MohanPublications Print Books Online store clik Here Devullu.com

ముక్తిపథ జలధార-Mukthi Padha Jaladwara



ముక్తిపథ జలధార


తిరుమల శేషాచలం కొండల్లో వెలసిన అద్భుతమైన తీర్థాల్లో కుమార ధార తీర్థం ఒకటి. భౌగోళిక కళాఖండంగా అలరారుతోంది ఈ తీర్థరాజం. వైష్ణవ వైభవానికి చిహ్నంగా ఉన్న తిరుమలలో పశుపతి తనయుడైన కుమారస్వామి పేరిట తీర్థం ఉండటం.. శివకేశవ అభేదాన్ని చాటుతోంది. దైవం ద్వంద్వాతీతుడన్న సత్యానికి ఇది నిదర్శనంగా కనిపిస్తుంది.

పాపనాశనం డ్యామ్‌ నుంచి వాయవ్య దిశలో ఉంటుంది కుమారధార తీర్థం. కాలినడకన నాలుగైదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. దట్టమైన అరణ్యంలో.. భారీ కొండల నడుమ... మార్మికమైన బిలంలా కనిపించే ఈ కందకం.. ప్రాకృతిక సౌందర్యానికి మచ్చుతునక. చుట్టూ పోతపోసినట్టు ఉన్న రాతికుడ్యాల మధ్య తళుక్కున మెరుస్తూ జలజల జారే సున్నితమైన జలపాతాన్ని చూడటంతోనే మనసు పులకితమవుతుంది. ఈ పుణ్యజలాల కింద స్నానమాచరించడానికి తపోధనులు, దేవతలు కూడా వస్తుంటారని చెబుతుంటారు.

యౌవన ప్రదాత
తిరుమల మహాత్మ్యంలో పేర్కొన్న 26 ముఖ్య తీర్థాల్లో కుమారధార ఒకటి. వేంకటాచలంలో ముక్తిపథ తీర్థాలుగా పేరెన్నికగన్న తొమ్మిదింటిలో దీనికీ స్థానం ఉంది. కుమారధార వైభవం గురించి వరాహ, వామన, పద్మ పురాణాల్లో ప్రస్తావించారు. పూర్వం ఒకానొక ముసలి బ్రాహ్మణుడు.. తప్పిపోయిన తన కుమారుడైన కౌండిన్యుడి కోసం వెతుకుతూ, వెతుకుతూ ఏడు కొండలు చేరుకున్నాడట. అప్పుడు వేంకటేశ్వరస్వామి మానవ రూపం ధరించి ఆ పెద్దాయనకు ఎదురుపడ్డాడు. ‘తాతా! నీకు ఇంకా బతకాలనే ఆకాంక్ష ఉన్నట్టుందే! కొడుకు కోసం ఏమిటీ ఆరాటం’ అని ప్రశ్నించాడు.

అప్పుడా బ్రాహ్మణుడు.. ‘నాయనా! నాకు నిజంగానే బతకాలని ఉంది. ఈ జీవితంపై వ్యామోహంతో ఈ మాట చెప్పడం లేదు. దేవతలు, రుషులు ఎలాగైతే పరమాత్ముని ఎల్లకాలం సేవిస్తుంటారో నాకూ అలాంటి భాగ్యం కావాలని ఉంది. అందుకు దేహం అవసరం. పితృకార్యాలు, దైవకార్యాలు నిర్వర్తించడానికి నాకు కొడుకు అవసరం’ అని బదులిచ్చాడట. ఆ జవాబుకు ప్రసన్నుడైన బాలాజీ.. ఆ బ్రాహ్మణుణ్ణి అక్కడికి సమీపంలో ఉన్న ఒక తీర్థానికి తీసుకెళ్లి స్నానం చేయమన్నాడట. అందులో మునక వేయగానే ముదుసలి బ్రాహ్మణుడు యౌవనవంతుడయ్యాడట. అతడి కుమారుడిని చూపించి.. ఆధ్యాత్మిక మార్గంలో సాగమని ఆశీర్వదించాడట. ముసలివానికి యౌవనాన్ని ప్రసాదించిన కారణంగా.. దీనికి కుమార తీర్థం అని పేరువచ్చిందని వరాహ పురాణం పేర్కొంది.

కుమారస్వామి తపస్సు
ఈ తీర్థానికి సమీపంలోని గుహలో కుమారస్వామి విగ్రహం ఉంది. తీర్థంలో స్నానమాచరించిన భక్తులు కుమారస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. తారకాసరుణ్ణి సంహరించడంతో కుమారస్వామికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దోష నివారణార్థం వేంకటాచలం వెళ్లి శ్రీహరికై తపస్సు చేయమన్నాడట శివుడు. తండ్రి మాట మేరకు కుమారస్వామి ఈ తీర్థం సమీపంలో కఠోర తపస్సు ఆచరించాడట. కొన్నాళ్లకు విష్ణుమూర్తి ప్రత్యక్షమై కుమారస్వామిని అనుగ్రహించాడట. కుమారస్వామి తపమాచరించిన తీర్థం కావడంతో దీనికి ‘కుమారధార’ అని పేరు వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది.

మాఘ మాసంలో ముక్కోటి
కుమారధార ప్రయాణం సంక్లిష్టంగా ఉంటుంది. అయినా భక్తులు ఏ మాత్రం వెరవకుండా ఇక్కడికి చేరుకుంటారు. మూడు నాలుగు మార్గాల ద్వారా ఈ తీర్థానికి చేరుకోవచ్చు. జాపాలి తీర్థం నుంచి ఇక్కడికి దారి ఉంది. తలకోన నుంచి అరణ్య మార్గంలో రావచ్చు. అన్నదమ్ముల బండ, గొల్లోళ్ల రచ్చ మీదుగా కుమారధార తీర్థానికి చేరుకోవచ్చు. అయితే సాహసాలకు సిద్ధపడిన యాత్రికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. పాప నాశనం డ్యామ్‌ మీదుగా రావడానికి ఆసక్తి కనబరుస్తారు. ఏటా మాఘ మాసంలో మఖా నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి రోజున కుమారధార తీర్థానికి ముక్కోటి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో అశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తారు.

కుమారధారకు సమీపంలో పసుపుధార తీర్థం ఉంటుంది. వర్షరుతువులో ఈ తీర్థాల గుండా భారీగా నీళ్లు ప్రవహిస్తుంటాయి. అందుకే ఈ తీర్థాలకు సమీపంలో కుమారధార డ్యామ్‌ నిర్మించారు. ఏడాది పొడుగునా జలకళతో అలరారే కుమారధార డ్యామ్‌ తిరుమలకు వచ్చే భక్తుల తాగునీటి అవసరాలను తీరుస్తోంది.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list