MohanPublications Print Books Online store clik Here Devullu.com

సంక్రాంతి వైభవం_sankranti

సంక్రాంతి వైభవం 
సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా పరిగణించిన సనాతన సిద్ధాంతంలో- ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. ఈ సంక్రమణ ఘడియలకు ముందు వెనకల కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. 
మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం అటుంచి, కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైనదని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయమిది. దేశమంతటా ఈ పర్వానికి ప్రాముఖ్యమున్నా, పద్ధతుల్లో విభిన్నత్వం కనిపిస్తుంది. 
‘తిల సంక్రాంతి’గా కొన్నిచోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి, పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతే కాక తెల్ల నువ్వుల్ని, మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకొనే సంప్రదాయం ఉంది. 
వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో పంట చేతికందే సందర్భమిది. సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. దైవీయమైన పవిత్రతతో పాటు, మానవీయమైన సత్సంబంధాల సౌహార్దమూ ఈ పండుగల సత్సంప్రదాయాల్లో మేళవిస్తుంది. 
రంగవల్లుల శోభలో దివ్యత్వంతో పాటు కళానైపుణ్యం కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముంగిలీ ఒక పత్రంగా, చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. 
స్నానం, దానం, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు- సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞతను, ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ సంక్రమణానికి ప్రాధాన్యముంది. ఈ పుణ్యదినాన పంచుకున్నవి, ఇచ్చినవి అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తోంది. 
కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా- మంచి వృష్టిని, ఆరోగ్యాన్ని, సస్య సంపదలను ప్రసాదిస్తుందని పంచాంగ శాస్త్రం చెప్పిన ఫలశ్రుతి. ఈరోజు శివుడికి ఆవునేతితో అభిషేకం, నువ్వుల నూనె దీపం, బియ్యం కలిపిన తిలలతో పూజ, తిలలతో కూడిన పదార్థాల నివేదన- శాస్త్రం చెప్పిన విధులు. 
పుణ్యస్నానాలకు మకర మాసం (చాంద్రమానం ప్రకారం రానున్న మాఘం) ప్రముఖ మైనది కనుక- ఈ రోజు నుంచి నదీ స్నానాదుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే గంగా-యమునా-సరస్వతుల సంగమమైన త్రివేణీ తీర్థస్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం. ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం విశేష ఫలప్రదం. అది కుదరనివారు గృహంలో భగవత్‌ స్మరణతో, స్నానమంత్రాలతో స్నానం చేస్తారు. దానాల్లో ఈ రోజున వస్త్రధానానికి ప్రాధాన్యం ఇస్తారు. 
దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతోంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం, శక్తి... ఈ రెండూ సౌరశక్తి విశేషాలు. వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పర్వాన సౌరశక్తి ఉపాసనను పేర్కొన్నారు. సూర్యుణ్ని నారాయణుడిగా; శోభను, శక్తిని పోషించే ఆయన మహిమను ‘లక్ష్మి’గా సంభావించారు. 
సంక్రాంతినాటి సూర్య శోభయే కాక, పంటల శోభ, సంపదల పుష్టి... అన్నీ కలిసి సంక్రాంతి లక్ష్మీభావన. శాస్త్రీయమైన సత్కర్మలు, సంప్రదాయసిద్ధమైన కళలు, ఉత్సాహాల ఉత్సవాలు, బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు- వెరసి సంక్రాంతి వైభవాలు!
- సామవేదం షణ్ముఖశర్మ








సంక్రాంతి

రంగు రంగుల హరివిల్లులతో, రివ్వురివ్వున ఎగిరే గాలిపటాలతో, ఇంటికొచ్చే హరిదాసులతో, అందంగా అలంకరించిన బసవన్నలతో కనువిందు చేసే తెలుగు వెలుగుల కాంతి మన రంగవల్లుల సంక్రాంతి.   ఆప్యాయతలతో అనురాగాలతో ప్రేమానుబంధాలతో అసలు సిసలైన ఆనందాల  పూతోట మన ప్రియమైన సంక్రాంతి. వన్నెలద్దుకున్న గుమ్మాల వింతకాంతులతో కళకళలాడే నట్టింటి సోయగం మన ముచ్చటైన సంక్రాంతి. మావిడాకులతో, పూబంతీ చామంతులతో, తోరణాలతో అలంకరించుకున్న పందిరి మన పచ్చదనాల సంక్రాంతి. కొత్త అల్లుళ్ళతో, కొంటెమరదళ్ళతో మేళవించుకున్న సన్నాయి రాగం మన ఆట పాటల సంక్రాంతి. కోళ్ల పందాలతో, ఎడ్ల పందాలతో ఊరంతా çహోరెత్తిపోయే సంతోషాల వడి ఈ సంబరాల సంక్రాంతి.  నేతి అరిసెలతో కొబ్బరిబూరెలతో కలగలపు కూరలతో ఘుమఘుమలాడించే అరిటాకు భోజనం మన కమ్మనైన సంక్రాంతి.  ఊరంతా పేరంటాలతో వాడంతా ఉత్సవాలతో ఇళ్లన్నీ కొత్త కాంతులతో అంబరాన్నంటే ముంగిళ్ల కాంతి మన తెలుగు ఇంటి మమకారాల సంక్రాంతి. సంక్రాంతి సిసలైన రైతుల పండగ. శ్రామికుల పండగ. అల్లుళ్ల పండగ.

పితృదేవతల పండగ. పిల్లల పండగ. పెద్దలు, వృద్ధుల పండగ. బీదాబిక్కి పండగ. కళకళలాడుతున్న పంటపొలాలను, పండబోయే దిగుబడిని తలుచుకొని సంతోషపడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంపదకు గొప్ప స్థానమిచ్చే ఈ సంక్రాంతి పండుగను బీద, గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకుంటారు. కర్షకులు ఆనందంలో పాలుపంచుకుంటారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల సంగతి చెప్పనక్కరలేదు.

ఈ రోజు ఏం చేయాలంటే..?

సంక్రాంతి నాడు చేసే స్నాన, దాన, జపాదులు విశేష ఫలదాయకం. అన్నిటికన్నా ఉదయ కాల స్నానం ముఖ్యం. సంక్రాంతి నాడు స్నానం చేయని వారికి వ్యాధులు సంక్రమిస్తాయని శాస్త్రోక్తి. స్నానం చేసిన తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వులు, బియ్యం కలిపి శివుని అర్చించిన పిమ్మట ఆవునేతితో అభిషేకం చేయాలి. విష్ణువును, పౌష్యలక్ష్మిని పూజించి విష్ణుసహస్ర నామ పఠనం చేయాలి. తర్వాత లోకబాంధవుడు, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుడిని పూజించి కొత్తబియ్యంతో పొంగలి, పులగం  తయారుచేసి, పాలు పొంగించి భక్తిప్రపత్తులతో ఆయనకు నివేదించడం శుభప్రదం. భోజనంలో మంచి గుమ్మడి కూర ఉండేట్లు చూసుకోవాలి. చక్కెర పాకంలో నువ్వులు కలిపి చేసిన మిఠాయిలు తినడం, వాటిని చుట్టుపక్కల వారికి, స్నేహితులకు, హితులకు పంచిపెట్టడం వల్ల బాంధవ్యాలు పెంపొందుతాయి. మకర సంక్రాంతి పితృపూజలకు అనుకూలమైన దినం కాబట్టి నువ్వులతో పితరులకు తర్పణ విడవాలి. పితృదేవతలకు పుణ్యప్రదమైన ఈ సంక్రమణం కాలంలో ఒకపూట భోజనం చేయడం మంచిది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list