MohanPublications Print Books Online store clik Here Devullu.com

గరికిపాటి నరసింహారావు_Garikapati Narasimha Rao speeches


గరికిపాటి నరసింహారావు

Garikapati Narasimha Rao speeches
అన్నీ ఒక్కరే!
నాలుగైదు ఆయుధంబులు కేలదాల్చి
నిలిచియుందువు దేనికో నిశ్చలముగా
ఎవ్వరిని రక్షసేయని ఎవ్వరికిని శిక్షవేయని
నిర్లిప్త సాక్షివేమో!
ఎన్నో ఘోరాలు, నేరాలు ప్రపంచంలో జరిగిపోతున్నాయి. దేవుడు వాటిని అరికడుతున్నట్లు కనిపించడం లేదు. అలాగే ఎంతో మంది సాధువులను, భక్తులను దుర్మార్గులు అవమానిస్తున్నారు. దైవభక్తి ఉన్న వాళ్లు బాధపడుతున్నారు. కానీ వాళ్లను దేవుడు కాపాడుతున్నట్లు కనపడటం లేదు. మన దేవతలను చూస్తే ఏదో ఒక ఆయుధం ధరించి ఉంటారు. బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి, సరస్వతి...లాంటి కొంత మంది దేవతలు తప్పితే అందరూ ఆయుధాలు ధరించే ఉంటారు.
మరి దేవతల చేతుల్లో ఆ ఆయుధాలు ఎందుకు? దాని ద్వారానే మనం జగత్‌తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు అసంతృప్తులు, అత్యాశలు అన్నీ దూరమవుతాయి. అన్ని సమస్యలకు అది వైద్యం. నేరం చేసిన వాడికి వెంటనే శిక్ష వేసి, మంచి పని చేసిన వాడికి వెంటనే శుభపరిణామాన్ని ఇచ్చేస్తే అక్కడకు దేవుడు ఉన్నట్టా? ఆయనే ఆ పని చేస్తే లోకంలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు ఎందుకోసం ఉన్నట్టు? మనిషి విచక్షణా జ్ఞానం దేనికి? క్రీడ కోసమే భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆట ఆడుతున్నది ఆయనే, ఆడుకుంటున్నది ఆయనే. ఆడుకోవడానికి ఉపయోగపడుతున్న పావులు కూడా ఆయన రూపాలే. సృష్టి ప్రారంభంలో కర్మ ఫలాలు ఏమున్నాయి? ప్రాథమిక ప్రశ్న ఇది. ఎవరికీ ఏ కర్మ లేనప్పుడు ఆయన సృష్టించిన వారికి కర్మఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అందుచేత భౌతికశాస్త్రం చెప్పిన ప్రకారం సృష్టి ఒక పరిణామక్రమంలో నడుస్తున్నదైనా కావాలి. దేవుడితో సంబంధం లేకుండా! లేదంటే అద్వైతం చెప్పినట్టుగా సృష్టి ఉన్నదని అనుకోవడం ఒక మాయ అయినా కావాలి. ఈ రెండూ సమన్వయం జరగాలంటే కచ్చితంగా అది పరిణామక్రమంలోనే ఏర్పడింది. రాముడు వశిష్ఠుడిని ఒక ప్రశ్న వేస్తాడు. ‘‘మహర్షీ! మహాప్రళయంలో ఈ జీవులన్నీ భగవంతునిలో కలిసి పోతాయంటారు కదా! ఇది నిజమేనా?’’ అని అడిగాడు. వెంటనే వశిష్టుడు ఒక నవ్వు నవ్వి ‘‘అంటే... కలవనప్పుడు అంతకుముందు భగవంతునితో వేరుగా ఉన్నట్టేనా?’’ అని అన్నాడు. మళ్లీ ప్రశ్నతోనే సమాధానం చెప్పాడు. మహాప్రళయం కంటే ముందు వేరుగా ఉంటే కదా వచ్చి కలవడానికి!
భగవంతుడు ఆయుధాలు చేతపట్టి ఎవరినైతే రక్షించాలని కోరుకుంటున్నారో వాళ్లు కూడా భగవత్‌ స్వరూపమే. బాధపెట్టే వాడు కూడా భగవత్‌ స్వరూపమే. పెడుతున్న బాధ కూడా అదే. ధ్యానం, ధ్యేయం, ధ్యాత... మూడూ ఒక్కటే. మూడు ఒక్కటే అంటే అర్థం ఏంటి? జరుగుతున్నది మాయ. సృష్టికి ప్రళయం అనేది ఉండదు. ఎక్కువ జీవులు ఒకేసారి పోవడం వల్ల వినాశనం అని అనిపిస్తుంది. అంతే తప్ప ప్రళయం అనేది లేదు. శంకరాచార్యస్వామి వారు ఇలా చెబుతారు.
‘‘యన్నాదౌ యచ్ఛనాస్యంతే
తన్మధ్యేభ్రాంత్యమపి అసతౌ
అథోమిధ్యా జగత్‌ సర్వం’’
ఈ సృష్టి మొదట లేదు. చివరా లేదు. మొదటా, చివరా లేనిదీ మధ్యలో ఎలా ఉంటుంది. మధ్యలో ఉన్నట్టు నీకు కనిపిస్తున్నప్పటికీ లేనిదానితో సమానం. కాబట్టి జగత్తు మొత్తం మిధ్య అని చెప్పారు. కాబట్టి దేవతల రక్షణ, శిక్ష అవన్నీ మన మనోభావాలు. మనం ఆరాధన కోసం పెట్టుకున్నటువంటి శిల్పం, మనం ఒకటే అని తెలుసుకోగలిగితే మనకు రక్షణ అవసరమే లేదు. ఇది కొంత విచిత్రంగా ఉండొచ్చు కానీ నిజం. మనం ఏ శిక్షా పొందడం లేదు. జరుగుతున్నది ఒక లీల. ఆయనతో ఆయనే ఆడుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నది అంతా భ్రమే. అందుచేత జరుగుతున్నది ఒక నాటకం. నీ పాత్రేదో నువ్వు చేయి. అప్పుడు ఏ పరిణామం జరిగినా కంగారు ఉండదు. ఒక చిరునవ్వు నవ్వి చేయవలసిందేదో చేసుకోవచ్చు. మనందరి రూపంలో భగవంతుడు సాగిస్తున్న లీలలను అర్థం చేసుకుంటూ హాయిగా, ఆనందంగా ఉందాం.
- డా. గరికిపాటి నరసింహారావు
కావాల్సిందిచిత్తశుద్ధి!
రాజుల శక్తితోడ రుషిరాజుల తీవ్రవిరక్తితోడ
ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ
ధ్యోరాజుగ వెల్గునే భరతరాజ్యము బానిసయైున వేళ
సామాజిక సర్వనాశనము మాత్రము తప్పదు మేల్కొండికన్‌!
అపారమైన శక్తితో, ప్రాణాలకు తెగించి దేశాన్ని పాలించిన రాజులు యుద్ధాలు చేసి ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టారు. ఈనాటికీ ఆ శక్తి, ఆ రక్తం మనలో ప్రవహిస్తుండబట్టే ఎంత పెద్ద దేశాలనైనా ఎదుర్కోవడానికి మనం సాహసంతో సిద్ధంగా ఉన్నాం. చైనాతో యుద్ధమైనా మనం ఇలాగే ఆలోచించాలి. లొంగిపోయి బానిసవ్వడానికి వీల్లేదు. ఆయుధాలు అందరి దగ్గరా ఉన్నాయి. వేయడం మొదలుపెడితే ప్రపంచంలో ఎవ్వడూ మిగలడు. బతికుండటం ఒక్కటే ముఖ్యం కాదు. బతికుండి సాధించాల్సినవి చాలా ఉన్నాయి. పౌరుషం లేని బతుకు కంటే వెళ్లిపోవడమే మంచిది. భయపడుతూ ఎందుకు బతకడం? దేశమైనా అంతే... వ్యక్తయినా అంతే! బతికితే భీష్ముడిలా బతకాలి. పోతే అభిమన్యుడిలా పోవాలి. అటూ ఇటూ కాకుండా ఉండకూడదు. ఓ బాలచంద్రుడి కథ, ఖడ్గతిక్కన కథ మనకు ఏం చెబుతోంది! ఎంతో మంది రాజుల మేధస్సుతో ఈ దేశం నిలబడింది. కాళిదాసు వంటి ఎంతో మంది కవులు దేశానికి ఎంతో బోధ చేశారు.
ప్రస్తుతం మనకు చిత్తశుద్ధి లేదు. ఇంద్రియ నిగ్రహం లేదు. దండాలు పెట్టడం, ప్రదక్షిణలు చేయడం నేర్చుకున్నాం. ముందు మనస్సులో సంతృప్తి లేదు. వెర్రికోరికలు, పిచ్చి ఆశలతో గుళ్ల చుట్టూ, గోపురాల చుట్టూ తిరుగుతున్నాం. ఈ ఆశలు తీరడానికి, భయాలు పోవడానికి ఆ దారి వెతుక్కున్నాం. ‘ఏమిటీ భయం? ఎందుకొస్తుందీ భయం? ఎక్కడ నుంచి పుట్టిందీ భయం? దీనికి నేనెందుకు భయపడుతున్నాను? భయంతో నేనుంటే అంతిమంగా జరిగేదేమిటి?’ అని ఆలోచిస్తే భయం ఒక్క క్షణంలో పోతుంది. జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకం ఒక్కపేజీ చదివితే చాలు భయం ఉండదు మనిషికి. జ్ఞానం కోసం కనుక ఆధ్యాత్మికతను వినియోగించుకోగలిగితే ఈ దేశంలో అపూర్వమైన భారతీయ వైభవం అప్పుడు కనిపిస్తుంది. అజ్ఞానం కోసం, స్వార్థప్రయోజనాల కోసం వినియోగించుకుంటే... క్షణం విరామం చాలు బతుకు నాశనం కావడానికి!
మనస్సును నిగ్రహించుకోలేక, మనస్సును స్వాధీనం చేసుకోలేక, మనస్సంటే ఏమిటో ఆలోచించే ఓపిక మన మనస్సుకే లేక మాయలో పడిపోతున్నాం. ఎవరో చెబుతారు చేస్తుంటాం! ఎందుకు చేస్తామో తెలియదు. ఎందుకు చెబుతున్నారో వారికి తెలియనట్టే! వారి ప్రయోజనాలు వారివి, మన ప్రయోజనాలు మనవి. ఆత్మవిశ్వాసంతో ప్రవరుడిలా ఇంద్రియ నిగ్రహంతో నిలబడగలిగితే ఎన్ని మాయలనైనా ఛేదించవచ్చు. అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’ ద్వారా చెప్పిన సందేశం ఇది. అలా ఎంతోమంది కవిరాజులు దేశానికి బోధ చేశారు.
రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం అంటారు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం గొప్పదా! రవి అస్తమించినా, ఉదయించినా సమానంగా సంధ్యావందనం చేసే నా భారతీయ సామ్రాజ్యం గొప్పదా! ఆలోచించండి. నా దేశ సాహిత్యం ముందు, నా దేశ కవిత్వం ముందు దేనికీ సరిపోరు. అంతటి గొప్పదేశంలో పుట్టిన మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ చూసినా స్వార్థమే. పండుగ నాడు గుళ్లో కనిపిస్తాం. మన అజ్ఞానానికి ఇంతకన్నా పరాకాష్ఠ ఉందా! దేవుడు అక్కడ ఉన్నాడని నమ్మినప్పుడు రోజూ ఎందుకు వెళ్లరు! తొలి ఏకాదశి నాడు గుడి నిండా జనం కనిపిస్తారు. మరుసటి రోజు పూజారి ఒక్కడే ఉంటాడు. ముక్తి కోరుకునే వారికి, అమ్మవారు మనసులో ఉన్న వారికి ముక్కోటి ఏకాదశి అయినా ఒక్కటే, మూర్ఖపు రోజైనా ఒక్కటే. రోజులను బట్టి, ప్రాంతాలను బట్టి మనుషుల బతుకులుండవు. మనస్సులను బట్టి ఉంటుంది. ఆ మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి. రోజూ గుడికెళ్దాం. రోజూ పదిరూపాయలిద్దాం. నెలంతా ఇచ్చినా మూడొందలే అవుతుంది. ఒక్కపూట హోటల్‌కెళ్లినా అంతకంటే ఎక్కువే అవుతుంది. ఎవ్వరూ లేనప్పుడు గుడికెళ్లడం, కూర్చుని గర్భగుడిలో దేవుణ్ణి చూడటంలో ఎంత ఆనందం ఉంటుందో గమనించండి. సోమవారమో, ముక్కోటి ఏకాదశినాడో వెళ్లాలనే ఆలోచన ఎందుకు?
ప్రతి ఊళ్ళోనూ గుడి ఉంది. ప్రతి ఊళ్ళోనూ దేవుడున్నాడు. మన ఊళ్ళో గుడి తిరుపతి కంటే ఎక్కువ. మన ఊళ్ళో శివుడు శ్రీశైలం శివుని కంటే ఎక్కువ. ఊళ్ళో శివుణ్ణి పస్తులు పెట్టి శ్రీశైలం శివుణ్ణి పోషిస్తారా? ఊళ్ళో రాముణ్ణి పస్తులుంచి తిరుపతి హుండీలో కానుకలు వేస్తారా? అన్ని దేవాలయాల్లోనూ ధూపదీప నైవేద్యాలు ఉండాలా వద్దా? అందరూ బతకాలా వద్దా? మన ఊళ్ళో పూజారి ఎందుకు పస్తులుండాలి? అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. 
- డా. గరికిపాటి నరసింహారావు


తొలగించాల్సినవి ఎన్నెన్నో!
లలితాసహస్రనామంలో ఒక మాట ఉంది.
‘జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని!
సర్వోపనిషత్‌ దుద్గుష్ట శాంత్యతీత కళాత్మిక!!’

పుట్టడం, పెరగడం, వృద్ధాప్యంలోకి ప్రవేశించడం, చనిపోవడం...ఇవన్నీ ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంటాయి. వీటిలో పుట్టడం, చనిపోవడం అర్థమయితే చాలు మధ్యలో ఉన్నదంతా అర్థమవుతుంది. ఈ విషయం అన్ని ఉపనిషత్తుల్లోనూ చెప్పారు. అది తెలుసుకుంటే శాంతికి కూడా అతీతమైన స్థాయికి చేరుకుంటారు. అది జరగాలంటే పూర్వజన్మ వాసనలన్నీ పోవాలి. గుళ్లో శివలింగం మీద నిన్నటి పూజాద్రవ్యాలు తొలగించకుండా అలానే ఉంచితే శివలింగం సరిగ్గా కనిపించదు. ‘అన్నీ తీసేసి చెంబు నీళ్లు పోస్తే బాగుండు! శివలింగం బాగా కనిపించేది’ అనుకుంటాం. నిన్నటి పూజద్రవ్యాలు ఉంటే శివలింగం సరిగ్గా కనిపించనట్టుగా, నిన్నటి జ్ఞాపకాలు, మొన్నటి జ్ఞాపకాలు ఉన్నంత వరకు గుండెల్లో ఉన్న శివుడు కూడా సరిగ్గా కనపడడు. అవే పూర్వకర్మలు! వాటినే తీసేయమని అడుగుతున్నాం అమ్మవారిని భక్తితో..

‘అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి
మన్నించి పూర్వకర్మల సున్నంబును చేయుమమ్మ శూలధరాణి’
మనసులో ఏ భావోద్వేగాలు కలిగినా దేవుని ముందే ప్రకటించాలి. ఏడవాలనుకుంటే అమ్మ ముందే ఏడువు. లోకుల ముందు ఏడుస్తే లోకువ అవుతావు. దైవం ముందు ఏడిస్తే ఓదార్పు లభిస్తుంది. ‘అన్నింటికి పూర్వజన్మల కర్మలే కదా కారణం. వీటిని మొత్తం సున్నం చేసేయ్‌. చేస్తే జీవన్ముక్తి పొంది నీ పాదస్మరణ చేసుకుంటాం’ అని అమ్మ వారిని వేడుకోవాలి. తెలిసి చేసినా, తెలియక చేసినా అన్ని రకాల పాపకర్మలు, ఫలాలు నశించాలంటే పరాశక్తిని నిత్యం స్మరించాలి. ఈ విషయాన్ని దేవీపురాణంలో చెబుతారు.
దేశంలో అత్యద్భుతమైన ఘట్టాలు, అతి దారుణమైన ఘట్టాలు అర్ధరాత్రే జరిగాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం అర్ధరాత్రే వచ్చింది. ‘ఎమర్జెన్సీ’ పేరు మీద ఆ స్వాతంత్ర్యాన్ని అర్ధరాత్రే హరించారు. ఆ శాసనం మీద సంతకం అర్ధరాత్రే జరిగింది. అర్ధరాత్రే డంకెల్‌ ఒప్పందాల మీద సంతకాలు చేసి విదేశాల వాళ్లు ఇక్కడ పరిశ్రమలు పెట్టేలా చేసి, అన్ని రంగాలను శాసించే అవకాశం కల్పించారు. ఆనాటి ఆర్థిక పరిస్థితిని బట్టి తీసుకున్న నిర్ణయమే అయినా అది తరువాత ఎన్నో రంగాల్లో వికటించింది. టర్మినేటెడ్‌ సీడ్స్‌ను ప్రవేశపెట్టింది వాళ్లే. ఆ విత్తనాలు ఆ పంటకే. మళ్లీ పనికిరావు. మళ్లీ వాణ్ణి అడగాల్సిందే. పాతికేళ్ల క్రితం విత్తనాలు కొనుక్కునే అవసరం లేదు. పండిన పంటలో ఇన్ని దాచుకుని మళ్లీ నాటితే పంట పండేది. ఇప్పుడు విత్తనాల కోసం క్యూ కట్టి నిల్చోవాల్సి వస్తోంది. అలా నిలుచుని తెచ్చుకున్నవి మంచివా అంటే కల్తీ విత్తనాలే! అవినీతికి ఎన్ని అవకాశాలుంటాయో అన్ని అవకాశాలను వినియోగించుకుంటారు మనవాళ్లు.

‘‘దిగుబడి ఎక్కువన్న ఉపదేశము నమ్మి
విదేశ బీజముల్‌ ఎగబడి కొంటిరి
ఈ పుడమినేది ఫలించునో, ఏది పుచ్చునో
తెగబడి వారు చెప్పుటయు తీరికగా తమరెల్ల నమ్ముట
జగమొక గ్రామమేయనుట జాతుల స్వేచ్ఛను దోచుటేయగున్‌!’’

గ్లోబల్‌ విలేజ్‌... గ్లోబల్‌ విలేజ్‌ అని ఇరవైఏళ్లుగా ప్రాణం తినేశారు. విదేశాల్లో వేల కోట్లు సంపాదిస్తున్న కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలను దోచుకోవడానికి పెట్టిన కార్యక్రమమే ఈ ప్రపంచీకరణ. ప్రకృతి విశేషం గమనిస్తే కళ్లు చెదిరిపోతాయి. కొన్ని రకాల పంటలు, పండ్లు, ధాన్యాలు, కూరగాయలు కొన్ని ప్రాంతాల్లోనే పండుతాయి. వేరే ప్రాంతాల్లో పండవు. కారణమేమిటంటే ఆ ప్రాంత ప్రజలు ఆ పంటలు తిని బతకాలని. ఈ భూమి మీద ఏది పండుతుందో వారెవరు చెప్పటానికి? నీకు తెలియదా ఏది పండుతుందో...! ఉప్పాడ బట్టలు అంటే చుట్టుపక్కల ప్రజలందరూ కట్టేవారు. ఽఅలాగే ధర్మవరం బట్టలను తెలుగు ప్రజలందరూ కట్టుకునే వారు. పూతరేకులు ఆత్రేయపురం నుంచి, పాలకోవ కండ్రిక నుంచి తెచ్చుకునే వారు. అన్నీ మన దగ్గరే ఉండగా ఇతర దేశాల వస్తువులు ఎందుకు? ఈ విషయాన్ని అందరూ ఆలోచించాలి.
డా. గరికిపాటి నరసింహారావు

స్వార్థంతోనే సమస్య!
వ్యవసాయంలోకి స్వార్థం ప్రవేశించి భూమిని ఎలా పాడుచేస్తోందో తెలుసుకుందాం.
అందరి దృష్టి ఒక్కటే ఆస్తులు మూటలు కట్టుకుంటయి
అందరి మేలు చూడగల యట్టి విశాలత కానరాదయా
ఇందరి భోజనంబు హరియించి దురాశను కొందరెవ్వరో
విందులనారగించుటకు పృథ్వినీ, సాధ్వినీ కోత బెట్టెరే!
అందరినీ కష్టపెట్టి, కొందరు సుఖపడటం ఏమిటి! ప్రపంచంలో అన్ని రకాల సమస్యలకూ మూలం ఇది. దీన్ని అరికట్టడం కోసమే రాజ్యాంగం, ప్రభుత్వం! అక్రమంగా సంపాదించేవాళ్లు వాటిని కూడా కొనేస్తారు. ఏ పంట వేయాలి? ఎప్పుడు వేయాలి? పొగాకు సాగు చేసినంత వరి సాగు చేస్తున్నామా? పొగాకు తాగడం దుర ్వ్యసనం. అయినా ఆ అలవాటును మానుకోలేం. సినిమాల్లో సిగరెట్‌ తాగడం, మద్యం తాగడం చూపిస్తారు. కింద చిన్నగా హానికరం అని వేస్తుంటారు. సిగరెట్‌ తాగడం, మద్యం తాగడం చూపించకుండా సినిమా తీయలేరా నేటి దర్శకులు! పూర్వం నాటకాల్లో ప్రజలను బాధపెట్టే విషయాలేవీ ప్రదర్శించేవారు కాదు. సినిమా అంటే కళ. దాన్ని దేశభక్తికి, సామాజిక ప్రయోజనాలకు వినియోగించవచ్చు. గతంలో వినియోగించారు. ఇప్పుడు అంతా లాభంపైనే దృష్టి. వ్యవసాయం నుంచి సినిమాల వరకు అంత వ్యక్తుల లాభంపైనే ఆలోచనంతా!
‘‘ఎక్కడో దూరదేశముల ఎవ్వరో క్రొవ్వున, ఒంటి నిండా మత్తెక్కిన వేళ తిందురట
ఇక్కడి రొయ్యల మాంసము అందుకై చక్కని పంట భూములన్‌ సాగరముల్‌ ఒనరించినారు నీరెక్కువ, ఖర్చులెక్కువ, పదింతలకెక్కువ కల్మశాశ్రువుల్‌’’
ఈ పంటల వల్ల ఎవరికి లాభం చేకూరుతోంది- కొందరు వ్యక్తులకు తప్పితే! ఆ వ్యక్తులకైనా లాభం ఎన్నాళ్లు వస్తోంది! కొద్దిగా నీళ్లందుకుని చక్కని పంటనిచ్చే భూములను చేపల చెరువల పేరిట నీటితో నింపేస్తున్నారు. తీరా వీటికి ఖర్చులు కూడా ఎక్కువే. దానివల్ల కాలుష్యం కూడా అధికమే!
నాకు హనుమంతుడు ఆదర్శం. పని చేయాల్సిన చోట చిత్తశుద్ధితో చేయాలి. మిగతా చోట రామ..రామ.. అనుకుంటూ ఉండాలి. భగవంతుడు నాకు టీవీల్లోనో, సభల్లోనో రెండు గంటలు మాట్లాడే అవకాశం ఇచ్చాడు. దాన్ని కర్తవ్యంగానే భావించాను. నా ప్రసంగంలో ఏదైనా నిక్కచ్చిగానే చెబుతాను. అది హనుమంతుడు సముద్రం దూకినట్టుగానే ఉంటుంది. నాది సెలయేటి ప్రవాహం కాదు, సాగరఘోష. ఆ రెండు గంటలు పోగా, రోజులో మిగతా 22 గంటలూ నా కాలక్షేపం ఒక్కటే. నిద్రపట్టే వరకు ‘నమఃశివాయ... నమఃశివాయ’ అంటుంటాను. అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నా అంటూనే ఉంటాను. మళ్లీ ఈ విషయాలేవీ ఆలోచించను. జపం ఒక్కటే చేస్తాను. అన్ని విషయాల గురించి, రోజంతా ఆలోచిస్తే గుండెకు పట్టేస్తుంది. భగవంతుడు నాకు వాక్‌శక్తి ఇచ్చాడు. సమయం ఇచ్చాడు. నా ప్రయత్నం నేను చేస్తాను. వినేవారు వింటారు. ఎవ్వరూ వినడం లేదని మానేయడం తప్పే! అలాగని ఇది పరమకర్తవ్యమని ఇరవై నాలుగు గంటలూ ఇదే ఆలోచించడమూ తప్పే! అదే మనం హనుమంతుడి నుంచి నేర్చుకోవాలి. అనవసరపు ఆలోచనలే బుర్రను పాడు చేస్తాయి. అనవసరపు మాటలు మనతో పాటు ఎదుటివాడిని పాడు చేస్తాయి. అనవసరపు పనులు లోకాన్ని కూడా పాడు చేస్తాయి.
ప్రస్తుతం రకరకాల పంటలు పండించి, భూదేవిని ఎంత బాధపెడుతున్నామో తెలియంది కాదు. ‘‘ఒకటియె, రెండె, మూడెయని ఉక్కిరిబిక్కిరి చేసి శక్తి చాలక
విలపింపగా ఎరువులను బెలిపించి భూమినెల్ల మీరు కలుషితంబొనర్చిరి
ఇది లోకువగా క్రిమికీటకములున్‌ పకపక నవ్వి మీ కలల పంటలు మ్రింగవె చూచుచుండగా’’ ఒకటి, రెండు, మూడు పంటలు అని అత్యాశకు పోయి భూమిని పిండేస్తే ఎక్కడి నుంచి వస్తాయి పంటలు! రకరకాల పంటలు వేసి, రకరకాల ఎరువులు వేసి భూమిని కలుషితం చేస్తున్నారు. సారం లేకపోయినా పండాలి అని కృత్రిమ సారం వేసి పండించేందుకు ప్రయత్నిస్తున్నారు. రకరకాల ఎరువులు వాడటం వల్ల క్రిమికీటకాలు పెరిగాయి. దీనివల్ల పంట పండకుండా పోతుంది. ఇదెంత దారుణం!

చూసి నేర్చుకుందాం!
‘కశ్చితర్థం వినిశ్శిత్య
లఘుమూలం మహోదయమ్‌
క్షిప్రమారభసేకర్మ
న దీర్ఘయసి రాఘవ’
ఈ పద్యానికి అర్థం ఇది. ‘‘ముందు డబ్బుందో, లేదో చూసుకోవాలి. ఎవరినో మభ్యపెట్టడానికో, సంతోషపెట్టడానికో పని చేయకూడదు. వాస్తవంగా రూపుదాల్చడానికి సరిపడే డబ్బుందా, లేదా చూసుకోవాలి. తరువాత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించేలా ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడు పని వెంటనే మొదలుపెట్టాలి. మొదలుపెట్టిన పనిని దీర్ఘకాలం కొనసాగించాలి’’.
విజయానికి రెండే మార్గాలు. ఒకటి- కష్టపడటం, రెండోది - మనసు నిష్కల్మషంగా ఉండటం. శారీరకంగా కష్టపడాలి. మనసు నిష్కల్మషంగా ఉండాలి. అందులో భగవంతునికి తప్ప మరొకరికి స్థానం ఉండకూడదు. స్వార్థం ప్రవేశించకూడదు. ‘దీంతో నాకేమి లాభం?’ అన్న స్వార్థం పోయినపుడే ఈ దేశం బాగుపడుతుంది. శ్రద్ధగా పునర్నిర్మాణం చేయడం, ఒక జాతి తనకు తాను పునర్నిర్మాణం చేసుకోవడం ఎలాగో ఇజ్రాయిల్‌ దేశాన్ని చూసి నేర్చుకోవాలి.
‘వ్రాలిరి సాహసంబున అరబ్బుల మధ్యన యూదు వారు
నాజీల దురాగంతబులకు చీలక జాతి పునర్విధాతలై
గాలియు, నీరు స్వచ్ఛమనగా లభియించని బీడు నేలనన్‌
రాళ్లను తీర్చిదిద్దిరట రత్నములట్లు రహస్యమేమిటో!’
విజయగాథ అంటే ఇజ్రాయిల్‌ వారిదే! శత్రువుల మధ్యలో ఉన్నారు. చుట్టూ అరబ్బులే. వీళ్లు క్రైస్తవులు. ఇజ్రాయిల్‌ ప్రజలకు ఎంత చిత్తశుద్ధి అంటే మొండిగా, బండగా కృషి చేశారు. ఎన్ని సమస్యలొచ్చినా ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో చాలా కటువుగా వ్యవహరించారు. మెత్తబడలేదు. మంచివాళ్లుగా ఉండొచ్చు. మెత్తగా ఉండకూడదు. ఇజ్రాయిల్‌ దేశస్థులు, అక్కడి ప్రభుత్వం కఠినంగా ఉన్నారు. వాళ్ల దేశంలోకి ప్రవేశించడానికి ఒక్క ఉగ్రవాదికి కూడా అవకాశం ఇవ్వలేదు. అందుకే నిలబడ్డారు! మన రాష్ట్రంలో ఒక జిల్లా విస్తీర్ణంలో ఉంటుందా దేశం. అది శక్తిమంతమైన దేశంగా నిలబడిందీ అంటే ఆ దేశాన్ని చూసి మనం నేర్చుకోవద్దా! రెండో ప్రపంచయుద్ధంలో వారికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ యూదుల మీద నాజీల దౌర్జన్యం తెలియంది కాదు. యూదులు కనబడితే చాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించే వారు. అలాంటి బాధలన్నింటిని తట్టుకుని జాతిని పునర్నిర్మాణం చేసుకున్నారంటే ఎంత గొప్పవారండీ ఇజ్రాయిలీలు.
‘నీళ్లకు నోచనట్టి దయనీయ పరిస్థితి బట్టి
నేరుగా వేళ్లకు నీళ్లనిచ్చెడి వివేకము
నీటిని మూటగట్టి పందిళ్లనమర్చె పంటలకు
నిండిన కుక్షి రవంత పంట నాలుగిళ్లకు పంచిపెట్టెను
ఫలింపవె సత్‌కృషి చిత్తశుద్ధియున్‌’
అక్కడ నీళ్లు లేవు, నదులు లేవు. వర్షాలు పడవు. ఉన్న నీటిని పొదుపుగా వాడాలి. అందుకోసం నీరు నేరుగా మొక్క వేరుకు అందితే చాలు కదా అని ఆలోచించారు. దాన్నే ‘బిందు సేద్యం’ అన్నారు. మనం నేర్చుకున్నదీ అక్కడి నుంచే! వాళ్లు పంటకు పందిరేసి రక్షించారు. వాళ్ల కడుపు నిండిన తరువాత పండిన పంటను నలుగురికీ పంచారు. అనేక రకాల పంటలను ఎగుమతి చేస్తున్న దేశాల్లో ప్రథమ స్థానాల్లో ఉంది ఇజ్రాయిల్‌. వాళ్లకు చిత్తశుద్ధి ఉంది. ఇంట్లో అందరూ కష్టపడతారు. మన దగ్గర ఒక్కరు కష్టపడితే నలుగురు కూర్చొని తింటారు. ఇజ్రాయిల్‌ దేశంలో నీరు వృథా చేస్తే ప్రభుత్వ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి.
‘చుక్కనీరు పోవ క్షోభింతురక్కడ
ఇక్కడబ్ధులైన లెక్కలేదు
ఔనులెండు! మీరు అంగారక గ్రహమందు
నీరు తెచ్చుకుందురేమో!’
కుళాయిలో నుంచి నీరు పడుతుందీ అంటే ఒక్క చుక్క నీరు కూడా వృఽథా పోకుండా చూసుకోవాలి. నీరు వృథా అయిందీ అంటే మనం అసమర్థులం కింద లెక్క. నీటిని ఒడిసిపట్టి తాగాలి. ఒక్క బియ్యం గింజ నేల రాలినా నష్టం కింద భావించాలి. ఇళ్లలో నీటిని పొదుపుగా వాడకపోతే దేశానికి ద్రోహం చేసినట్టుగా భావించాలి. అప్పుడు మనం ప్రతి వస్తువునూ జాగ్రత్తగా చూసుకుంటాం.
- డా. గరికిపాటి నరసింహారావు



ఊగిసలాడకు నేస్తం!
జీవితం ఆందోళనాభరితం అవుతోందని ఎప్పుడూ కంగారు పడకూడదు. ఆందోళన అంటే ఊయల ఊగడం. జీవితంఅనేది ఊయల లాంటిది. అరుగు లాంటిది కాదు. ఊగడానికి సిద్ధపడిన వాడే ఊయల ఎక్కుతాడు. సిద్ధంగాలేని వాడు అరుగు మీద కూర్చుంటాడు. అరుగు ఊగమన్నా ఊగదు. ఊయల ఆగమన్నా ఆగదు. ఊయల ఒకసారి అటూ ఇటూ వెళ్లినట్లే జీవితంలో ఎత్తు పల్లాలు, లాభ నష్టాలు, జయాపజయాలు అన్నీ ఉంటాయి. దాన్ని ఆస్వాదించగలగాలి. ప్రతి ఓటమి వీరుడు ధరించే ఆభరణం. ఓడిపోయినందుకు బాధపడనక్కర్లేదు. ఓటమి చెందానని చెప్పుకోవడానికి సిగ్గుపడనక్కర్లేదు. అది గొప్ప అనుభవం. గెలిచిన వాడు పొందే ప్రయోజనం కంటే ఓడిన వాడు పొందే ప్రయోజనాలు ఎక్కువ. ఎందుకు ఓడిపోయాడో మరింత పరిశోధన చేస్తాడు. ఆ పరిశోధన అనేక రంగాల్లో ఉపయోగపడుతుంది. ఎప్పుడూ గెలవడం అలవాటు పడిన వాడు దేని మీద దృష్టిపెట్టడు. వరుస విజయాలు రావడం కూడా జీవితంలో ఎప్పుడూ మంచిది కాదు. జీవిత నిర్మాణంలో ఆందోళన ఒక భాగం. ఈ ఆందోళనలో ఎప్పుడూ సుఖాలే కావాలి. శుభాలే కావాలి అనుకోవడం వల్ల మరింత ఆందోళన పెరుగుతుంది. దానికితోడు వాస్తు, జ్యోతిష్యం, అంకెల పేరు చెప్పి మరింత భయపెట్టే వారు ఎక్కువయ్యారు. ‘‘తాటంక యుగళీ భూత తపనో ఉడుప మండల’’ తపనమండలం అంటే సూర్యమండలం, ఉడుప మండలం అంటే చంద్రమండలం. ఈ రెండు యుగళములు అంటే జంట. లలితాసహస్రనామంలో బ్రహ్మాండపురాణంలో వ్యాసమహర్షి చెబుతాడు.
ఒక చెవికమ్మ సూర్యమండలం, ఒక చెవికమ్మ చంద్రమండలం. నవగ్రహాల్లో ఈ రెండింటిని మించిన వారు లేరు. ఆ రెండు అమ్మవారికి ఆభరణాలు. అలాంటి అమ్మవారిని స్మరిస్తుంటే సూర్యుడు, చంద్రుడు, మిగతా గ్రహాలన్నీ మనజోలికి రాకుండా ఆవిడ చూసుకోదా! అందుచేత ఏ దశ నడుస్తోంది, అందులో అంతర్దశ ఏమిటి... ఇవన్నీ పట్టించుకోకుండా అమ్మ వారిని స్మరించుకోవాలి. ‘శ్రీమాత్రే నమః’ అని భగవన్మామస్మరణ చేసుకుంటే చాలు.
దినదినము ఆందోళన చెందకుండా ఉండాలంటే భగవంతుణ్ణి నమ్ముకోవడం, ప్రకృతి పరంగా మనం ఎలా ఉండాలో అలా ఉండటం, పర్యావరణ రక్షణకు అన్ని చర్యలు తీసుకోవడం చేస్తే చాలు. మనదేశంలో ఉన్న పెద్ద వ్యాధి ఏంటంటే ‘నేనొక్కణ్ణే చేస్తే అవుతుందా?’. దీన్ని ముందు మానుకోవాలి. మనం ఒక్కరం చేసినా అవుతుంది. నీటి పొదుపు కోసం మన పూర్వీకులు అనుసరించిన అద్భుతమైన పద్ధతులు. ‘భూర్భువ మంత్ర కోవిదులు భూమి రహస్యమెరింగినారు భూగర్భతటాకముల్‌ నిలిపి కాచిరి నీరములు ఆవిరంటకన్‌ దర్భశిఖాగ్రబుద్ధులు సుధా మధురైక మనస్కులు ఈ భువిన్‌ గర్భిణివోలె చూచిరి ఒకప్పుడు నీరసమావహింపకన్‌’ ఇప్పుడంటే నీరు ఎక్కడ పడుతుందో యంత్రాల ద్వారా తెలుసుకుంటున్నారు.
కానీ ఒకప్పుడు మంత్రజపం బాగా చేసే సిద్ధపురుషులు కేవలం చూసి చెప్పేవారు. వేసవికాలంలో నీరు ఉపయోగిస్తుందని భూగర్భంలో తటాకాలు నిర్మించి నీరు నిలువ చేశారు. దర్భం అంటే గడ్డి. దర్భశిఖాగ్ర అంటే గడ్డి కొన భాగం. దర్భశిఖాగ్రం ఎంత షార్ప్‌గా ఉంటుందో అలా ఉండే వారు. కుశాగ్రబుద్ధి ఉన్న వాళ్లు కాబట్టి ప్రశ్నించారు. ప్రయోజనాలు అందరికీ అందేలా చేశారు. ఒక గర్భిణిని ఎలా చూసుకుంటారో అలా భూదేవిని చూశారు. ఎప్పుడూ నీరసం రాకుండా. నీరసం అంటే నీళ్లు లేకుండా అయిపోవడం. అలా చూసుకున్నారో కాబట్టి నిలబడ్డాయి. ఇప్పుడు భూగర్భతటాకాలు పక్కన పెడితే పైనున్న తటాకాలు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని అందరూ ఆలోచించాలి.
డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు

మన వేగమె... మన శత్రువు!
వేగము వేగమందురు అభివృద్ధికి వేగమొకండు చాలునా!
ఈ వేగమె జీవితాన సుమ వీక్షణముల్‌ హరియించి
నిత్యము ఉద్వేగము తప్ప వేగము దివిన్‌ భువి దించినదేమి
ముందుకున్‌ సాగుచుండెను చూడుము అగచాట్లు అభివృద్ధియు తోడునీడగా!
వేగం, వేగం అని కొట్టుకుపోతున్నారు. సెల్‌ఫోన్‌లో ఇంకా వేగవంతమైన నెట్‌వర్క్‌ అని ఊదరగొడుతున్నారు. కొండ మీదున్నా సరే, అడవిలో ఉన్నా సరే... మా నెట్‌వర్క్‌ ఉంటుందని అంటున్నారు. అంత అవసరమా? మా ఫోన్‌ కొనండి, నరకంలో కూడా పనిచేస్తుందని అంటున్నారు. ఎట్లాగూ కొన్నాక నరకమే! తప్పదు! వై-ఫై ప్రతిచోటా అవసరమా? ఏం... వై-ఫై లేకుండా ఉండలేమా ఒక గంటసేపు.
ఇవ్వాళ నెట్‌ పనిచేయకపోతే ఊపిరి లేనట్లుగా అయిపోతోంది పరిస్థితి. అంత అవసరం మనమే చేసుకున్నాం. ఆ నెట్‌తో అంత సంబంధం లేకుండా బతుకుతున్న చాలా పెద్దవాళ్లం మేం ఉన్నాం. నేను సాహిత్యరంగంలో ఉన్నాను. వ్యాపారరంగంలో ఉన్న వాళ్లు కూడా చెబుతున్నారు... అంత అవసరం లేదని!
ఈ మధ్య కుర్రాళ్లను చూడండి. ఎవ్వడూ తలెత్తడు పైకి! మనం వినయం అనుకుంటాం. చేతిలో ఫోన్‌ పట్టుకుని అందులో తల దూర్చేస్తాడు. ఇక ఈ జన్మకి తల పైకెత్తడు. బొడ్డూడని సన్నాసి కూడా ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్‌ పెట్టే వాడయ్యాడు. ప్రపంచజ్ఞానం లేదు గానీ కామెంట్స్‌ చేస్తాడు. సామాజిక మాధ్యమాల కారణంగా ఏ వార్తనూ నమ్మలేని పరిస్థితి తయారయ్యింది. చివరకు ‘నాన్నా పులి వచ్చింది’ కథలా తయారవుతోంది. ప్రజలందరి విషయాలపైన మాట్లాడారంటే అర్థముంది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం ఎందుకు? వాళ్లకూ జీవితం ఉంటుంది కదా! వాళ్ల మనసు క్షోభిస్తుంది కదా! వాళ్ల పట్ల సామాజిక మాధ్యమాల్లో అంతగా స్పందించడం ఎందుకు?
ఒక పువ్వుకేసి కన్నార్పకుండా ఐదు నిమిషాలు చూడగలరా? ఒకవేళ బలవంతంగా చూసినా మెదడు నిండా గందరగోళమైన ఆలోచనలు. మనం అక్కడే భగవంతుణ్ణి కోల్పోయాం. అందమైన పువ్వును చూడమంటే ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయని అడుగుతాం. లేదంటే ‘నువ్వు నిల్చో! నేను ఫొటో తీస్తాను!’ అని సెల్‌ఫోన్‌ తీస్తాం. ప్రతి సుందరమైన దృశ్యంలో మనం ఉండాలా? దాన్ని చెడగొట్టడానికి? ఆ పువ్వును పువ్వుగా చూడలేమా? మనం దిగిన ఏ ఫొటో అయినా సరే అందులో మనల్నే చూస్తాం. ఆ ఫొటోలో తాజ్‌మహల్‌ ఉన్నా చూడం. అహం అంటే అదే! మనం రమణమహర్షి కనిపిస్తే సెల్ఫీ దిగాలని చూస్తాం. పెద్దల పట్ల మనకు గౌరవం ఉంటే ఆయన పక్కన నిలుచోనక్కర్లేదు. పై పై విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రవచనాలను పక్కన పెట్టేశాం.
వేగం స్వర్గాన్నేమైనా భూమి మీదకు దించిందా? వేగం కారణంగా ఉద్వేగం పెరిగింది అంతే! పాతికేళ్ల కర్రాళ్లకు గుండెపోటు వస్తోందీ అంటే వేగం, ఉద్వేగం కారణం కాకపోతే మరేమిటి? వేగం వల్ల అభివృద్ధి ఒక్కటే కాదు అగచాట్లు కూడా వచ్చాయి. క్రెడిట్‌ కార్డు రావడం వల్ల సౌకర్యం పెరిగింది. డబ్బు వెంట తీసుకెళ్లాల్సిన పని లేదు. కానీ, ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియదు. కార్డు ఉంది కదా వాడేస్తాం... డబ్బు కట్టాల్సి వచ్చినపుడు తెలుస్తుంది. అదే పర్సులో వందరూపాయలు ఉంటే చూసి ఖర్చు పెట్టుకుంటాం. అదెంత సౌఖ్యం. ఈ రోజు పిల్లలకు కూడా కార్డులు, వాటి పాస్‌వర్డ్‌లు చెప్పేస్తున్నారు తల్లితండ్రులు. ఇదెంత ప్రమాదం. లక్షలు ఫీజులు కట్టి కార్పోరేట్‌ స్కూళ్లలో చేర్పిస్తే, వాళ్లు వేలు పెట్టి ‘లిక్కర్‌ చాక్లెట్లు’ కొనుక్కుంటున్నారు.
మత్తుమందుల వ్యవహరం బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. పరిస్థితి ప్రమాదకరంగా మారింది. తొమ్మిదో తరగతి పిల్లాడు ‘నిన్న రాత్రి గొప్ప అనుభూతి పొందా! ఈ రోజు మళ్లీ కావాలి’ అని డ్రగ్స్‌ అమ్మే వాడికి మెసేజ్‌ ఇస్తాడా? ఇదా చదువు! ఒక్కరా, ఇద్దరా, పదిమందా కాదు. ఇది అంటువ్యాధిలా విస్తరిస్తోంది. ఎవరు, ఎవరినీ అదుపు చేయలేని సమాజం వస్తే ఎలా? కచ్చితమైన నిగ్రహం, అదుపు ఉండాల్సిందే. ఎవ్వరు ఏమనుకున్నా సరే. అప్పుడే కుటుంబమైనా, దేశమైనా నిలబడుతుంది.
అత్యవసరమైతే తప్ప మన జీవితంలోకి వేగం అనే దాన్ని రానివ్వకూడదు. సావకాశంగా ఆస్వాదించడం, సావకాశంగా భోజనం చేయడం, సావకాశంగానే నిద్రపోవడం, సావకాశంగానే అర్థం చేసుకుంటూ ఒక పుస్తకం చదవడం... ఇవన్నీ అవసరం. దేవుని పూజ కోసం ఒక్క గంట కేటాయించలేరా? అన్నీ పారాయణం చేయాల్సిన పనిలేదు. సావకాశంగా ఒక్కటి చదవండి చాలు.
-డా. గరికిపాటి నరసింహారావు

కురవాల్సింది జ్ఞానవర్షం!
సంచుల్‌ పెట్టెల నిండ శాస్త్రముల్‌, విజ్ఞానంబుల్‌ మూల్గుచున్‌
వచింపింపబడె శుష్క హస్తములతో, వాగ్దాన వర్షంబుతో
పంచాంగంబున వర్షపాతమని చెప్పన్‌ నేల దున్నింతుర
పంచాంగంబును పిండుకునుచు దినముల్‌ వ్యర్థంబుగా పుత్తుర

పంచాంగంలో ‘కురుస్తుంది వాన’ అని పంచాంగం పిండినట్టుగానే మనం పుస్తకాలు పిండుతున్నాం. అది పారాయణం చేస్తే వానలు కురుస్తాయి. ఇది పారాయణం చేస్తే పంటలు పండుతాయి అంటాం. శాస్త్రీయంగా దాన్ని నిరూపణ చేయలేం. విరాటపర్వం చదివితే కచ్చితంగా వానలు పడతాయి. ఎలా పడతాయి? అందులో లక్షణాలు చెప్పాడు. మనుషులు ఎలా ప్రవర్తిస్తే వానలు పడతాయో చెప్పాడు. విరాటపర్వం మొత్తం మీద అటు వ్యాసభారతంలోగానీ, ఇటు తెలుగు తిక్కనగారి భారతంలో గానీ విరాటపర్వం చదివితే వానలు కురుస్తాయన్న మాట ఎక్కడా పద్య రూపంలో గానీ, గద్యరూపంలో గానీ చెప్పలేదు. మనం పుట్టించుకున్నాం ఆ మాట. సంప్రదాయంలో ఓ నమ్మకం కింద వచ్చింది. నమ్మకం నమ్మకమే! దాన్ని విశేషమైన మహిమ కింద ప్రచారం చేస్తే ప్రజలు మూర్ఖులు అవుతారు.

మనుషులు కొన్ని లక్షణాలు కలిగి ఉంటే, ప్రకృతిని ప్రేమిస్తే, పర్యావరణాన్ని కాపాడితే, నీటి పొదుపును పాటిస్తే, పంటలు పండించడంలో అన్ని నియమ నిష్ఠలు ఉంటే కచ్చితంగా వర్షాలు కురుస్తాయి. ఆ లక్షణాలే మహాభారతంలోని విరాటపర్వంలో చెప్పాడు భీష్ముడు దుర్యోధనునికి. అలాంటి లక్షణాలన్నీ ధర్మరాజులో కనిపిస్తాయి. విరాటపర్వం చదివితే ఆ లక్షణాలన్నీ అవగాహన చేసుకుంటామనీ, చేసుకుంటే అన్వయం చేసుకుని పాటిస్తామనీ అలా చెప్పారు.
వానలు కురుస్తాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడటానికి కారణమైన మరో పద్యం ఏమిటంటే... కంకుభట్టుగా అజ్ఞాతవాసంలో ఉన్న ధర్మరాజును విరాటరాజు పాచికతో కొడతాడు. అప్పుడు ద్రౌపది అతని నెత్తుటి బొట్టు కింద రాలకుండా చీర కొంగు చించి, కట్టు కడుతుంది. అది చూసి విరాటరాజు ఆశ్చర్యపోతాడు. అప్పటికి ఇంకా పాండవుల అజ్ఞాతవాసం ముగియలేదు. అది బయటపడే ప్రమాదం ఉంది. అప్పుడు ద్రౌపది వెంటనే అంటుంది.
‘‘విమల వంశబునను, పుణ్యవృత్తమునను
వరలు నీతని రక్తము వసుమతీశా!
ధరణిపై ఎన్ని బిందువులు దొరలెనో
అన్ని వర్షములు కలుగు ఇంద నా వర్ష భయము’’
‘ఇతనిది చాలా నిర్మలమైన వంశ పరంపర. ఇతని ప్రవర్తన చాలా గొప్పది. ఇతని రక్తంలో సత్యం, ధర్మమే ఉన్నాయి. ఇటువంటి మహానుభావుని రక్తం ఎన్ని బిందువులు నేల మీద రాల్తాయో, అన్ని ఏళ్లు వర్షం పడదు. అందుకే నేను నెత్తురు నేల మీద పడకుండా అడ్డుకున్నా. మాకు ఆశ్రయం ఇచ్చిన మీ రాజ్యం బాగుండాలి’ అన్నది ద్రౌపది మాట! విరాటపర్వం జ్ఞానం కోసం చదవాలి. వర్షం కోసం కాదు. విరాటపర్వం చదివితే జ్ఞాన వర్షం కురుస్తుంది. 
- డా.గరికిపాటి నరసింహారావు

మంచిగా ఉండు! మెత్తగా ఉండకు!!
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతమ్‌
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్‌
భగవద్గీత యుద్ధం మధ్యలో పుట్టింది. అయితే బలవంతంగా యుద్ధం చేయమని చెప్పలేదు శ్రీకృష్ణుడు. అలాగని నోరు మూసుకుని కూర్చొమ్మని చెప్పలేదు. ‘‘అర్జునా! ఈ యుద్ధం నీ ప్రయత్నం లేకుండా వచ్చి పడింది. నీ ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా, మీరు వద్దనుకున్నా వచ్చి పడింది యుద్ధం. కాబట్టి స్వర్గద్వారం తెరుచుకుని ఉందనుకుని యుద్ధం చేయి. జయిస్తే ఇహలోకంలోనే స్వర్గభోగాలు అనుభవిస్తావు. మరణిస్తే వీర స్వర్గం ఖాయం. యుద్ధం చేయడానికి ఏ మాత్రం సంకోచించొద్దు’’ అని హితబోధ చేశాడు.కౌరవపాండవుల యుద్ధానికి దుర్యోధనుడే కారణం. తప్పనిసరై పాండవులు యుద్ధం చేయాల్సి వచ్చింది.

మనంతట మనం కయ్యానికి కాలు దువ్వకూడదు. కార్యాలయంలో గానీ, ఇంట్లో గానీ, సమాజంలో గానీ, ఏ రంగంలో ఉన్నా... మనంతట మనం దెబ్బలాట పెట్టుకోకూడదు. కానీ, మనం ఎంత చెప్పినా వినకుండా జుట్టు పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే సంగతేంటో తేల్చుకోవాల్సిందే! అలా లేకపోతే ధర్మం ఓడిపోతుంది. దర్మం లోకువ అవుతుంది. ధర్మాత్ములు భయపడిపోతున్నారు. మంచి వాళ్లు మెత్తని వాళ్లయిపోతున్నారు. మనిషి మంచి వాడిగా ఉండాలి. మెత్తని వాడిగా ఉండకూడదు. అక్కడే లౌక్యం ప్రదర్శించాలి.
ఎంత ప్రయత్నం చేసినా మన చుట్టుపక్కల ఉన్న గ్రహాలను చూసుకోకపోతే మనం చెడిపోతాం. మనల్ని ముగ్గులోకి లాగేస్తారు. భర్తృహరి సుభాషితాలను తెలుగులోకి అందించిన ఏనుగు లక్ష్మణకవి ఎవరు ఎవరివల్ల చెడిపోతారో పద్యంలో ఇలా చెబుతున్నాడు.
యతి సంగంబున, బాలుడాదరముచే జ్యాభర్త దుర్మంత్రిచే
శ్రుతిహానిన్‌ ద్విజుడు అన్వయంబు ఖలుచే క్రూరాప్తిచే శీలము
ఉద్ధతిచే మిత్రత చూపులేమి కృషి మద్యప్రాప్తిచే సిగ్గు
దుర్మతిచే సంపదల్‌ నశించున్‌ చెడు నర్థంబుల్‌ ప్రమాదంబునన్‌
సన్న్యాసులు, పీఠాధిపతులు సాంగత్యానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు. పిల్లలు గారాబం వల్ల చెడిపోతారు. రాజు సరైన మంత్రి లేకపోతే చెడిపోతాడు. విద్యార్థి చదవకపోతే చెడిపోతాడు. దుర్వ్యసనం కలిగిన ఉన్న వారు వంశంలో ఒక్కరున్నా ఆ వంశం నాశనమవుతుంది. ఎంత మంచి వాడైనా చెడు స్నేహం వల్ల చెడిపోతాడు. గర్వం, అహంకారం వల్ల స్నేహం చెడిపోతుంది. సరిగ్గా చూసుకోకపోతే పంట దెబ్బతింటుంది. తాగడం వల్ల సిగ్గు లేకుండా ప్రవర్తిస్తారు. దుష్ట ఆలోచనల వల్ల సంపదలు మొత్తం నశిస్తాయి. అజాగ్రత్త వల్ల డబ్బులు పోతాయి. చేతిలో డబ్బులున్నాయి కదా అని వెనకాముందూ చూసుకోకుండా ఖర్చు పెడితే ముఖ్యమైన సమయాల్లో దిక్కులు చూడాల్సి వస్తుంది. ఈ విషయాలను గ్రహించగలిగితే ఎవ్వరూ పరిస్థితుల వల్ల చెడిపోయే అవకాశం ఉండదు.
-డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు




జీవితం ఒక చలనచిత్రం
దుఃఖాన్ని సంపూర్ణంగా పోగొట్టేలా శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత రెండో అధ్యాయంలో ఎంత చక్కగా చెబుతున్నారో చూడండి.
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత
అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా
ఈ పద్యానికి భావం అర్థం కావాలంటే సినిమా తెర అర్థం కావాలి. తెర మీద సినిమా పడటం, మళ్లీ అయిపోవడం... ఇది అర్థం అయితే చాలు, ఈ పద్యం అర్థమవుతుంది. అప్పుడు మనం దుఃఖపడం. ప్రపంచమంతా ఒక మాయా స్వరూపం. ఈ మాయలో భాగంగా మన పనేదో మనం లీలా వినోదంలా హాయిగా చేస్తే సరిపోతుంది. ఈ ప్రపంచంలో జీవులు వ్యక్తమవుతున్నాయి కానీ, వాటి అసలు స్థితి అవ్యక్తం. ఉండటం వేరు, వ్యక్తం కావడం వేరు. ఒక పెద్దమనిషి ఇంటికి వెళ్లాం. ఆయన హాల్లో కనిపించారు. అంటే వ్యక్తమయ్యారు. అదే లోపలి గదిలో ఉన్నాడనుకోండి. ఉన్నాడా, లేదా మనకు తెలియదు. దీన్నిబట్టి ఉన్నది వ్యక్తం కాని పరిస్థితి కూడా ఉంటుంది. అదే మనకు దేవాలయం. పరమాత్మ అంతటా ఉంటాడు. దేవాలయంలో మాత్రమే వ్యక్తమవుతాడు. ఆ వ్యక్తమవడమే విగ్రహం. వైరులో విద్యుత్‌ ప్రవహిస్తుంటుంది. దానికి బల్బు పెట్టినప్పుడే వ్యక్తమవుతుంది. బల్బు లేకపోతే అక్కడ విద్యుత్‌ లేదంటే ఎలా?
అవ్యక్తం నుంచి ఇవన్నీ వచ్చే వ్యక్తమవుతున్నాయి.
మధ్యలో ఊరికే వ్యక్తమవుతున్నాయి. చివరకు మళ్లీ దాన్లోనే కలిసిపోతున్నాయి. అందుకే ఎవరో చనిపోయారని బాధపడటం ఎందుకు? ఇంతకు ముందు వాళ్లు లేరు. మధ్యలో వచ్చారు. మళ్లీ పోయారు. ఈ విషయం అర్థం చేసుకుంటే మరణం గురించి భయపడం.సినిమా వేయకముందు తెర అవ్యక్తం. సినిమా దాని మీద వ్యక్తం. రెండున్నర గంటలు కాగానే సినిమా మళ్లీ అవ్యక్తం. ఆ తెరయే భగవంతుడు. ఆయన మీద పడిన సినిమాయే ఈ ప్రపంచం. సినిమా శాశ్వతం కాదు. తెర శాశ్వతం. ప్రపంచం శాశ్వతం కాదు, భగవంతుడు శాశ్వతం. జీవితం ఒక చలనచిత్రం లాంటిది. జీవిత ఘట్టాలు చలనచిత్రంలో జరిగే ఘట్టాలే. అంత తేలిగ్గా జీవితాన్ని తీసుకోవాలి. మరి జీవితం చలనచిత్రం అయితే నిశ్చలన చిత్రం ఏదంటే అది ఆత్మ. ఆ ఆత్మకేసి చూసినపుడే మనకు ఇది చలనచిత్రం అర్థమవుతుంది. అందుకే శంకరాచార్యుల వారు ఇలా అన్నారు.
‘సత్‌సంగత్వే నిసంగత్వం నిసంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః’
చేస్తున్న పనిపై దృష్టి పెట్టడం చాలా అవసరం. దీనికి నిశిత దృష్టి అవసరం. నిశిత దృష్టికి వయసుతో పనిలేదు. భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణ కవి ఒక పద్యంలో ఇలా చెపుతున్నాడు.
‘విదలింప నురుకు సింగపు
గొదమయు మదమలిన గండ కుంజరములపై
నిది బలశాలికి నైజము
గద తేజో నిధికి వయసు కారణమగునే’
తేజోవంతులు, పరాక్రమవంతులు బలప్రదర్శన చేయడానికి వాళ్ళ వయసుతో పనిలేదు. ఉదాహరణకు... ఒక సింహం అప్పుడే సింహం పిల్లను ప్రసవించింది. ఆ సింహం పిల్ల ఆ సమయంలో దగ్గరలో ఏనుగు ఉంటే కనుక దాని కుంభస్థలంపై దూకుతుంది. పైగా అది మామూలు ఏనుగు కాదు. మదించిన ఏనుగు. మదించిన ఏనుగు చెక్కిళ్ల నుంచి ఒక రకమైన ద్రవం స్రవిస్తూ ఉంటుంది. ఆ ద్రవం తేనెలా ఉంటుంది. కానీ తేనె కాదు. దాన్ని మదం అంటారు. అలా మదించిన ఏనుగుపైకి సింహం పిల్ల కూడా దూకుతుంది. అది పరాక్రమవంతుల స్వభావం.
మనం పిల్లలను అలా సింహం పిల్లల్లా పెంచాలి. వాళ్లలో సొంత తెలివితేటలను పెంచాలి. అదే సమయంలో వినయాన్ని నేర్పించాలి. అయితే పిల్లలను వాళ్ల ఎదురుగుండానే పొగడకూడదు.
ప్రత్యక్షే గురవస్తుత్యాః
పరోక్షే మిత్రబాంధవాః
కార్యాంతే దాసభృత్యాశ్చ
పుత్రస్తు న కదాచన
తల్లితండ్రులు ఈ సూత్రం పాటించాలి. గురువును ముఖం మీదే పొగడొచ్చు. తప్పులేదు. మిత్రులను, బంధువులను ముఖం మీదే పొగడకూడదు. పరాయివాళ్ల దగ్గర పొగడాలి. సేవకులను ముఖం మీద పొగడకూడదు. పరోక్షంగా కూడా పొగడకూడదు. అప్పగించిన పని పూర్తి చేసినపుడు మెచ్చుకోవాలి. ఇక కూతురును, కొడుకును ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎప్పుడూ పొగడకూడదు. దీర్ఘాయువుగా ఉండాలని ఆశీర్వదించాలి అంతే..!
-డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు


ఎప్పుడు నెగ్గాలో తెలియాలి




జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ
       తస్మా దపరిహార్యే2ర్థే నత్వం శోచితుమర్హసి

భగవంతుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. పుట్టిన ప్రతి వాడు చనిపోవాల్సిందే. చనిపోయిన ప్రతి ఒక్కడు మళ్లీ పుట్టాల్సిందే. అలాంటప్పుడు మరణం గురించి ఎందుకు ఏడవడం. నీ చేతుల్లో లేని దాని గురించి, నువ్వు ఆపలేని దాని గురించి ఎందుకు శోకించడం. అలాంటి సమయంలో భగవంతునిపై భారం వేసి నిశ్చింతగా ఉండు.

చాలా విషయాలు మన చేతుల్లో ఉండవు. ఉదాహరణకు కరెంటు పోయింది. ఏం చేస్తాం. వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. మనం అరిస్తే రాదుగా. కరెంటు పోయినపుడు పిల్లలను డాబాపైకి తీసుకెళ్లి నాలుగు మంచి మాటలు, కథలు చెబితే పిల్లలకు కొంచెం జ్ఞానమయినా వస్తుంది. ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కున్నప్పుడు అదే పనిగా హారన్‌ కొట్టకుండా భగవన్నామస్మరణ చేసుకోవాలి. ట్రాఫిక్‌ కదిలేలా చేయడం నీ చేతుల్లో లేదు కదా. అలా నీ చేతుల్లో లేని దాని గురించి నీవు ఆలోచించొద్దు. భగవంతునిపై భారం వేసి మౌనంగా ఉండాలి.

మన చేతుల్లో లేని విషయంలో భగవంతునిపై భారం వేసి మౌనంగా ఉండటం ఎంత ముఖ్యమో, మన చేతుల్లో ఉన్న వాటిలో, మనకు చేతనైన వాటిలో పరాక్రమం చూపించడం కూడా అంతే ముఖ్యం. చేయగలిగిన దాన్ని వదలొద్దు. చేయలేని దాన్ని పట్టుకుని వేలాడొద్దు. భార్యా పిల్లలపైకి, పనిచేస్తున్న సంస్థపైకి, తల్లితండ్రులపైకి ఎవరైనా భౌతికంగా దాడిచేయడానికి వచ్చారనుకోండి. ఊరుకోవద్దు. పరాక్రమించవలసిన పరిస్థితి నుంచి తప్పించుకోవడం పిరికి వాడి లక్షణం.

హిమవంతుడి కొడుకు చేసిన పనిని తప్పుపడుతూ భర్తృహరి సుభాషితాలను తెలుగులోకి అనువదించిన ఏనుగు లక్ష్మణకవి పద్యంలో ఇలా అంటున్నాడు.

‘‘సమధిక భీషణ జ్వలనజాల వినిర్గత దుస్సహంబుచే
సమదసురేంద్ర ముక్తకునిసుక్షతిచే
vuచితంబు ప్రాణఘాతము హిమవతకుమారునకు
తండ్రి నిశాతశతారపాతకేతమున మునుంగుచున్న తరి
తా జలరాశిజొరంగనర్హమే’’

అవసరమైనపుడు చేయవలసిన సహాయం చేయకపోవడం, అనవసర సమయాల్లో వచ్చి చేస్తున్న పనికి అడ్డం పడటం. ఇటువంటి వారిని పురాణాల్లో మైనాకుడు అంటారు. ఈ మైనాకుడు స్వయంగా హిమవంతుని కుమారుడు. పార్వతీదేవి కంటే పెద్దవాడు. మరి పార్వతీ దేవి జగన్మాత. చేయని సాహసం లేదు. మరి మైనాకుడు ఏం చేశాడు. ఇంద్రుడు వజ్రాయుధం చేత పట్టి రెక్కలు నరకడానికి వస్తుంటే తండ్రిని రక్షించాల్సిందిపోయి సముద్రంలో దాక్కున్నాడు. ఏ కుమారుడు తల్లితండ్రుల పట్ల అలా వ్యవహరించకూడదు.

వీటిని జాగ్రత్తగా గమనించినట్లయితే అవికాని విషయాల్లో దుఃఖపడొద్దు, ఆలోచించొద్దు. ఏమాత్రం అవకాశం ఉన్నా వదలొద్దు. అవసరమైన చోట పరాక్రమం చూపించకుండా ఉండొద్దు అనే విషయం అర్థమవుతుంది. అందుచేత మనం ఎటువంటి వాళ్లతో స్నేహం చేయాలి. ఎటువంటి వాళ్లతో కలిసి తిరగాలి అంటే... హనుమంతుని లాంటి వాళ్లతో స్నేహం చేయాలి. హిమవంతుని లాంటి వాళ్లతో స్నేహం చేయాలి. మైనాకుని లాంటి వాళ్లకు దూరంగా ఉండాలి. తెలివైన వాళ్లతో స్నేహం చేయాలి. కార్యశూరులైన వారితో స్నేహం చేయాలి. ముఖ్యంగా యువత ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంపద కోల్పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు.

సమయం కోల్పోతే మళ్లీ రాదు. సమయం చాలా తక్కువుంటుంది. కోల్పోయిన జ్ఞానాన్ని మళ్లీ పొందొచ్చు. కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్లీ తెచ్చుకోవచ్చు. కానీ సమయాన్ని కోల్పోతే మళ్లీ రాదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే జంగం జంగం రాసుకోవడం కాకుండా తెలివైన వాళ్లతో స్నేహం చేయాలి. జంగం జంగం రాసుకుంటే బూడిద రాలిందనేది నానుడి అయితే గుమాస్తా గుమాస్తా రాసుకుంటే గుండు సూదులు రాలాయనేది నూనుడి. మనకంటే కాస్త పైస్థాయి వ్యక్తులతో స్నేహం చేసి వారి నుంచి కర్తవ్యాలను తెలుసుకుని దేశం కోసం, ధర్మం కోసం, కుటుంబం కోసం కష్టపడాలి. హిమవంతుని కొడుకులాగా పరిస్థితుల నుంచి పారిపోకూడదు. అలాగే భగవద్గీతలో చెప్పినట్టుగా మన చేతిలో లేని విషయాల గురించి బాధపడకూడదు.                               -డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు




















మన శక్తిని తెలుసుకుందాం!

భ‌గవద్గీత రెండో అధ్యాయంలో శ్రీకృష్ణుడు మృత్యువును ఎంత తేలిగ్గా తీసుకోవాలో చెబుతున్నాడు. ఈవేళ ఆధునిక జీవనంలో మృత్యువును అంత తేలిగ్గా తీసుకోలేకపోతే మనం అడుగు ముందుకు వేయలేం. ఏ పనీ చేయలేం.
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ
అర్జునా! మాసిపోయిన బట్టలను మనం విడిచిపెడుతున్నాము. కొత్త బట్టలను వేసుకుంటున్నాము. అలాగే ఆత్మ పాత శరీరాన్ని వదిలి మరో కొత్త శరీరాన్ని వెతుక్కుంటుంది.
మరో జన్మలోకి మారడం కొత్త చొక్కా తొడుక్కున్నంత తేలికా అంటే తేలికే! గాలి పూలతోట మీద నుంచి వస్తే పుష్ఫ సుగంధాన్ని తీసుకొస్తుంది. మురికి కాలువ మీద నుంచి వస్తే దుర్గంధాన్ని తీసుకొస్తుంది. గాలికి ఈ లక్షణం ఉందని అర్థమయింది కదా! ప్రాణం పోయినపుడు బయటకు పోయేది గాలేగా! చనిపోయినపుడు ప్రాణం పోయింది అంటామే కానీ కాలు పోయింది, ఆత్మ పోయింది, మనసు పోయిందని అనము కదా. గాలికి దేని మీద నుంచి వెళితే దాన్ని మోసుకెళ్లే లక్షణం ఉంది.
అలాగే ప్రాణం పోయినపుడు కూడా గాలి ఒక గంధాన్ని మోసుకెళుతుంది. మనిషి పెంచుకున్న బంధాలు, ప్రేమలు, వాత్సల్యాలు మనసులో గట్టిగా పేరుకుంటాయి. మనసులో నుంచి అవి అంత సులభంగా పోవు. ఇవి వాసనల రూపంలో ఉంటాయి. ప్రాణం పోయినపుడు గాలి ఈ వాసనలను తీసుకెళుతుంది. ఈ వాసనల ప్రకారం ఈ మనస్సే మరో జీవుడై, మరొకరి శరీరంలో ప్రవేశిస్తుంది. వేదాంతపరంగా దీనికి ప్రక్రియ చాలా ఉంటుంది. వాసనలతో బయటకు వెళ్లిన మనస్సు ముందుగా నదిలో కలుస్తుంది. తరువాత ఆవిరవుతుంది. వర్షం కురుస్తుంది. ఆ నీటిని సిద్ధాంతం ప్రకారం ఎవరు తాగాలో వాళ్లే తాగుతారు.
అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లక్ష గోవులున్నా దూడ తన తల్లి దగ్గరకే వెళుతుంది. అలాగే ఏ జీవుడు చేసిన కర్మ ఆ జీవుని దగ్గరకే వస్తుంది. కొన్ని కోట్ల కర్మఫలాలు ఉన్నా ఎవడి కర్మ వాడికే చెందుతుంది. అందుకే కర్మ సిద్ధాంతం పక్కా! ఇంకో జన్మ పొందడం అదృష్టంగా భావించాలి.మనిషి మేఽధాశక్తి అన్నిటికన్నా శక్తిమంతమైనది. దాన్ని మనం వినియోగించుకోవాలి. ధీమంతుని శక్తి ఎంత గొప్పదో భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణ కవి ఒక పద్యంలో చెబుతున్నాడు.
‘‘భువనశ్రేణి వహించు శేషుడు ఫణా భోగంబుపై సంతతంబు
అవలీలన్‌ భరియించు పృష్టమున కూర్మాధీశ్వరుండాతనిన్‌
ధవళక్రోడవశాత్ముంజేయు నతనిన్‌ వారాసి అశ్రాంతిచేన్‌
ఔరా! ధీరచరిత్ర సంపదలు అసంఖ్యాత ప్రభావోన్నతుల్‌’’
మనుషుల్లో ఉత్సాహాన్ని నింపే పద్యం ఇది. నీకెంత శక్తుందో నీకు తెలుసా! ఎందుకు నీ శక్తిని తక్కువ అంచనా వేసుకుంటావు? ఒక చిన్న ఓటమి ఎదురుకావచ్చు. అంతమాత్రాన కుంగిపోవడం ఎందుకు? అటువంటప్పుడే మన శక్తిని మనం గుర్తు చేసుకోవాలి. ఆదిశేషుడు తన వేయిపడగలపై ఈ భూమండలాన్ని భరిస్తున్నాడు. కూర్మం ఆదిశేషుడితో సహా భూమండలాన్ని భరిస్తోంది. కూర్మం భరించలేని స్థితిలో కూర్మంతో సహా, ఆదిశేషుణ్ణి, భూమండలాన్నీ శ్వేత వరాహం భరించింది. ధీరుల చర్రితలు, మహానుభావుల శక్తిసామర్థ్యాలను అంచనా వేయడానికి మనం సరిపోం. అవి అసంఖ్యాకమైన ప్రభావం కలవి. మనల్ని భూమి భరిస్తోంది. మనల్నీ, భూమినీ ఆదిశేషుడు భరిస్తున్నాడు, మనల్నీ, భూమినీ, ఆదిశేషుణ్ణీ కూర్మం భరిస్తోంది. మనల్నీ, భూమినీ, ఆదిశేషుణ్ణీ, కూర్మాన్నీ వరాహం భరిస్తోంది. కాబట్టి మన శక్తిని మనం విశ్వసిస్తే గొప్పవాళ్లమయ్యే అవకాశం ఉంటుంది.





యుద్ధం చేయాల్సిందే!
అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః
అనాశినో ప్రమేయస్య తస్మా ధ్యుధ్యస్వ భారత.
అర్జునా! ఈ దేహాలన్నీ పోయేవే. నశించకుండా, కొలత కూడా లేకుండా, పరిమితి లేకుండా నిత్యం ఉండేది ఆత్మ మాత్రమే. కాబట్టి యుద్ధం చేయి. ఒక కార్యాలయం నడిపిస్తున్నా, సంసారం నడిపిస్తున్నా, ఒక ఉద్యోగం చేస్తున్నా ధర్మం కోసం మనం యుద్ధం చేస్తూనే ఉండాలి.
భగవద్గీత ప్రశాంతంగా ఇంట్లో కూర్చొమ్మని చెప్పిన గ్రంథం కాదు. ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన గ్రంథం. అది దృష్టిలో పెట్టుకోండి. పోయినప్పుడు చదవాల్సింది కాదు భగవద్గీత. బతికే దారి చూపించేది భగవద్గీత. జీవితాన్ని ఉత్తేజితం చేసేటువంటి భగవద్గీతను ఎవరన్నా పోయినప్పుడు చదువుతున్నామంటే మనం దాన్ని అవమానిస్తున్నట్టే. నేనొకసారి నెల్లూరులో ఒక సభలో పాల్గొన్నాను. అక్కడకి ఒక రాజకీయనేత వచ్చారు. అప్పటికింకా సభ ప్రారంభం కాలేదు. మైకులో నుంచి భగవద్గీత వినిపిస్తోంది. అప్పుడా రాజకీయనేత ‘ఇప్పుడు భగవద్గీత వేస్తున్నారేంటయ్యా! ఎవడైనా పోయాడా!’ అన్నాడు. నాయకుణ్ణి అని తప్పులేదు. మనస్సులో అలా పడిపోయింది. ఎవరైనా పోతే భగవద్గీత వేస్తారు. అది మాత్రమే తెలుసు. పోయాక ఎందుకండీ భగవద్గీత?
భగవంతుడు మనకు అమృతం పాత్రను అందిస్తే మనం దాన్ని ఆముదం సీసాను చేసేశాం. భగవద్గీతను నేర్చుకోండి. జీవితానికి ఉపయోగిస్తుంది. ‘జీవించి ఉండగా చదవండి. ప్రతిరోజూ చదవండి’ అంటే ‘పోయినప్పుడు చదివితే పుణ్యమమ్మా! సద్గతులు వస్తాయి’ అంటున్నారు. సద్గతులను చూసిన వాళ్లు లేరు, చెప్పిన వాళ్లు లేరు. ఊరికే వర్ణించుకోవడమే! ఎదురుగా కనిపిస్తున్న జీవితాన్ని వదిలేసి సద్గతి ఏమిటి? జీవితం కంటే సద్గతి ఉంటుందా? పోనీ ఇదంతా మాయ అని గ్రహించే వేదాంతం తెలుసా? అంటే అదీ తెలియదు. ఇది మాయ అంటే అంగీకరించం. నిజమే అంటాం. నిజమైన దాన్ని ఒప్పుకోకుండా వేరే దాని కోసం చూస్తున్నాం. వెరసి ఒక్కటే. మనకు ఉన్నది నచ్చదు. వేరేదేదో కావాలి! అది భ్రమైనా మంచిదే అదే కావాలి. దీన్ని వదిలేయాలి.
ఆత్మ అనేది నౌక. శరీరాలు యాత్రికుల లాంటివి. రైలెక్కిన వాళ్లు ప్రతి స్టేషన్లో కొంతమంది దిగిపోతూ ఉంటారు. ఇంకెవరో ఎక్కుతుంటారు. చిట్టచివరి స్టేషన్‌ ఉంటుంది. అక్కడ అందరూ దిగిపోతారు. అదే ప్రళయం. నౌక సముద్రంలో ఎంత వేగంగా పరిగెత్తినా ఇబ్బంది లేదు. కానీ నీరు పడవలో చేరకూడదు. నీట్లో పడవ ఉంటుంది. పడవలో నీరుంటే మునిగిపోతుంది. అంటే జీవితంలో మనం ఉండటం, ఇవన్నీ అనుభవించడం పెద్ద విషయం కాదు. ఇవన్నీ ఉండాలి. జీవితంలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మకు మరణం లేదు. ఈ శరీరం మాత్రమే నువ్వు కాదు. భీష్ముని శరీరంలో ఉన్నది నువ్వే. నా శరీరంలో ఉన్నది కూడా నువ్వే. అర్జునా! భగవద్గీతను నేను నీకెందుకు భోదిస్తున్నానంటే అందరి శరీరాల్లో ఉన్నది నేను అన్న విషయాన్ని గ్రహించాను. నువ్వు మాత్రం ఆ శరీరంలో ఉన్నానని అనుకుంటున్నావు. నువ్వు పరిమిత భావనతో ఉన్నావు. నేను అపరిమిత భావనతో ఉన్నాను. నువ్వు సంకుచిత భావనతో ఉన్నావు. నేను విశాల భావనతో ఉన్నాను. నువ్వు జీవాత్మ భావనతో ఉన్నావు. నేను పరమాత్మ భావనతో ఉన్నాను. నేను చెప్పే స్థానంలో ఉన్నాను. నువ్వు వినే స్థానంలో ఉన్నావు. నాలా ఆలోచిస్తే నా స్థానంలో నువ్వు ఉంటావు.
భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణ కవి ఇలా చెబుతున్నాడు:
‘ప్రాణిలోకంబు సంసారపతితమగుట
వసుధపై గిట్టి పుట్టని వాడు గలడె
వాని జన్మంబు సఫలము ఎవ్వాని వలన
వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కు’
పరివర్తని సంసారి వృతఃకోవా నజాయతే సజాతే ఏన జాతేన సమున్నతి
ఈ జీవులన్నీ పుడుతున్నాయి, చనిపోతున్నాయి. సముద్రంలో నీరు ఆవిరయింది. ఆవిరయిన నీరు మేఘంగా మారింది. మేఘం మళ్లీ వర్షించి, వంకగా మారింది. వంక, నదిగా మారి సముద్రంలో కలిసింది. అది దుర్గంధమైనా, సుగంధమైనా వాయువే. కళ్లలో కనిపించినా, యజ్ఞాగ్నిలో ఉన్నా, సిగరెట్‌ చివరన ఉన్నా అది అగ్ని తేజస్సే. అలాగే కుండీలో ఉన్నా, జాడీలో ఉన్నా, ఖాళీ జాగాలో ఉన్నా అది ఆకాశమే. మొత్తం పంచభూతాలన్నింటికీ ఇది వర్తించింది కదా! మరి పంచభూతాత్మకమైనదే శరీరం కదా! మరి ఈ సూత్రం అంతటికీ వర్తించదా! పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎవ్వరి వల్ల వాని వంశానికి కీర్తి వస్తుందో వాని జన్మ సఫలమవుతుంది. ఆ జన్మసాఫల్యం కోసమే మనం ప్రయత్నించాలి.

- డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు



















No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list