MohanPublications Print Books Online store clik Here Devullu.com

హరిహర ప్రియం కార్తీకం_Karthika Masam Special




హరిహర ప్రియం కార్తీకం
Karthika Masam Special

హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది. హిందూ పంచాంగం ప్రకారం ఎనిమిదో నెల అయిన కార్తీకం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం. ఈ నెల పొడవునా శివాలయాలు, వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఇక పవిత్ర క్షేత్రాల్లోనైతే భక్తుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మన తెలుగువాళ్లతో పాటు దేశంలో చాంద్రమానం పాటించే వాళ్లందరికీ దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచి కార్తీకం మొదలవుతుంది. సౌరమానం పాటించే తమిళులకు సూర్యుడు వృశ్చికరాశిలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రారంభమవుతుంది.

బెంగాలీలకు, ఒరియా వాళ్లకు ఆశ్వీయుజ పున్నమి మర్నాటి నుంచే కార్తీకం మొదలవుతుంది. కార్తీక మాసంలో చాలా పర్వదినాలు ఉన్నాయి. కార్తీకమాసం తొలిరోజున బలిపాడ్యమి, గోవర్ధన పూజ, రెండో రోజున భాయీదూజ్‌ (భగినీహస్త భోజనం), శుద్ధ చవితి రోజున నాగుల చవితి, శుక్లపక్షంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి, ఆ మర్నాడు వచ్చే క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పున్నమి ఈ నెలలో వచ్చే ప్రధాన పర్వదినాలు. కార్తీక పున్నమి హిందువులకు మాత్రమే కాదు, సిక్కులకు, జైనులకు కూడా ఇది అత్యంత పవిత్రమైన రోజు.

దేవతల దీపావళి
దీపావళి అమావాస్యకు పదిహేను రోజుల తర్వాత వచ్చే కార్తీక పున్నమిని ‘దేవ దీపావళి’గా అభివర్ణిస్తారు. నరక చతుర్దశి మర్నాడు వచ్చేది మానవుల దీపావళి అయితే, కార్తీక పున్నమి దేవతల దీపావళి అన్నమాట. కార్తీక పున్నమి వేడుకలు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నుంచే మొదలవుతాయి. కార్తీక శుద్ధ ఏకాదశిని ‘ప్రబోధ ఏకాదశి’ అని, ‘ప్రబోధిని ఏకాదశి’ అని అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాటితో చాతుర్మాస్య వ్రతం పూర్తవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి జారుకున్న శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. కార్తీక పున్నమి నాటి దేవ దీపావళి వేడుకలకు ఏకాదశి రోజు నుంచే సన్నాహాలు మొదలవుతాయి. రాజస్తాన్‌లోని బ్రహ్మదేవుడి ఆలయం ఉన్న పుష్కర క్షేత్రంలో బ్రహ్మదేవుడి ప్రీత్యర్థం జరిగే పుష్కర మేళా ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పున్నమి వరకు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఐదురోజులూ భక్తులు పుష్కర తీర్థంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తారు.

పుష్కర మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే సాధువులు ఇక్కడకు సమీపంలోని గుహలలో తలదాచుకుంటారు. దాదాపు రెండులక్షలకు పైగా భక్త జనవాహినితో పాటు పాతికవేలకు పైగా ఒంటెలతో పుష్కరమేళాలో జరిగే ఊరేగింపు చూసి తీరాల్సిందే. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఒంటెల ఊరేగింపుగా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే, శైవక్షేత్రాలలో తలమానికమైన వారణాసిలో దేవదీపావళి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. గంగానది ఒడ్డున అన్ని ఘాట్లూ లెక్కలేనన్ని దీపాలతో మిరుమిట్లుగొలుపుతూ కనువిందు చేస్తాయి. కాశీక్షేత్రంలో గంగా మహోత్సవం ఏకాదశి నుంచి పున్నమి వరకు వైభవోపేతంగా జరుగుతుంది. పరమశివుడు కార్తీక పున్నమి రోజున త్రిపురాసురుడిని సంహరించాడు.

ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెడుతూ పీడించిన త్రిపురాసురుడి పీడ విరగడ కావడంతో దేవతలు ఆ రోజున దీపావళి పండుగ చేసుకున్నారని ప్రతీతి. అందుకే ఈ పున్నమిని ‘త్రిపురారి పౌర్ణమి’ అని కూడా అంటారు. కార్తీక పున్నమి నాడు చిన్నా పెద్దా దేవాలయాలన్నీ అసంఖ్యాకమైన దీపాల వెలుగులతో ధగధగలాడుతూ కనువిందు చేస్తాయి. నిత్యదీపారాధన చేయని వారు కార్తీక పున్నమి నాడు 365 వత్తులను ఒక్కటిగా చేసి, ఆవునేతితో తడిపి మట్టి ప్రమిద లేదా కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలం దక్కుతుందని ప్రతీతి. కార్తీక పున్నమి ఉదయం విష్ణుపూజకు, రాత్రి శివపూజకు అనుకూలమైనవి. శివకేశవుల అనుగ్రహం కోరేవారు ఆ రోజు ఉదయం వైష్ణవాలయాల్లో అర్చనలు జరిపిస్తారు.

రాత్రివేళ శివాలయాల్లో అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అరటిదొప్పల్లో దీపాలను వెలిగించి, వాటిని నీటిలో వదులుతారు. దీపదానాలు చేస్తారు. ఉసిరికాయల మీద దీపాలు వెలిగించే ఆచారాన్ని కూడా కొన్ని చోట్ల పాటిస్తారు. చాలామంది కార్తీక పున్నమిరోజున క్షేత్రదర్శనం చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. క్షేత్రదర్శనానికి వీలు లేకున్నా, మంత్రోపదేశం పొందిన వారు కార్తీక పున్నమి వేళ నిష్ఠగా మంత్రజపం సాగించినట్లయితే విశేష ఫలం దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఏకకాలంలో శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి కార్తీక పున్నమిని మించిన రోజు మరేదీ లేదు. చాలా ప్రాంతాల్లో కార్తీక పున్నమి రోజున తులసి చెట్టును శ్రీమహాలక్ష్మిగా, ఉసిరికొమ్మను శ్రీమహావిష్ణువుగా భావించి, భక్తిశ్రద్ధలతో వాటికి కల్యాణం జరిపించే సంప్రదాయం కూడా ఉంది.

జ్వాలాతోరణంతో పాప విమోచనం
కార్తీక పున్నమినాడు కొన్ని చోట్ల శివాలయాల్లో జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తారు. దీపకాంతులతో ధగధగలాడే జ్వాలాతోరణం కింది నుంచి భక్తులు ఉత్సాహంగా పరుగు పెడతారు. ఇలా చేయడం వల్ల సకల పాపాలూ నశిస్తాయని విశ్వసిస్తారు. శివాలయాల్లో జ్వాలా తోరణం నిర్వహించడానికి పౌరాణిక నేపథ్యం ఉంది. క్షీరసాగర మథనంలో మొదటగా హాలాహలం వెలువడుతుంది. లోకాలన్నింటినీ కబళించేలా హాలాహలం దూసుకుపోతుండటంతో పరమశివుడు దానిని ఉండగా చేసుకుని మింగబోతాడు. పూర్తిగా మింగేస్తే తన ఉదరంలో పదిలంగా ఉన్న లోకాలన్నీ నశించే ప్రమాదం ఉన్నందున శివుడు దానిని తన కంఠంలోనే బంధించి ఉంచుతాడు. పరమశివుడు హాలాహలాన్ని మింగడంతో పార్వతీదేవి ఆందోళన చెందుతుంది.

హాలాహల జ్వాలలు తన భర్తకు హాని కలిగించరాదంటూ అగ్నిదేవుడిని ప్రార్థించింది. ఆమె ప్రార్థనతో అగ్నిదేవుడు చల్లబడ్డాడు. అందుకు ప్రతీకగా పార్వతీదేవి అగ్నిస్వభావం గల కృత్తికా నక్షత్రానికి సంకేతమైన కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసి, తన భర్తతో కలసి దాటింది. ఆ మంటల వేడి నుంచి ఉపశమనం కలిగించడానికే శివుడికి నీటితోను, పంచామృతాలతోను అభిషేకం చేస్తారు. జ్వాలా తోరణానికి సంబంధించి మరో ఐతిహ్యం కూడా ఉంది. శివుడి రేతస్సును అగ్నిదేవుడు భరించలేక గంగానదిలో పడవేస్తాడు. గంగ కూడా దానిని భరించలేక ఒడ్డునే ఉన్న రెల్లుగడ్డిలో వదిలింది. ఆ తేజస్సు నుంచే జన్మించిన కుమారస్వామి శరవణభవుడిగా ప్రసిద్ధి పొందాడు.

శివుడి కుమారుడి చేతిలో తప్ప ఇతరుల చేత మరణం సంభవించకుండా వరం పొందిన తారకాసురుడు రెల్లుగడ్డిని తగలబెట్టించాడు. కారణజన్ముడైన కుమారస్వామికి అగ్నిదేవుడు ఎలాంటి హాని చేయకుండా సురక్షితంగా కాపాడాడు. దానికి గుర్తుగా కుమారస్వామి జన్మనక్షత్రమైన కృత్తికా నక్షత్రం రోజున వచ్చే కార్తీక పున్నమి నాడు జ్వాలాతోరణం నిర్వహిస్తారు. జ్వాలాతోరణం కింద నుంచి మూడుసార్లు వెళితే సమస్తపాపాలు, అపమృత్యు గండాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. గౌరీశంకరుల పల్లకిని జ్వాలాతోరణం కింది నుంచి మూడుసార్లు తీసుకువెళతారు. ఆ తర్వాత తోరణానికి మిగిలిన ఎండుగడ్డిని, సగం కాలిన గడ్డిని రైతులు గడ్డివాముల్లో కలుపుతారు. ఆ వాముల్లోని గడ్డిని మేస్తే పశువుల సంతతి అభివృద్ధి చెందుతుందని, రైతులకు ధాన్యానికి లోటు ఉండదని నమ్ముతారు.

ఉపవాస దీక్షలు
పవిత్ర కార్తీకమాసంలో చాలామంది భక్తులు ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లోను, ఏకాదశి, పున్నమి రోజుల్లో ఉపవాసాలు ఉండి దేవాలయ సందర్శనలు, అర్చనలతో శివకేశవులను ఆరాధిస్తారు. ముఖ్యంగా చంద్రుడికి చెందిన సోమవారం శివునికి ప్రీతిపాత్రమైన వారం. కొందరు పూర్తిగా నిరాహారంగా ఉపవాసం ఆచరిస్తారు. ఇంకొందరు రోజులో ఒక్కసారే ఫలహారం స్వీకరించి ఏకభుక్తం చేస్తారు. మరికొందరు వండని పదార్థాలు... అంటే, పండ్లు, కాయలు తింటూ నక్తం చేస్తుంటారు. కొందరు కార్తీకంలో నెలపొడవునా నక్తవ్రతాన్ని ఆచరిస్తారు. మిగిలిన రోజుల్లో చేసే ఉపవాసం ఒక ఎత్తయితే, కార్తీక పున్నమి రోజున చేసే ఉపవాసం మరో ఎత్తు.

కార్తీక పున్నమినాటి ఉపవాసం విశిష్ట ఫలదాయకమని పురాణాలు చెబుతున్నాయి. దారిద్య్రబాధల విముక్తి కోసం కార్తీకంలో శ్రీమహాలక్ష్మిని పూజించడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయని ప్రతీతి. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శ్రావణమాసం అంటే శివునికి ఎంత ఇష్టమో, శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసం అంటే లక్ష్మీదేవికి కూడా అంతే ఇష్టం. అందువల్ల శ్రావణంలో శివుడికి, కార్తీకంలో లక్ష్మీదేవికి కూడా అర్చనలు జరుపుతారు. కార్తీక పున్నమి రోజున ఆవుపాలతో వండిన పాయసాన్ని శివకేశవులకు, లక్ష్మీదేవికి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారికి, మారేడు ఫలాన్ని సేవించేవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి.

నానక్‌ జయంతి
సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్‌ జన్మించినది కార్తీక పున్నమి రోజునే కావడంతో ఈ రోజును సిక్కులు అత్యంత పవిత్ర దినంగా భావిస్తారు. నానక్‌ మార్గాన్ని అనుసరించే ‘నానక్‌పంథీ’ హిందువులు కూడా నానక్‌ జయంతి రోజున గురుద్వారాలను దర్శించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నానక్‌ జయంతిని సిక్కులు ‘గురుపరబ్‌’ అని, ‘ప్రకాశ్‌పర్వ’ అని కూడా అంటారు.

జైనులకూ పవిత్రదినం
కార్తీక పున్నమి జైనులకు కూడా అత్యంత పవిత్రమైన రోజు. హిందువుల మాదిరిగానే జైనులు కూడా వర్ష రుతువులో చాతుర్మాసం పాటిస్తారు. చాతుర్మాసం ముగిసిన తర్వాత కార్తీక పున్నమి రోజున గుజరాత్‌లోని శత్రుంజయ పర్వతంపై వెలసిన జైనక్షేత్రం ఆదినాథ ఆలయంలో ప్రార్థనలు జరుపుతారు. ఇక్కడకు చేరుకోవడానికి దుర్గమ పర్వతమార్గంలో సుమారు రెండువందల కిలోమీటర్ల దూరం యాత్ర సాగిస్తారు. ఈ యాత్రనే శ్రీ శత్రుంజయ తీర్థయాత్ర అంటారు. జైనుల తొలి తీర్థంకరుడైన ఆదినాథుడు ఇక్కడి నుంచే తొలి ప్రబోధం చేసినందున లక్షలాది మంది జైన సన్యాసులు కార్తీక పున్నమి రోజున ఇక్కడకు చేరుకుని, ప్రార్థనలు చేస్తారు.

కార్తీకంలో పాటించాల్సిన ఆచారాలు
కార్తీకంలో నెలపొడవునా దీపారాధన చేయడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. నెలపొడవునా కుదరకుంటే కనీసం శుక్లపక్షంలోని తొలి ఐదురోజులు, కృష్ణపక్షంలోని తొలి ఐదురోజులు... మొత్తం పది రోజులైనా ఈ నెలలో దీపారాధన చేయాలని, దీని వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్ర వచనం. కార్తీకంలో నదీస్నానం, దీపదానం కూడా విశేష ఫలాన్ని ఇస్తాయి. కార్తీక సోమవారాల్లో ఉపవాస వ్రతం ఆచరించేవారు ఈ నెల పొడవునా శుద్ధ సాత్విక శాకాహారం మాత్రమే స్వీకరించాలి. ఉపవాస వ్రతం పాటించేవారికి ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలు పూర్తిగా నిషిద్ధం అని పెద్దలు చెబుతారు.


ఉపవాస వ్రతం ఆచరించేవారు కార్తీకమాసంలో నెలపొడవునా నిత్య పూజలతో పాటు శివపురాణం, కార్తీక పురాణాల పారాయణ చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుందని అంటారు. దాన ధర్మాలు చేయడానికి, వ్రతాలు, హోమాలు చేయడానికి కూడా కార్తీక మాసం చాలా అనుకూలమైన మాసం. కార్తీక సోమవారాల్లో గాని, ఏకాదశి, పున్నమి రోజుల్లో›గాని రుద్రాభిషేకం, మహా మృత్యుంజయ హోమం చేయడం వల్ల అపమృత్యు భయం, వ్యాధిపీడ తొలగి, మనస్థైర్యం చేకూరుతుంది. కార్తీక ఏకాదశి శ్రీ సత్యనారాయణ వ్రతం ఆచరించడానికి అద్భుతమైన రోజు. కార్తీక మాసంలో పురోహితులకు దీపదానం చేయడంతో పాటు యథాశక్తి గోదానం, భూదానం, హిరణ్యదానం వంటివి కూడా చేయవచ్చు. అలాగే ఈ నెలలో గోసేవ, అనాథ సేవ వంటి కార్యక్రమాలు చేపట్టడం, అన్న సమారాధన చేయడం విశేష ఫలదాయకమని పురాణాలు చెబుతాయి.

వనభోజనాల సందడి
కార్తీకమాసంలో వనభోజనాలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఎందరో దేవతలు వనాలలో, కొండ కోనల్లో వెలశారు. సుప్రసిద్ధ శైవ వైష్ణవ క్షేత్రాలు చాలా వరకు ఇలా కొండ కోనల్లో, దుర్గమారణ్యాలలో వెలసినవే. అందువల్ల వనభోజనాలు చేయడం దేవతా ప్రీతికరమని ప్రతీతి. మానవాళి మనుగడకు పత్రహరితమే కీలకమని చెప్పడంతో పాటు ‘వృక్షో రక్షతి రక్షితః’ అని పిలుపునివ్వడం కార్తీక వనభోజనాల ఆంతర్యం. విష్ణువుకు ప్రతీక అయిన ఉసిరిచెట్టు కింద పనస ఆకుల విస్తర్లలో భోజనాలు చేయడం కార్తీక వనభోజనాల సంప్రదాయం. ఏడాదిలో మరే నెలలోనూ లేనట్లుగా కార్తీకంలోనే ఎందుకు వనభోజనాలు చేస్తారనేదానికి పెద్దలు చెప్పే ముఖ్యవిశేషం ఏమిటంటే, శ్రావణ భాద్రపదాలలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. శరదృతువులో వచ్చే ఆశ్వీయుజ, కార్తీకాలలో భూమి నుంచి కొత్త మొక్కలు మొలకెత్తుతాయి. వనభోజనాల సమయంలో ఆయుర్వేద మూలికా వైద్యం తెలిసిన అనుభవజ్ఞులు ఈ మొక్కల విశేషాన్ని, వాటితో ఔషధులు తయారు చేసే విధానాన్ని, వాటి ఉపయోగాన్ని విశదీకరించేవారు. ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడం వల్ల చదువు సంధ్యలు లేని పామరులు సైతం వైద్య మర్మాలను గ్రహించగలిగేవారు. మొక్కల వల్ల ఒనగూడే ప్రయోజనాన్ని తెలుసుకోవడం వల్ల వాటి పట్ల గౌరవంగా మసలుకొనేవారు. ప్రకృతిని, వృక్షాలను ప్రేమించే లక్షణాన్ని పెంపొందించే ఉద్దేశంతో చేపట్టే కార్తీక వనభోజనాలు మనుషుల మధ్య సామరస్యానికి కూడా దోహదపడతాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list