చి, అన్నీ బాగా కలుపుకుని 3-4 నిముషాలు సన్నని సెగమీద ఉంచుకోవాలి. దించబోయే ముందు నిమ్మరసం, పటికబెల్లం పొడి చల్లుకుని కలుపుకుంటే, ఎంతో రుచికరమైన జొన్న పోహ  తయారవుతుంది. ఈ మిశ్రమంపై కొత్తిమీర చల్లుకోవచ్చు.

గమనిక:  జొన్న ఆకు నీళ్లలో ఎక్కువ సేపు నానకూడదు. గట్టిగా పిండకూడదు, విరిగిపోతాయి.

మార్పులు చేర్పులు: పోపులో ఆకుకూర, ఇష్టమైన కూరగాయ కూడా వేసుకోవచ్చు.  నిమ్మరసంతో పాటు పుట్నాల పప్పు పొడి కూడా చల్లుకోవచ్చు. పటిక బెల్లం పొడి వద్దు అనుకుంటే చల్లకపోయినా ఫర్వాలేదు. సజ్జ, రాగి అటుకులతో కూడా ఈ పోహ తయారు చేసుకోవచ్చు.
జొన్న ఉప్మా
తయారీకి పట్టే సమయం: 30 నిమిషాలు. ముగ్గురు లేదా నలుగురికి సరిపోతుంది.
కావలసినవి:  జొన్న రవ్వ  1 కప్పు; కరివేపాకు - 1 రెమ్మ ఉడికించిన కూరగాయ ముక్కలు - 1 కప్పు (క్యారెట్, బీన్స్)  ఉల్లి తరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి - 2  అల్లం తరుగు - 1 చెంచా; నూనె - 2 చెంచాలు  కొత్తిమీర తరుగు - 2 చెంచాలు; ఆవాలు -  1 చెంచా  జీలకర్ర - అర చెంచా; శనగపప్పు  - 2 చెంచాలు మినప్పప్పు - 1 చెంచా; ఇంగువ - చిటికెడు ఎండుమిర్చి - 2

తయారి:  జొన్న రవ్వ దోరగా వేపుకుని పెట్టుకోవాలి. బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువతో పోపు పెట్టుకుని, దీనికి ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు చేర్చి, మూడు కప్పుల నీళ్లు పోసుకుని, తగినంత ఉప్పు చేర్చి, బాగా మరగనివ్వాలి.

నీళ్లు బాగా మరిగేటప్పుడు, రవ్వ చేర్చి బాగా కలియపెట్టుకుని, మూత పెట్ట్టుకుని, సన్నని సెగమీద బాగా ఉడికేవరకు ఉడకపెట్టుకోవాలి. నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుంటే కమ్మదనం పెరుగుతుంది. ఉప్మా ఏదైనా చట్నీతో తినవచ్చు.

గమనిక: మరిగే నీటికి రవ్వ చేర్చేటపుడు గరిటతో ఉండకట్టకుండా కలియ పెట్టుకోవాలి.

మార్పుచేర్పులు: పోపులో ఆకుకూర కూడా వేసుకోవచ్చు.  కావాలకునేవాళ్లు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. దించబోయేముందు ఒక చెంచా నెయ్యి కలుపుకుంటే ఉప్మా రుచి పెరుగుతుంది. అన్ని రకాల చిరుధాన్యాల రవ్వలతో ఈ ఉప్మా తయారు చేసుకోవచ్చు.
జొన్న కార కుడుము
తయారీకి పట్టే సమయం: 40 నిమిషాలు. మొత్తం 10-12 కుడుములు తయారవుతాయి.

కావలసినవి: జొన్న రవ్వ - 1 కప్పు కరివేపాకు - 1 రెమ్మ; ఇంగువ - పావు చెంచా  పెసరపప్పు - పావు కప్పు  నూనె లేదా నెయ్యి - 2 చెంచాలు ఉప్పు - తగినంత; ఆవాలు - 1 చెంచా  జీలకర్ర - అర చెంచా; ఎండుమిర్చి - 2  మినప్పప్పు - 1 చెంచా  పచ్చిమిర్చి తరుగు - 1 చెంచా  అల్లం తరుగు - 1 చెంచా

తయారి:  పెసరపప్పు ఒక గంట నీళ్లలో నానపెట్టుకుని మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గట్టిగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. రుబ్బుకునేటప్పుడు అందులో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి రుబ్బుకోవాలి.  బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువలతో పోపు పెట్టుకుని ఇందులో రుబ్బుకుని పక్కన పెట్టుకున్న పెసరపప్పుని వేసుకుని, 3-4 నిముషాలు దోరగా వేపుకుని, జొన్న రవ్వ కూడా కలుపుకొని 4-5 నిమిషాలు వేపుకొని మూడు గ్లాసుల నీళ్లు పోసుకుని బాగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించి పెట్టుకోవాలి.
    
కొంచెం చల్లారిన తర్వాత, చేతులకు నూనె లేదా నెయ్యి రాసుకుని కుడుములు చేసుకొని ఇడ్లీపాత్రలో 10-12 నిమిషాలు ఆవిరి పట్టుకుంటే కమ్మని జొన్న కార కుడుములు తయారవుతాయి. సాంబారు, కొబ్బరి చట్నీతో తినవచ్చు.

గమనిక: రవ్వ ఉడికేటప్పుడు ఉండకట్టకుండా చూసుకోవాలి.మార్పులు చేర్పులు: పెసరపప్పు బదులు శనగపప్పు కూడా వాడుకోవచ్చు. లేదా రెండూ కలిపి కూడా వేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు లేదా ఆకుకూర, కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు.  అన్ని రకాల చిరుధాన్యాల రవ్వలతో ఈ కార కుడుములు చేసుకోవచ్చు.
జొన్న పేలాల లడ్డు
తయారీకి పట్టే సమయం: 30 నిమిషాలు.  12 లడ్డూలు తయారవుతాయి.

కావలసినవి: జొన్నలు-  1 కప్పు  బెల్లం పొడి - 1 కప్పు పాలు - లడ్డూలు చుట్టుకోవటానికి తగినంత యాలకుల పొడి - అర చెంచా  నెయ్యి  - 2 చెంచాలు  జీడిపప్పు - 2; బాదం - 4; పిస్తా - 4; ఎండు ఖర్జూరం - 3 (అన్నీ కలిపి పొడిచేసుకుని పెట్టుకోవాలి)

తయారి
మందపాటి బాణలిలో కానీ, మట్టిపెంకలో కానీ, శుభ్రం చేసుకున్న జొన్నలు తీసుకుని, నూనె లేకుండా జొన్న పేలాలు తయారయ్యేదాకా వేపుకుని, పేలాలు చల్లారిన తర్వాత, బరకగా పిండిచేసి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో తయారు చేసుకున్న పేలాల పిండి, బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి, తయారు చేసుకున్న డ్రైఫ్రూట్స్ పొడిని కలుపుకుని తగినంత పాలు చేర్చి, లడ్డూలుగా తయారు చేసుకోవచ్చు.

గమనిక: జొన్న పేలాలు తయారయ్యేటప్పుడు మంట తగ్గించి, పేలాలు మాడకుండా వేపు ఉండాలి. పేలాలు మాడకుండా బాణలిలో కొంచెం ఇసుక వేసి, ఇసుక వేడి అయిన తర్వాత జొన్నలు వేసి వేపుకుని, పేలాలు తయారైన తర్వాత, పేలాలు ఇసుక నుండి వేరు చేసుకుని కూడా ఉపయోగించుకోవచ్చు.

మార్పులు చేర్పులు: వేపిన నువ్వులు కూడా లడ్డు పిండిలో కలుపుకోవచ్చు. - బెల్లం బదులు పటిక బెల్లం పొడి కూడా కలుపుకోవచ్చు. - పాలు వద్దు అనుకుంటే, బెల్లం లేతపాకం పట్టుకుని, అందులో పేలాల పిండి, యాలకుల పొడి, నెయ్యి, డ్రైఫ్రూట్స్ పొడి వేసుకుని చపాతీ పిండిలాగా చేసుకుని కూడా లడ్డూలు చేసుకోవచ్చు. - జొన్న  పేలాలు పిండి చేయకుండా పేలాలగానే బెల్లం పాకంలో కలుపుకుని కూడా లడ్డూ చేసుకోవచ్చు. కానీ బెల్లం తీగపాకం పట్టుకోవాలి. సజ్జ పేలాలతో కూడా ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు.
జొన్న అటుకుల మిక్చర్
తయారీకి పట్టే సమయం:  10.15 నిమిషాలు.  ముగ్గురు లేదా నలుగురికి  సరిపోతుంది.
కావలసినవి జొన్న అటుకులు - 1 కప్పు పచ్చిమిర్చి తరుగు - 1 చెంచా  నూనె - 2 చెంచాలు  ఉప్పు - తగినంత.  ఆవాలు - 1 చెంచా జీలకర్ర - అర చెంచా శనగపప్పు  - 2 చెంచాలు ఎండుమిర్చి - 2 పల్లీలు - పావు కప్పు  పసుపు - అర చెంచా  కరివేపాకు  - 1 రెమ్మలు

తయారి: ముందుగా జొన్న అటుకులు నూనె లేకుండా దోరగా వేపుకుని పెట్టుకోవాలి. బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, పల్లీ, పుట్నాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేపుకోవాలి.  పోపుకు పసుపు, ఉప్పు చేర్చుకుని, తయారుగా పెట్టుకున్న జొన్న అటుకులు కలుపుకుని, ఒక పళ్లెంలోకి తీసుకుని 5 నిముషాలు చల్లారనిస్తే, ఎంతో రుచిగా ఉండే జొన్న అటుకులు తయారవుతాయి.

మార్పులు చేర్పులు: జీడిపప్పు, కిస్‌మిస్ కూడా పోపులో చేర్చుకోవచ్చు. {Osెగ్లిజరైడ్స్‌తో బాధపడేవారు, పల్లీ, జీడిపప్పు వేసుకోకపోవటం చాలా మంచిది.  పోపులో 1 చెంచా పటిక బెల్లం పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

 షెఫ్ రాంబాబు
కర్టెసీ  క్రాంతి కుమార్ రెడ్డి
హైదరాబాద్



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list