MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆషాఢమాసంలో చేసి తీరాల్సిన పనులు!_Ashadamasam



ఈ నాలుగు నెలలూ పవిత్రం!
ఆషాఢ మాసంలో ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో! తొలి ఏకాదశి, గురు పౌర్ణమి వంటి పర్వాలు ఈ మాసంలోనే వస్తాయి. ఆషాఢ మాసం మొదలు నాలుగు నెలలను చాతుర్మాసాలని పిలుస్తుంటారు. ఈ కాలంలో చాతుర్మాస్య వ్రతం ఆచరించడం ఒక సంప్రదాయం. మనిషి జీవన విధానాన్ని గాడిలో పెట్టే సాధనం... చాతుర్మాస్య వ్రతం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకూ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తుంటారు. కొందరు ఆషాఢ శుద్ధ ఏకాదశి (శయన ఏకాదశి) నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ పాటిస్తుంటారు.
చాతుర్మాస్య వ్రతాన్ని బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్న్యాసులు.. అందరూ ఆచరించే సంప్రదాయం ఉండేది. అయితే కాలక్రమంలో సన్న్యాసులు, సనాతన ధర్మాన్ని నిష్ఠగా ఆచరించే కొద్ది మంది మాత్రమే పాటిస్తున్నారు. ఆషాఢ మాసం నుంచి వర్షాలు మొదలవుతాయి. వాతావరణం ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయేలా ప్రేరేపిస్తుంటుంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే రక్షణ కవచమే చాతుర్మాస్య వ్రతం. దీనిని ఆచరించేవారు నాలుగు మాసాలు తానున్న ప్రదేశం పొలిమేర దాటకూడదు. రెండో నియమం నాలుగు నెలలూ ఒకే పూట భోజనం చేయాలి. అది కూడా తానే స్వయంగా వండుకోవాలి. విస్తట్లోనే తినాలి. అన్నింటి కన్నా.. చేయదలచిన భోజనం ఒకేసారి విస్తట్లో వడ్డించుకోవాలి. అంటే మారు వడ్డన పనికిరాదు. ఈ నాలుగు నెలలూ మధ్యాహ్నం పూట నిద్రించకూడదు. రాత్రి కూడా రెండో జాము వరకు భగవన్నామ స్మరణ చేసి అప్పుడు పడుకోవాలి.
ఈ నియమాలన్నీ మనిషిని సన్మార్గంలో నడిపించడానికి దోహదం చేసేవే. మితాహారం ఆరోగ్య కారకం. ఇంద్రియ నిగ్రహం ఆధ్యాత్మిక పురోగతికి దోహదం చేస్తుంది. నాలుగు నెలలు ఈ నియమాలు పాటించడం ద్వారా.. ఆ తర్వాతి కాలంలోనూ మనో నిగ్రహంతో ఉండగలుగుతారనే ఉద్దేశంతోనే చాతుర్మాస్య వ్రతాన్ని సూచించారు మన పెద్దలు.
ఆషాఢమాసంలో
      చేసి తీరాల్సిన పనులు!
వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది. ఆ ఆషాఢమాసంతో తనతో కొన్ని ఆచారాలనూ తీసుకువస్తుంది. అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చుగాక, ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చుగాక! కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనకా ఓ కారణం కనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి...

పేలాల పిండి

ఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫసంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే! ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తికి మెరుగుపరుస్తాయి. వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం, యాలుకలు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఆషాఢంలో వచ్చే తొలిఏకాదశి రోజున తప్పకుండా పేలాలపిండి తినాలని చెబుతూ ఉంటారు.

మునగాకు

మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చింది. లేత మునగాకు తింటే కంటిసమస్యలన్నీ తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ మునగాకు చేదుగా ఉంటుంది. పైగా విపరీతమైన వేడి. అలాంటి మునగాకుని తినేందుకే ఇదే అనువైన కాలం. లేత మునగాకు దొరకాలన్నా, ఒంట్లో వేడి పెరిగినా ఫర్వాలేదనుకున్నా... వర్షాకాలమే అనువైన సమయం. మునగాకుతో బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడినీ పెంచినట్లవుతుంది. అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశమూ దక్కుతుంది.

దానాలు

ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం, పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెబుతుంటారు. కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు. ముఖ్యంగా గొడుకు, చెప్పులు దానం చేయమని సూచిస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ రెండు వస్తువులూ ఎంత అవసరమో చెప్పనవసరం లేదు కదా!

సముద్రస్నానాలు

ఆకామావై పేరుతో సముద్రస్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢమాసాన్ని పేర్కొంటారు. ఆషాఢం వరకూ సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. వర్షరుతువుతో పాటుగా అందులోకి కొత్త నీరు చేరుతుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోకి చేరే సమయంలో మొక్కలు, ఖనిజాలలో ఉన్న ఔషధగుణాలని తనతో పాటుగా తీసుకువస్తుంది. అలాంటి సముద్రస్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది.

గోరింటాకు

ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయన్న విషయం తెలిసిందే! అలా తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు. ఇక పొలం పనులలో పాల్గొనేవారైతే రోజూ నీటిలో తడవక తప్పదు. దాంతో గోళ్లు సందున నీరు చేరి చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గోళ్లు కూడా పెళుసుబారిపోతాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసే సత్తా గోరింటాకుకి ఉంది. పైగా గోరిటాకుని పెట్టుకోవడం వల్ల కఫసంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెబుతుంటారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list