MohanPublications Print Books Online store clik Here Devullu.com

శని_త్రయోదశి_Shani_trayodasi

శనిత్రయోదశి SANITRAYODASI SANIBHAGAVAN

శని త్రయోదశి

చాలామంది శని పేరు వింటేనే అరిష్టం అని, ఆయన విగ్రహాన్ని తాకితే ఆ దోషం ఎక్కడ తమకు అంటుకుంటుందో అని భయపడుతుంటారు. అయితే అవన్నీ అపప్రథలు మాత్రమే. వాస్తవానికి శని న్యాయాధికారి వంటి వాడు. ఆయన అకారణంగా ఎవరినీ బాధించడు. మానవుల పాపకర్మలను అనుసరించి గోచార రీత్యా ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. అంతేకాదు, ఆయన చాలా సత్యదేవుడు. దానధర్మాలతో సత్యం, అహింసలను ఆచరిస్తూ, పవిత్రంగా జీవించేవారికి ఎటువంటి ఆపద వాటిల్లకుండా కాపాడుతూ వారికి సకల శుభాలను కలుగ చేస్తాడు. వైరాగ్యం కలిగించి భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా, భక్తితో ఆయనను వేడుకుంటే సర్వశుభాలు కలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.


శనిదోష పరిహారానికి...
శని త్రయోదశి రోజున తిల, తైలాభిషేకాలు చేయించి దానాలు ఇవ్వాలి. శనికి ప్రీతికరమైంది, శని దోష శాంతిని చేసేది అయ్యప్పదీక్ష.
భైరవ స్తోత్రం చేసినా, ఆంజనేయుని అర్చించినా, వేంకటేశ్వరుని ఆరాధించినా శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు.
శనివారం- త్రయోదశి తిథి శనీశ్వరుని తైలాభిషేకానికి శ్రేష్ఠమైనది. శని బాధలు పడేవారు జమ్మిచెట్టుకు లేదా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే నల్లని వస్త్రం, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, గాజులు, నల్ల ద్రాక్ష మొదలైనవి జమ్మిచెట్టు వద్ద వదిలి వెళితే కష్టాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయని, ఆదివారం నాడు గో పూజ చేస్తే శనిదోషం పరిహారం కాగలదని విశ్వాసం. కాకులకు, నల్లచీమలకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా శనిబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల కూడా శని బాధల నుంచి గట్టెక్కవచ్చునని శాస్త్రం.
(ఫిబ్రవరి 6 శని త్రయోదశి)
- డి.వి.ఆర్
టాగ్లు: శని, , శని త్రయోదశి, Saturn, , Shani Trayodasi

శని త్రయోదశి

త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం.
అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు. శని జన్మించిన తిధి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమశని ... తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
శనివారం నాడు శ్రీమహాలక్ష్మీ, నారాయణుడు అశ్వత్థవృక్షంపై వుంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఆ రోజున అశ్వత్థవృక్ష సందర్శన, ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్లనువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో వుంచి దానం చేయాలి. శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చేయాలి.
‘‘ నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్‌..
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్‌’’
ఈ శ్లోకాన్ని పఠిస్తే మంచిది.

శని త్రయోదశి కథ

ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది? మధ్యమధ్యలో కష్టాలు వస్తుంటేనే, జీవితపు విలువ తెలిసొస్తుంది. ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది! అప్పుడప్పుడూ అవమానం ఎదురుపడితే, అహంకారం దిగిపోతుంది. అలా మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ, అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు.


సూర్యభగవానునికీ, ఆయన సతి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ పిలుస్తారు. ఈ శని గ్రహం ఒకో రాశిలోనూ దాదాపు రెండున్న సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులనీ చుట్టుముట్టడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మందగమనుడు అన్న పేరు కూడా ఉంది. రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేర్వేరు విధాలుగా ఉంటాయి.

అందుకే జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు, వీలయినంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం శనీశ్వరుడు కొలువై ఉన్న మందపల్లి, సింగనాపూర్‌ వంటి క్షేత్రాలని కానీ; నవగ్రహాలు ఉండే గుడిని కానీ దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి నాడు వచ్చే శనివారం నాడు ఆయనను కొలుచుకుంటే మరింత త్వరగా కరుణిస్తాడన్న నమ్మకమూ ఉంది. ఇంతకీ ఈ శనిత్రయోదశికి ఎందుకింత విశిష్టత అంటే...
శనివారం ఇటు శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతిపాత్రమైన రోజు. ఇక త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి. అలా



స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు, శివుని ముందు శని భగవానుని గురించి పొగడటం మొదలుపెట్టాడట. ఎంతటివారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఆ మాటలను విన్న శివునికి ఒళ్లు మండిపోయింది.

‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అంటూ హుంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు.‘నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’ అంటూ కోపగించిన శనిభగవానుడు, శివుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానంటూ శపథం చేశాడు.శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే, తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు.

మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శనిభగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలచిన శనిని చూసి ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు. దానికి శని ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు పోయి పోయి ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు చిరునవ్వుతో.

శనిదేవుని మాటలు శివునికి విషయం అర్థమైంది. ‘ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో... వారు నీ అనుగ్రహంతో పాటుగా, నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు’ అంటూ శనిని ఆశీర్వదించాడు పరమశివుడు. అప్పటి నుంచి త్రయోదశినాడు వచ్చే శనివారం రోజున, భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు.

(శని నుంచి తప్పించుకునేందుకు శివుడు దాక్కొన్న స్థలం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ‘మందపల్లి’ అని ఓ నమ్మకం.)


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list