MohanPublications Print Books Online store clik Here Devullu.com

రిటర్నుల దాఖలుకు.. సిద్ధమయ్యారా?-Claiming Returns


రిటర్నుల దాఖలుకు.. సిద్ధమయ్యారా?
ఉద్యోగం, వృత్తి, వ్యాపారం... ఏదైనా సరే.. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం... పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు కచ్చితంగా ఆదాయపు రిటర్నులు దాఖలు చేయాల్సిందే. 2016-17 ఆర్థిక సంవత్సరానికి (2017-18 అసెస్‌మెంట్‌ ఇయర్‌)గాను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీ జులై 31. గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి, రిటర్నులు దాఖలు చేసేప్పుడు పరిశీలించాల్సిన అంశాలేమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం!
చెల్లించాల్సిన పన్ను చెల్లించాం.. ఇక రిటర్నులు దాఖలు చేయకపోతే ఏమిటి? చాలామంది ఇలాంటి ఆలోచనతో ఉంటారు. కానీ, ఇది పొరపాటు. ఆదాయం రూ.2,50,000 (60ఏళ్ల పైబడిన వారికి రూ.3,00,000) దాటిన ప్రతి ఒక్కరూ.. పన్ను చెల్లించినా.. చెల్లించకపోయినా కచ్చితంగా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. భవిష్యత్తులో ఇంటి, వాహన, ఇతర రుణాలు తీసుకోవాలనుకునే వారికి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించిన ఆధారమే కీలకమవుతుంది. ముఖ్యంగా పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల లోపు ఉండి, పన్ను చెల్లించినప్పుడు, పన్ను మొత్తాన్ని బట్టి.. అందులో నుంచి గరిష్ఠంగా రూ.5వేలు రాయితీ లభిస్తుంది. పన్ను రిటర్నుల దాఖలు సరళం చేసే విధానంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటోంది. ఆదాయాలు, అవి వచ్చిన మార్గాలను బట్టి, సరైన ఫారం ఎంచుకోవాలి. గతంతో పోలిస్తే.. ఇప్పుడు రిటర్నుల ఫారాల సంఖ్యను కూడా తగ్గించింది. ఉదాహరణకు వృత్తి, వ్యాపారం మార్గాల ద్వారా ఆదాయం ళవచ్చిన వారు కాకుండా మిగతా ఎవరైనా సరే.. ఐటీఆర్‌ 2ను నిరంభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.
ఎందుకాలస్యం... రిటర్నులు దాఖలు చేయడానికి అన్ని వివరాలతో సిద్ధమవ్వండి.
ఐటీఆర్‌ 1/సహజ్‌
ఉద్యోగం, ఒక ఇంటిపై ఆదాయం, పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయం ఉన్నప్పుడు ఈ ఫారాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంతో సులభమైన పత్రం. లాటరీ ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ఈ ఫారం వర్తించదు. వేతన జీవులు కొన్ని నిబంధనలకు లోబడి ఈ ఫారాన్ని వినియోగించుకోవాలి. 
* మొత్తం ఆదాయం రూ.50లక్షల లోపు ఉండాలి. 
* కేవలం ఒక ఇల్లు ఉన్నప్పుడు 
* వడ్డీ ద్వారా ఆదాయం వస్తున్నప్పుడు
ఈ రిటర్నులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది.
సీనియర్‌ సిటిజన్లు: 80ఏళ్లు, ఆపైన ఉన్నవారు తమ ఆదాయం రూ.5లక్షలలోపు ఉన్నప్పుడు సహజ్‌ (ఐటీఆర్‌ 1)లో తమ రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే తప్పనిసరిగా చేయాలనే నిబంధన లేదు.
ఐటీఆర్‌ 2: ఆదాయ పరిమితితో నిమిత్తం లేకుండా.. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌)లు అందరూ ఈ ఫారాన్ని వినియోగించుకునే వీలుంది. ఈ ఫారాన్ని వినియోగించుకునేప్పుడు.. అసెసీలు అన్ని మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాలను ఇందులో తెలియజేసేందుకు వీలుంటుంది. వేతనం, ఇంటి ద్వారా వచ్చిన ఆదాయం, మూలధన రాబడి, వడ్డీ, లాటరీ ద్వారా ఆదాయం ఇలా ఏ ఆదాయాలనైనా ఇందులో చూపించుకోవచ్చు. అయితే, వృత్తి, వ్యాపారం ద్వారా ఆదాయం ఉన్నవారికి ఈ ఫారం వర్తించదు. అసెసీకి తమ ఆదాయాన్ని వెల్లడించే క్రమంలో ఏ ఫారం వర్తిస్తుందోననే అనుమానం ఉన్నప్పుడు ఐటీఆర్‌ 2 ఫారాన్ని ఎంచుకొని, రిటర్నులను దాఖలు చేయడం ఉత్తమం.
నగదు జమ చేశారా?
ఈసారి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేప్పుడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదేమిటో తెలుసా? పాత పెద్ద నోట్లు రద్దు అయిన తర్వాత అంటే.. నవంబరు 9, 2016 నుంచి డిసెంబరు 30, 2016 వరకూ బ్యాంకులో రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను డిపాజిట్‌ చేశారా? అనేది.. ఒకవేళ మీరు రూ.2లక్షల విలువకు మించి ఈ నోట్లను జమ చేసినప్పుడు ఆ వివరాలను కచ్చితంగా పేర్కొనాల్సిందే.
ఇవీ ముఖ్యమే...
* షేర్లలో లావాదేవీలు నిర్వహించినప్పుడు లాభం వచ్చినా.. నష్టం వచ్చినా తప్పనిసరిగా పేర్కొనాల్సిందే. మీరు తెలియజేయకపోయినా.. ఎక్స్ఛేంజీల ద్వారా ఆ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. 
* ఆర్థిక సంవత్సరంలో రూ.30లక్షలకు మించి ఏదైనా ఆస్తిని కొన్నప్పుడు, ఆ సమాచారాన్ని తెలియజేయాలి. 
* ఆస్తిని అమ్మినప్పుడు: ఏదైనా ఆస్తిని అమ్మినప్పుడు దానిపై వచ్చే మూలధన రాబడిని గణించి, ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను రిటర్నులలో దాఖలు చేయాలి. మూలధన లాభంపై పూర్తి మినహాయింపు పొందుతున్నా రిటర్నులు దాఖలు చేయడం ఉత్తమం. ఆస్తి అమ్మిన వివరాలు వెల్లడించేప్పుడు.. సెక్షన్‌ 50సీ ప్రకారం రిజిస్ట్రేషన్‌ విలువనే కనీస అమ్మకపు విలువగా పరిగణిస్తారు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించిన ధరకన్నా తక్కువకే అమ్మినట్లు చూపించినా.. నిబంధనలు అంగీకరించవు. అదే సమయంలో కొనుగోలుదారులు కూడా రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించిన ధర మేరకే, దస్తావేజు ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఒకవేళ ఈ రెండింటి మధ్య తేడా ఉంటే.. ఆ మేరకు కొనుగోలుదారుడి ఆదాయంగా పరిగణిస్తారు. పన్ను భారం పడే అవకాశం కూడా ఉంది. 
* ఈ లావాదేవీలను పేర్కొనేప్పుడు సంబంధిత పత్రాలు, ఆధారాలను ఒకసారి నిశితంగా పరిశీలించండి. ఆధారాలన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. మీ రిటర్నులను ఆదాయపు పన్ను శాఖ పరిశీలనకు ఎంచుకున్నప్పుడు ఈ ఆధారాలు మీకు ఉపయోగపడతాయి.
అనుసంధానం చేయాల్సిందే...
మీ పాన్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేస్తేనే ఈ ఫైలింగ్‌ చేయగలరు. ఆదాయపు పన్ను శాఖ ఈఫైలింగ్‌ వెబ్‌సైటులోకి ప్రవేశించగానే.. మీ పాన్‌ను, ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సిందిగా అడుగుతుంది. ఇక్కడ మీ పాన్‌ కార్డులో ఉండే సమాచారం అంటే.. పుట్టిన తేదీ, పేరు తదితర వివరాలు ఆధార్‌ సమాచారంతో సరిపోవాలి. పేరు వివరాలు కొంత అటుఇటూగా ఉన్నా.. పుట్టిన తేదీ.. స్త్రీ/పురుష వివరాలు, మొదటి, మధ్య, చివరి పేర్లలో ఏ రెండు సరిపోయినా ఆధార్‌ అనుసంధానం తేలికగానే పూర్తవుతుంది. ప్రధానంగా పుట్టిన తేదీలో తేడా ఉంటే మాత్రం అనుసంధానం కష్టమే. ఆధార్‌ అనుసంధానం సాధ్యం కాకపోతే.. వెంటనే మీ పాన్‌ కార్డు వివరాలతో, ఆధార్‌ కార్డు వివరాలు సరిపోయేలా ఆధార్‌లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోండి. రిటర్నులు దాఖలు చేసేప్పుడు కూడా కచ్చితంగా ఆధార్‌ నెంబరును పేర్కొనాల్సిందే.
ఈ వెరిఫై చేయండి!
ఆదాయపు పన్ను శాఖ పన్ను వెబ్‌సైటు www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైటులో మీరు రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. మీరు, ఇప్పటికే ఈ వెబ్‌సైటులో నమోదు చేసుకొని ఉంటే.. మీ యూజర్‌ ఐడీ(పాన్‌), పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ ఆధారంగా వెబ్‌సైటులోకి వెళ్లవచ్చు. ఒకవేళ మీరు పాస్‌వర్డ్‌ను మర్చిపోతే.. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా కొత్త పాస్‌వర్డ్‌ను పెట్టుకోవచ్చు. మీరు ఇప్పటికే ఈ ఫైలింగ్‌ వెబ్‌సైటులో నమోదు చేసుకొని ఉన్నారనుకోండి... మీ బ్యాంకు ఆన్‌లైన్‌ ఖాతా నుంచి కూడా ఈ వెబ్‌సైటులోకి ప్రవేశించే వెసులుబాటు ఉంది. (బ్యాంకు ఖాతాకు పాన్‌ అనుసంధానమై ఉండాలి).
గతంలోలాగా రిటర్నులు దాఖలు చేయగానే వచ్చే అక్నాలజ్‌మెంట్‌ను సీపీసీ, బెంగళూరు కార్యాలయానికి పంపాల్సిన అవసరం లేదిప్పుడు. రిటర్నులు సమర్పించిన వెంటనే ఈ వెరిఫై చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు ఉంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా ప్రవేశించినప్పుడు ఈ వెరిఫై చేసుకోవడం ఎంతో సులభం. ఈ వెరిఫైను నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చేయాల్సిందిగా క్లిక్‌ చేస్తే చాలు. వెంటనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం లేనివారు, ఆధార్‌ ఆధారిత ఈ వెరిఫై చేసుకునే వీలుంది. రూ.5లక్షలలోపు ఆదాయం ఉండి.. ఎలాంటి రిఫండ్‌ కోరకపోతే.. ఈ ఫైలింగ్‌ వెబ్‌సైటు నుంచి ఎలక్ట్రానిక్‌ వెరిఫికేషన్‌ కోడ్‌ (ఈవీసీ)ని పొందే అవకాశం ఉంది. దీని ద్వారా కూడా ఈ వెరిఫై చేసుకోవచ్చు.
మినహాయింపులు చూసుకోండి..
ఆదాయపు పన్ను రిటర్నుల ఫారాన్ని పూర్తి చేసే ముందు వివిధ సెక్షన్ల కింద కోరాల్సిన మినహాయింపులన్నీ క్లెయిం చేసుకున్నామా లేదా సరిచూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన మినహాయింపులను పరిశీలిస్తే... 
సెక్షన్‌ 80C: ఆదాయపు పన్ను మినహాయింపు కోరేందుకు కీలకమైన సెక్షన్‌ ఇది. ఇందులో పీఎఫ్‌ ఖాతాలో జమ అయిన మొత్తం, జీవిత బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియం, గృహరుణానికి చెల్లించిన అసలు, పిల్లలకు చెల్లించిన ట్యూషన్‌ ఫీజులతోపాటు, పన్ను ఆదా బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లు ఇవన్నీ ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి. గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ దీని కింద మినహాయింపు కోరవచ్చు. దీనికి అదనంగా సెక్షన్‌ 80-C-C-D(1) కింద రూ.50వేల వరకూ అదనపు మినహాయింపు ఎన్‌పీఎస్‌లో మదుపు చేయడం ద్వారా పొందవచ్చు.
సెక్షన్‌ 80CCG: రాజీవ్‌ గాంధీ ఈక్విటీ పొదుపు పథకం (ఆర్‌జీఈఎస్‌ఎస్‌)లో మీరు మదుపు చేసి ఉంటే.. ఈ సెక్షన్‌ కింద మినహాయింపు కోరవచ్చు. ఈ పథకంలో గరిష్ఠంగా రూ.50వేల వరకూ మదుపు చేసే వీలు ఉండేది. మదుపు చేసిన మొత్తంలో 50శాతం వరకూ పన్ను మినహాయింపు కోసం చూపించుకోవచ్చు. వార్షిక స్థూల ఆదాయం రూ.12లక్షల లోపు ఉండి, కొత్తగా మార్కెట్లో మదుపు చేసే వారు ఈ పథకంలో చేరడానికి అర్హులుగా నిర్ణయించారు. పెట్టిన పెట్టుబడిని మూడేళ్లపాటు కొనసాగించాల్సి ఉంటుంది.
సెక్షన్‌ 80D:60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి రూ.25వేల వరకూ మినహాయింపు వర్తిస్తుంది. పన్ను చెల్లింపుదారులు సీనియర్‌ సిటిజన్లయితే ఈ పరిమితి రూ.30వేలు. మీపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం తీసుకున్న పాలసీకి చెల్లించే ప్రీమియానికీ రూ.25వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. వారు సీనియర్‌ సిటిజన్లయితే రూ.30వేల వరకూ మినహాయింపును అనుమతిస్తారు. వీటికి అదనంగా ఆరోగ్య పరీక్షల నిమిత్తం వెచ్చించిన మొత్తానికి రూ.5వేల వరకూ మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. అంటే, ఈ సెక్షన్‌ కింద దాదాపు రూ.55వేల వరకూ (వాస్తవంగా ఖర్చు చేసినప్పుడు) మినహాయింపు పొందే వెసులుబాటు ఉంది. వీటితోపాటు.. వైద్య చికిత్స కోసం వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తాన్ని రూ.30వేల వరకూ కూడా మినహాయింపు కోసం చూపించుకోవచ్చు.
సెక్షన్‌ 80DD: వైకల్యం ఉండి, తనపై ఆధారపడిన వారికి వెచ్చించే వైద్య ఖర్చులకు ఈ సెక్షన్‌ కింద మినహాయింపులు పొందవచ్చు. పాక్షిక వైకల్యం ఉన్నప్పుడు రూ.75వేల వరకూ.. తీవ్ర వైకల్యం ఉన్నప్పుడు రూ.1,25,000 వరకూ ఈ మినహాయింపు లభిస్తుంది.
సెక్షన్‌ 80DDB: పన్ను చెల్లింపుదారుడు లేదా అతని మీద ఆధారపడిన వారికి రూల్‌ 11డీడీ(2)లో పేర్కొన్న తీవ్ర వ్యాధులు ఉన్నప్పుడు వెచ్చించే ఖర్చులపై గరిష్ఠంగా రూ.40 వేల వరకూ మినహాయింపు కోరవచ్చు. 60ఏళ్లు దాటిన వారైతే గరిష్ఠంగా రూ.60 వేల వరకూ మినహాయింపు వర్తిస్తుంది.
సెక్షన్‌ 80E: సొంతంగా విద్యాభ్యాసం కోసం రుణం తీసుకున్నా.. పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం తీసుకున్న విద్యారుణంపై చెల్లించే వడ్డీకి ఈ సెక్షన్‌ కింద పూర్తి మినహాయింపు లభిస్తుంది.
సెక్షన్‌ 80EE: గృహరుణం తీసుకొని, దానికి వడ్డీ చెల్లిస్తున్నప్పుడు మినహాయింపు ఈ సెక్షన్‌ కింద ప్రత్యేక మినహాయింపు పొందే అవకాశం ఉంది. అదెప్పుడంటే.. 
* రుణం 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంకు నుంచి రూ.35లక్షల లోపు గృహరుణం తీసుకొని ఉండాలి. 
* మీరు తీసుకున్న ఇంటి విలువ రూ.50 లక్షలకు మించి ఉండకూడదు. 
* రుణం మంజూరైన తేదీ నాటికి అసెసీ పేరు మీద మరో ఇల్లు ఉండి ఉండకూడదు. 
* వడ్డీ మొత్తం రూ.50వేల వరకూ ఈ సెక్షన్‌ కింద మినహాయింపు కోరవచ్చు.




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list