MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆత్మలతో మాట్లాడవచ్చు atmalatho matladavachu MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU



                         ఆత్మలతో మాట్లాడవచ్చు.

MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALUMohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU




కొన్ని కంటితో చూసి నోటితో చదివినంత మాత్రాన అర్థం కావు. మనసుతో అనుభవించి చూడవలసినదే వాటి లోతు. కొన్ని సాధారణ విషయాలలోనే అసాధారణమైన రహస్యాలు దాగుంటాయి.




నాకు చిన్నప్పటి నుండీ ఓ విచిత్రమైన కోరిక ఉంది. గాలిలో ఎగరాలని. " రావణ బ్రహ్మ రోజూ తెల్లవారుతూనే ఆకాశమార్గాన వెళ్లి కోటి శివలింగాలకు అర్చన చేసి వచ్చే వాడని " ఓసారి ఎవరో నాకు చెప్పారు. అప్పటి నుండీ అనుకుంటా గాలిలో ఎగరాలని బలమైన కోరిక. ఎంత బలమైనది అంటే నిజంగా ఈ దేహంతో ఎగరడం సాధ్యం కాదు కనుక కనీసం కలలో నైనా ఎగరాలని నా సంకల్పమో ఏమో.. సరిగా గుర్తులేదు కానీ నాకు వచ్చే కలలో చాలా వరకూ నేను ఎగురుతున్న ఎరుక నాకు తెలిసేది. ఓ సారి అర్జునుడు పాశుపతాన్ని పొందే సందర్భంలో శివుడితో యుద్ధం చేసే కథను విన్నాను. కొన్నాళ్లకు నాకు ఓ కల వచ్చింది. ఎదురుగా ఎవరో ధనుర్బాణాలతో ఉన్నారు. నేను అవే ఆయుధాలతో ఉన్నాను. ఇద్దరం గాలిలో నేలకు మూడు మీటర్ల ఎత్తులో ఉండి పెద్ధ యుద్ధం చేసుకున్నాం. అద్భుతమైన దివ్యాస్త్రాలు.




నాకోరికలు అలా కలలలో తీరుతున్నాయని అనుకునే వాడిని. ఒక్కటి మాత్రం నాకర్థమైంది. మనం బలంగా ఏవైనా కోరుకుంటే అవి కలలుగా వస్తాయని. అలా నాకొచ్చే విచిత్రమైన కలలు మిగిల్చిన అనుభవాలు ఎప్పుడు తలుచుకున్నా చాలా బలం వచ్చి నట్లు అనిపించేది. కలలు అందరికీ వస్తాయి కానీ చాలా మందికి గుర్తుండవు.




ఆ కలలు గుర్తుంచుకో గలిగితే అందరూ ఆత్మలతో మాట్లాడవచ్చు. ఆ కలలను గుర్తుంచుకోవడం ఎలాగ అని అడుగుతారేమో!? మీ సంకల్పమే మీకు దారి చూపుతుంది. రాత్రి పడుకునే ముందు నాకు వచ్చిన కలలను నేను గుర్తుంచుకోవాలి అని స్థిరంగా 4,5 సార్లు సంకల్పించుకుని పడుకోండి. క్రమ క్రమంగా మీ కలలు మెలకువ తరువాత కూడా గుర్తుకు వస్తుండడం మీరే గమనిస్తారు. అలా మీ సంకల్ప బలం, కోరిక, నమ్మకం వీటిని బట్టి మీకు గుర్తుండే శాతం ఉంటుంది.




ఇంతకీ కలలను గుర్తుంచుంకుంటే ఆత్మలతో ఎలా మాట్లాడవచ్చూ..!? అని అనుకుంటున్నారా? అదిగో అక్కడికే వస్తున్నాను.




మీకెప్పుడైనా అద్భుతమైన,వింత ఐన కలలు వస్తాయా? మీకలలలో మీరు అద్భుత శక్తులు ప్రదర్శిస్తున్నట్టు, మీతో దేవతలు- చనిపోయిన వారు - యోగులు మాట్లాడినట్లు, మీరు గాలిలో ఎగిరినట్లు, కొత్త కొత్త ప్రదేశాలు చూసినట్టు, లేదా లోకాలన్నీ తిరిగినట్టు కనిపించిందా.!?




అయితే మీకు కలల ద్వారా ఏవో సందేశాలు వస్తున్నట్టు తెలుసుకోండి. అవును కలల ద్వారానే. కలల ద్వారా మీకు సాధ్యమవ్వని దంటూ ఏమీ లేదు. మీరు కలవలానుకున్న వారిని కలవ వచ్చు. ఎంత దూరంలో ఉన్నా, అసలు భూమిమీదే లేకున్నా,ఏడేడు పధ్నాలుగు లోకాలలో ఎక్కడ ఉన్నా. మీరు కలిసి వారితో పంచుకున్న అనుభవాలను నిద్రనుండి మేల్కొన్న తరువాత కూడా గుర్తుకు ఉంచుకోవచ్చు. కాక పోతే కొంత సాధన ద్వారా.




ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రముఖ రచయిత "శ్రీ శార్వరి" చెప్తున్న మాటలు ఇవి. ఈయన మాష్టర్ సి.వి.వి. ధ్యాన ప్రక్రియకు ఆకర్షితులై, తద్వారా ధ్యానం,యోగం,ఆత్మ యాత్రలు ( astral travel ) మొదలైన అనేక విషయాలగురించి అనేక భాషలలో పలువురు రాసిన రచనలను చదువుతూ,సాధన చేయడం మొదలు పెట్టారు. అలాగే వీటి గురించి తెలుగులో అనేక పుస్తకాలు రాశారు. వాటిలో నేను ఈ మధ్య అనుకోకుండా " పరావిద్య " అనే పుస్తకం కొనిచదివాను. నేను ఇంతకు పూర్వం వీరి రచనలు ఎప్పుడూ చదవలేదు. నాకు వారి గురించి పెద్దగా తెలియదు. కానీ పుస్తకం కొద్దిగా చదివితే ఏదో ఆసక్తిగా అనిపించి కొన్నాను. ఇంటికి వచ్చి తెరచి చదివితే నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. నా ఆసక్తికి సరిగ్గా తగిన పుస్తకం అనిపించింది. నాకు తెలిసిన కొన్ని విషయాలకు కొన్ని కొత్త పార్శ్వాలు కనిపించాయి. నా ఆధ్యాత్మిక సాధనకు కొన్ని కొత్త దారులు కూడా గోచరించాయి. పుస్తకం తెరచిన దగ్గరనుండీ పూర్తయ్యే వరకు ఆపకుండా దాదాపు ఏకబిగిన చదివాను.







మనకు కనిపించే శరీరం కాకుండా ఇంకా అనేక శరీరాలున్నాయి. ఈధర్ శరీరం, ఆస్ట్రల్ శరీరం, భావశరీరం,ప్రాణ శరీరం, ఆత్మ శరీరం ఇలా కంటికి కనిపించని అనేక శరీరాలు మనకున్నాయి. వాటిని కంటితో చూడడం కుదరదు. మనసుతోదర్శించాలి.




" కనిపించడం అన్నది కంటికి పరిమితం. కనిపించని దానిని దర్శించడం మనస్సు పరిధి లోనిది. అలా దర్శింప చేసే సామర్ధ్యం ఉన్నది ఆత్మకు మాత్రమే."




" ఇవ్వాళ మనం టన్నుల కొద్దీ విఙ్ఞానం,నాగరికత ఉందని సంబరపడి పోతున్నాంగానీ, ఇంతకు వేయిరెట్లు 'వివిఙ్ఞానం' ఆ (పూర్వం)రోజుల్లోనే ఉండేది. అది సంస్కారం. అప్పుడు మనవాళ్లు హాయిగా పరలోకాలకు విహార యాత్రలకు వెళుతూ వస్తూ ఉండేవారు. దేవతలతో, యక్షులతో, కిన్నెరలతో, కింపురుషులతో, గంధర్వులతో చెలిమి చేసేవారు. "




" ఈజిప్టు, రోమ్ దేశాల నాగరికతల్ని అధ్యయనం చేస్తే అక్కడి చారిత్రక అవశేషాల్ని గమనిస్తే చాలా రహస్యాలు తెలుస్తాయి. ఈజిప్టులోని పిరమిడ్లు,ప్పింక్ రహస్యాలు ఇప్పటికీ తెలియడం లేదు. వారి ఖగోళ విఙ్ఞానం, ఆత్మల అవగాహన నేటికీ ఊహాతీతంగానే ఉంది. భూమి కొలతలు, భూమికి ఇతర గ్రహాలకు మధ్యదూరాలు ఎలా కొలవగలిగారు. ఎవరూ భౌతిక శరీరాలతో వెళ్లి టేపులు పెట్టి కొలిచి ఉండరు కదా! వారికి లింకులు తెలుసు. మానవ మేధస్సును విశ్వ మేధస్సుతో లింక్ చేయడం వారికి తెలుసు. భౌతిక శరీరాన్ని ఇక్కడ భద్రపరచి, అశరీరులుగా విశ్వసంచారం చేయడం వారికి తెలుసు."




" ఏదేశ చరిత్ర పుటలు వెనక్కి తిప్పినా, ఏజాతి చరిత్రలోకి తొంగిచూసినా ఆకాలం వారికి 'అశరీర పరిఙ్ఞానం' పూర్తిగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మన పౌరాణిక కధలు, ఇతిహాసాలు, లోతుగా పరిశీలించండి. ఎన్ని అద్భుతాలు బయటపడతాయో గమనించవచ్చు. రాజులు,ఋషులు యధేచ్ఛగా అలా అలా స్వర్గానికి హనీమూన్ ట్రిప్స్ వేస్తుండే వారు. అక్కడిదేవకన్యలతో, అప్సరసలతో సరదాగా షికార్లు చేసి, సరదాలు తీర్చుకునేవారు. అలా విమానాల్లో ఆకాశమార్గాన హిమాలయాల పైకి వెళ్లేవారు. నదులు,సముద్రాలు అలవోకగా దాటి వెళ్లే వారు. ఇంద్రసభకు వెళ్లడం,నందనాల్లో విహరించడం, త్రిమూర్తుల్ని కలవడం, ముక్కోటి దేవతలతో ముచ్చట్లాడడం,ముచ్చటతీర్చుకోవడం బొత్తిగా కష్టం కాదని తెలుస్తుంది. " అంటారు మాష్టర్ శ్రీశార్వరి.




అయితే ఈపుస్తకం చదవక మునుపు కూడా నాకు ఇవన్నీ ఉన్నాయని, ఇంకా నేటికీ అనేకులు ఈ సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేస్తున్నారనీ తెలుసు. కానీ అది సామాన్యులకు అందుబాటులో లేదనే అభిప్రాయం ఉండేది. ఎంతో యోగ సాధన చేస్తే గానీ ఈ సూక్ష్మశరీర ప్రయాణం అనేది అనుభవంలోకి రాదని అనిపించేది. రోజూ ఉద్యోగాలు చేసుకునే వారికీ, సంసార బంధంలో ఉన్న వారికీ కొంత కష్ట తరమైన సాధన అనుకునేవాడిని. కానీ ఇది చదివిన తరువాత నా అభిప్రాయం పూర్తిగా తప్పని తేలింది. మనసుంటే మార్గముంటుందని మరోసారి ఋజువైంది. మాష్టర్ శ్రీశార్వరి గారు ఎంతో కష్ట తరమైన అనుభవాన్ని చాలా తేలికగా తన రచన ద్వారా మనకు అందించారు. ఈ పుస్తకం చదివిన ఎవరికైనా ఇది ఇంత సులువైన సాధనా అనిపిస్తుంది.




వారు చెప్పిన సాధన ఏమిటంటే రోజూ ప్రశాంతంగా నిద్ర పోవడమె.. చక్కటి కలలు కనడమే.. ఆ కలలను గుర్తుంచుకుని జాగ్రత్తగా ఓ పుస్తకంలో రాసుకుని భద్రపరచుకోవడమే... ఇంతే మీరు చేయవలసింది. దీని వలన మీరు పొందేది ఏమిటో తెలుసా..!? మీరు ఎవరిని కావాలనుకుంటే వారిని కలవగలరు. భవిష్యత్తులో జరిగే వాటిని తెలుసుకో గలరు. ఎంత దూరమైనా సూక్ష్మశరీరంతో సునాయాసంగా ప్రయాణించగలరు.




రోజూ రాత్రిపూట కలలు వస్తాయి కదా. కలలకు తలా తోకా లేదు అనుకుంటాం మనం. అప్పటిదాకా చెట్టుక్రింద ఉన్న మనం ఉన్నట్టుండి ఏ ఇంట్లోనో టీవీ చూస్తున్నట్టు, ఓ కోతిగానో, దేముడిగానో, రాక్షసుడిగానో మారినట్టు అర్థం పర్థం లేని కలలు వస్తున్నాయి అని అందరూ అనుకోవడం సహజం. కానీ వీటికి అర్థం ఉంది అని మరోసారి నిరూపిస్తుంది "పరావిద్య" పుస్తకం.




" మనకు మంచి కలలు వస్తే అవి ఇంకాఇంకా సాగాలని కోరుకుంటాం. అయ్యో అనవసరంగా మెలకువ వచ్చిందే ఇంకొంత సేపు మెలకువ రాకుండా ఉంటే బాగుండేది అనుకుంటాం. అలాగే చెడు కలవస్తే భయంతో ఒణికి పోతాం. కానీ రెండూ మనకు సంకేతాలే. అవి చెరుపు చెయ్యవు. ఓ దెయ్యమో,ఆత్మో మిమ్మల్ని వెంటాడినట్టో, ఓ గొప్ప సౌందర్యవతి కనిపించి కవ్వింనట్టో వస్తే అవి రెండూ మీ మనసులోని కోపతాపాలను, వ్యామోహాన్నీ తెలుపుతున్నట్టు గుర్తు. ఏ స్త్రీ వ్యామోహమూ మీకు లేదనుకోండీ.. ఏ అప్సరసా మీ కలల్లోకి రాదు, అలాగే మీ మనసులో కోపతాపాలు, ఏ మలినమూ లేకపోతే రాక్షసులు రారు. మనలో దాగిన వికృత భావాలకూ, అణచుకున్న ఉద్రేకాలకూ ఆ కలలు రూపాంతరాలు. మన గుణాలకు రూప కల్పనలే స్వప్నంలో కనిపిస్తాయి. ఏ కలా ఊరికే రాదు. వాటికో అర్థం ఉంటుంది. ఓ కారణం ఉంటుంది. ఓ సంకేతం ఉంటుంది. అందించ వలసిన సందేశం ఉంటుంది. ఎటువంటి కలలైనా సరే అవి మనకు చెడుపు చేయవు. ఇలలో మనకు సహాయపడేవే అయి ఉంటాయి. మన వ్యక్తిగత విషయాలకు సంబంధించినవి కావచ్చు, ప్రపంచ విషయాలు కావచ్చు, రాజకీయ ప్రయోజనాలకు సంబంధించినవి కావచ్చు, కేవలం ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు. స్వప్నాలను విశ్లేషించడం ఒక కళ. కలలే గొప్ప పరిశోధనలకు ఆలంబనాలు. మహాజటిలమైన సమస్యలకు పరిష్కారాలు కలల్లోనే లభించాయి. మహర్షులు కలల ద్వారానే గొప్ప సత్యాలను ఆవిష్కరించారు. ఈ స్వప్న సందేశాలను ఆధారం చేసుకుని కోట్లకు పడగలెత్తిన వారున్నారు. ఒక్కో కల మీజీవితాన్నే మార్చేయ గలదు. ప్రఙ్ఞతో అశరీర సంచారం చేయగల యోగి విశ్వరహస్యాలు సత్యాలు ఆవిష్కరిస్తాడు. "




ఎంత చెప్పినా ఇది తరిగేది కాదు కానీ, నేను అసలు ఏమి చేయాలో చెప్తాను. అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది. రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు ఓ ఐదునిమిషాలు మనసును ప్రశాంత పరచాలి. ముందుగా గురువులను ప్రార్థించాలి. మన చుట్టూ మనకంటికి కనిపించని గురువుల ఆత్మలు ఎన్నో ఉంటాయి. మన సూక్ష్మ శరీర ప్రయాణంలో వారి సహాయాన్ని అర్థించాలి. మనసులో మీరు చూడాలనుకున్న ప్రదేశమో, కలవాలనుకున్న వ్యక్తినో సంకల్పించుకోవాలి. ( ఫలానా ప్రదేశానికి నేను వెళ్లాలి. అక్కడ నాకు ఎదురైన అనుభూతులను పదిలంగా భద్రపరచుకోవాలి. మెలకువ తరువాతకూడా అవి నాకు గుర్తుండాలి. ఇలా మనసులో గట్టి విశ్వాసంతో సంకల్పించు కోవాలి. ) మీకు ఈ ప్రక్రియమీద ఉన్న నమ్మకాన్ని బట్టి మీకు కలిగే అనుభూతుల లోతు ఉంటుంది. మొదట్లో కొన్ని రోజులు కలల గుర్తుండక పోయినా త్వరలోనే అవి స్ఫురణకు రావడం, వాటి తాలూకా అనుభవాలు నిజ జీవితంలో ఎదురవడం మీరు చూచాయగా గమనించడం మొదలు పెడతారు.




అలా సంకల్పించుకుని మూసుకున్న కను గుడ్లను గుండ్రంగా త్రిప్పుతూ ఉండాలి. అందువలన త్వరగా నిద్ర వస్తుంది. మీ మనస్సును సూక్ష్మ శరీర ప్రయాణానికి సన్నద్ధం చేసుకోవాలి. మీరు క్రమంగా నిద్రలోకి జారుకుంటారు. మీరు నిద్ర పోయారు అంటే మీ సూక్ష్మ శరీరం మీ భౌతిక శరీరం నుండి విడి వడింది అని అర్థం. అలా భౌతిక శరీరం నుండి విడి వడినా భౌతిక శరీరానికీ - సూక్ష్మ శరీరానికీ ఒక దారం వంటి లింక్ ఉంటుంది. చనిపోయినప్పుడు ఆబంధం తెగిపోతుంది. నిద్రించి నప్పుడు ఎంత దూరం వెళ్లినా అది ఉంటుంది. కొందరు గొప్పగొప్ప వారికి ఆ దారం వంటి బంధం కలలలో దర్శించిన అనుభవాలు ఎదురయ్యాయి. అలా ప్రయాణానికి సిద్ధమైన సూక్ష్మ శరీరానికి ఒక స్నేహ హస్తం అందుతుంది. వారి మార్గదర్శకంలో మీరు కోరుకున్న చోటికి వెళ్తారు. వారే మీ ఆధ్యాత్మిక గురువులు.




కొన్ని సూచనలు : నేలమీద చాప వేసుకుని నిద్రించడం మంచిది. వెల్లకిలా శవాసనంలో పడుకోవాలి. నిద్రించే గదిలో ఎక్కువ వెలుతురు ఉండకూడదు. కొద్దిగా తగుమాత్రంగా వెలుతురు ఉండవచ్చు. గుండెల మీద చేతులు వేయకూడదు. అలా వేస్తే మన సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని వదిలి బయటకు వెళ్లడం కష్టం అవుతుంది. చేతులను కూడా వెల్లకిలా చాపి ఉంచాలి. శరీరం నుండి ఆత్మ విడివడడమేమిటి? మన ఆత్మ ప్రయాణం చేయడమేమిటి? అని కొందరికి వింత గొలపవచ్చు. మరికొందరికి కాస్త భయం కూడా వేయ వచ్చు. కానీ కంగారు పడనవసరం లేదు. ఈ విషయం మీకు తెలిసి నిద్రించినా, తెలియక నిద్రించినా ఆత్మ సూక్ష్మ శరీరంతో బయటకు రావడం అనేది ఖాయం. అలా ప్రయాణించినపుడు కలిగే అనుభవాలే కలలుగా మనకు కొంత గుర్తులో ఉంటాయి. వాటిని మరింత గుర్తుంచుకోవడానికీ, అలాగే మనకు అర్థం పర్థం లేకుండా వచ్చే కలలను ఒక క్రమ బద్ధంగా మన కోరిక ప్రకారం వచ్చేటట్లు మలచుకోవడానికీ మనమీ సాధన చేస్తున్నాము. అలాగే మనకు గురువులైన ఆత్మలు ఆ సూక్ష్మ లోకాలలో ఎదురు చూస్తూ ఉంటాయి. వారే స్వయంగా మనల్ని శిష్యులుగా ఎంచుకుంటారు. మన పుట్టుక తోనే ఆ ఎన్నిక అయిపోతుంది. కానీ ఆ విషయాలు మనకు తెలియవు. వారు అడుగడుగునా ఈ ప్రయాణంలో మనకు తోడ్పడుతూ ఉంటారు. కొన్ని సార్లు మీరు నిద్రలో మీకాలో చెయ్యో అసంకల్పితంగా అంతెత్తున లేపి దబ్బున క్రిందపడేస్తారు. ఉలిక్కి పడి, శరీరం ఎగిరి పడుతుంది. ఈ సాధన చేసే వారికైనా, చేయని వారికైనా ఇది సహజంగా అప్పుడప్పుడూ జరిగే విషయమే. అంటే మీ సూక్ష్మ శరీరం బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఏదో ఇబ్బంది రావడం వలన అలా జరుగుతోంది. మీరు సరిగ్గా వెల్లకిలా పడుకుంటే సరిపోతుంది. అలాగే ఒక్కో సారి మీరు నిద్రలో ఉండగానే మీ చెయ్యో కాలో కదపాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఎంత కదిపినా అవి కదలవు. అలా ఎందుకవుతుందంటే బయట తిరిగే ఆత్మలేవో మిమ్మల్ని అల్లరి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. కొన్ని ఆత్మలకు అలా చేయడం సరదా. అందుకు మీరు భయపడనవసరం లేదు. అవి అంతకన్నా ఏమీ చేయలేవు. మీకు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ (సూక్ష్మ శరీర ప్రయాణం) లో ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా మీ సూక్ష్మ శరీరం వెంటనే వచ్చి భౌతిక శరీరంలో చేరిపోతుంది. మీకు వెంటనే మెలకువ వస్తుంది. కనుక భయం అవసరంలేదు. ఎటువంటి భయాలు లేకుండా ఈ ప్రయాణానికి సిద్ధమైనప్పుడు మాత్రమే మీ సాధన సక్రమంగా సాగుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీకు గురువులు ఎప్పుడూ అండగా ఉంటారు. అలాగే ఈ ప్రయాణంలో 99.99...% ఏటువంటి ఇబ్బందులూ ఎదురవ్వవు. ఇది సహజమైన ప్రక్రియే. కాకపోతే కాస్త ఎరుకతో చేయలనుకునే ప్రయత్నం. మీకు గల నమ్మకం, ఉత్సాహం ఈ ప్రయాణంలో అద్భుతాలను ఆవిష్కరిస్తాయి. మీరు మీ వంశీకులను, దేవతలను, మీ ఇష్టులను కలవవచ్చు - స్వర్గం, హిమాలయాలు, పవిత్ర ప్రదేశాలు, ఏడేడు పధ్నాలుగు లోకాలు, బ్రహ్మాండాలు వేటినైనా దర్శించ వచ్చు. ముఖ్యంగా ఎటువంటి వారికైనా చావు అంటే భయం పోతుంది. రోజూ వెళ్లి వచ్చే ప్రయాణమే, కాకపోతే కాస్త దీర్ఘ ప్రయాణం అన్న ధీమాతో ఉంటారు. మన కంటికి కనిపించేది కాక వేరే లోకాలు ఉన్నాయని, అవి ఈ లోకాల కంటే అందమైనవి, సుఖవంతమైనవి, అమిత ఆనందాన్నిచ్చేవి అని తెలియడం వల్ల - నసించేది నేను కాదు, నా శరీరం, ఇది లేక పోయినా నేను మరింత ఆనందంగా ఉండగలను అని అర్థమవ్వడం వల్ల సులభంగా మరణాన్ని సమ్మతించ గలుగుతారు.




నాకు చిన్నప్పటి నుండీ ఓ సందేహం ఉండేది. "యోగము ద్వారా చనిపోవాలి అనుకున్నప్పుడు చనిపోవడం అనేది అందరికీ సాధ్యమేనా? " అని. దానికి చిన్నప్పటి నుండీ యోగ సాధన బాగా చేస్తే అది సాధ్యమే అని తెలుసు. కానీ దానికి ఇంత సులువైన ప్రారంభముంటుందని మాత్రం ఈ పుస్తకం చదివిన తరువాత తెలిసింది. విద్వత్తు ఎవరి వద్దనైనా ఉంటుంది. దానిని నలుగురి మంచి కోసం వినియోగించగల ప్రఙ్ఞ కొందరికి మాత్రమే ఉంటుంది. అటువంటి ప్రఙ్ఞతో రాసిన పుస్తకం ఇది. ఆధ్యాత్మిక అభిలాషులు అందరూ చదవవలసినది. శ్రీ శార్వరి గారు నేటికీ మాష్టర్ గా అనేకులకి ఈ యోగ విద్యను నేర్పుతున్నారు. పూజాదికాలు అవసరం లేదని వీరి అభిమతం. మాష్టర్ సి.వి.వి. గారికి మరో అనుయాయులు ఎక్కిరాల క్రిష్ణమాచార్య గారు. వీరు సాంప్రదాయాలను, పూజాదికాలను ప్రోత్సహిస్తూనే తద్వారా యోగ జీవితానికి బాటను చూపారు. ఎవరి మార్గం వారిది అయినా చేరే గమ్యం ఒక్కటే.




నిద్రపోవడం ఎవరికి మాత్రం కష్టం చెప్పండి. అందుకే ఇది సులవైన ప్రారంభం అని చెప్పుకోవచ్చు. పైగా కలిగే ఫలితం అమేఘం, అద్భుతం. సూక్ష్మ శరీర ప్రయాణం ద్వారా అణిమాది అష్టసిద్ధులు, పరకాయ ప్రవేశం, కంటికి కనిపించని దివ్యలోక సందర్శనం మొదలైన వాటిగురించి తెలుస్తుంది. మనం సాధించవలసినది ఏమిటో ఎఱుకలోకి వస్తుంది. వీటితోనే ఆనందపడిపోయి ఇదే సర్వమనుకుని అక్కడే నిలచే వారూ ఉన్నారు. కలిగిన ఎఱుక ద్వారా మరింత ముందుకు వెళ్లవలసి ఉన్నదని గుర్తెరిగి మరింత సాధన చేసే వారున్నారు. ఇదే పరమావధి కాదు అని స్ఫురణలో ఉంచుకోవాలి మనం. సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలి ఆత్మ స్వయంగా ప్రకాశించ గలగడం మన లక్ష్యం. అది అందరికీ సాధ్యపడదు. సత్యలోక దర్శనం కోసం ఎంతో యోగ సాధన చేయాలి. మనం నిద్రపోయి ఏమీ తెలియని స్థితిలో దర్శించే ఈ లోకాలన్నీ ధ్యానముద్వారా ఎప్పుడనుకుంటే అప్పుడు అంతర్ముఖులమై శరీరాన్ని విడచి ప్రయాణించ గల శక్తిని సముపార్జించడానికి ఈ అనుభవం ఎంతో ప్రేరణనిస్తుంది. రాజశేఖరుని విజయ్ శర్మ 

సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు| సర్వేజనాసుఖినో భవంతు| సత్యాస్సంతు యజమానస్యకామాః||

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list